ఆంధ్రప్రదేశ్పశుపోషణవార్తలు

పౌల్ట్రీ రైతుల సంక్షేమానికి పెద్దపీట

0
  •  రూ.657 కోట్ల ప్యాకేజీతో రంగం బలోపేతం.. పాలసీని వేగంగా అమలు చేస్తాం.
  • ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లు.
  • ఆధునిక పౌల్ట్రీ ఫారాలకు భారీ ప్రోత్సాహకాలు.
  • మొక్కజొన్న ధరల నియంత్రణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి.
  • పౌల్ట్రీ అసోసియేషన్ స‌భ్యుల‌తో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
               రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలసీకి ఆమోదం తెలిపిన సందర్భంగా పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలసీని త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి నూతన ఊతం అందించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పాదకతను పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పాలసీని రూపొందించినట్లు తెలిపారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని వివరించారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రోత్సాహకాల కోసం రూ.209 కోట్లు, ఇండస్ట్రియల్ పాలసీ కింద రూ.152.18 కోట్లు, పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేయనున్న కార్యక్రమాలకు రూ.296 కోట్లు కేటాయించనున్నారు. కోళ్ల ఫారాలు, హేచరీల మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకునే రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నామని, ఇందుకోసం మూడేళ్ల కాలానికి రూ.72 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పౌల్ట్రీ రైతుల విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు లో-టెన్షన్ కోళ్ల ఫారాలకు యూనిట్‌కు రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ యూనిట్లకు యూనిట్‌కు రూ.4.75 చొప్పున టారిఫ్‌ను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ షెడ్లకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీ అందించనున్నాం. ఇప్పటికే ఉన్న పౌల్ట్రీ షెడ్లను ఆధునీకరించేందుకు కూడా 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీ అందించేలా ప్రతిపాదించాం. అర్హత కలిగిన EC పౌల్ట్రీ ఫారాలకు టర్మ్ లోన్లపై వడ్డీ సబ్సిడీతో పాటు విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 వరకు, సంవత్సరానికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు, మూడు సంవత్సరాల పాటు విద్యుత్ టారిఫ్ సబ్సిడీ అందించనున్నాం. అలాగే నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (NLM) కింద అర్హత కలిగిన ప్రాజెక్టులకు 50 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు అందించే అవకాశం కల్పించాం అని మంత్రి తెలిపారు.
గ్రామీణ మహిళలకు ఉపాధి, అదనపు ఆదాయం కల్పించేందుకు బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. SERP, DRDAల ఆధ్వర్యంలో మహిళలకు 30–45 రోజుల శిక్షణ, వ్యాక్సినేషన్, డే-ఓల్డ్ చిక్స్ సరఫరా వంటి సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. పౌల్ట్రీ ఉత్పత్తులకు విలువ జోడించి మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు PPP విధానంలో ఎగ్, చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలను కేంద్రాలుగా చేసుకుని చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి గతంలో ఉన్న డెవలప్‌మెంట్, బెటర్‌మెంట్ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించి, మున్సిపాలిటీలు, అర్బన్ అథారిటీల పరిధిలో గ్రామ పంచాయతీలకు సమానమైన తక్కువ ఫీజులతో అనుమతులు పొందేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మొక్కజొన్న ధరల పెరుగుదల కూడా ఒకటని పేర్కొన్న మంత్రి, ఫీడ్ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నూక బియ్యాన్ని పౌల్ట్రీ ఫారాలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత శాఖల సమన్వయంతో రాష్ట్ర పౌల్ట్రీ రంగాన్ని దేశంలోనే మరింత అభివృద్ధి చెందిన రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Leave Your Comments

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం… మంత్రి తుమ్మల

Previous article

ఎల్-నినోను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు

Next article

You may also like