తెలంగాణవార్తలు

ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరిన మంత్రి తుమ్మల

0
  • ఆయిల్‌పామ్ రైతుల సమస్యలు, విధానపరమైన నిర్ణయాలపై చర్చకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి.
  • దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో సమావేశానికి సమయం ఇవ్వాలని మంత్రి తుమ్మల లేఖ.
                 ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బుధవారం లేఖలు రాశారు.
             ప్రధానమంత్రి ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్‌పామ్ (NMEO-OP) దేశాన్ని వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తున్న కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయిల్‌పామ్ విస్తీర్ణంలో 75 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నిర్దేశించిన 1.45 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 0.98 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు.
              అయితే, కనీస హామీ ధర (MGP), దిగుమతి సుంకాల స్థిర విధానం, నాణ్యమైన మొలకల లభ్యత, NMEO-OP కింద ఆర్థిక సహాయాలు వంటి అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. రైతులకు స్థిరమైన విధాన భరోసా కల్పిస్తేనే ఆయిల్‌పామ్ సాగు విస్తరణ వేగవంతమై, దేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు.
                      ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలలోనే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కూడిన బృందానికి ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను, రైతుల అభిప్రాయాలను, ఆయిల్‌పామ్ రంగ అభివృద్ధికి అవసరమైన విధాన సూచనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
            ఈ సందర్భంగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కూడా మంత్రి లేఖ రాశారు. ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో సహకరించాలని లేఖద్వారా కోరారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో జరిగే ఈ సమావేశం ఆయిల్‌పామ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Leave Your Comments

సీడ్ కంపెనీలు మరియు ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం

Previous article

You may also like