- పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల.
- జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం.
- సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి.
- యూరియా వినియోగం తగ్గించి, భూమి సారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి.
- నల్లబీడు భూముల పునరుద్ధరణకు జిప్సం వినియోగించాలి.
- రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు వస్త్ర శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు నిర్వహించిన “రైతునేస్తం” కార్యక్రమంలో పాల్గొని రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులతో ముఖాముఖి మాట్లాడి, పంటల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, భూసారం పెంపు చర్యలు, అధిక ఆదాయం వచ్చే పంటలపై అవగాహన కల్పించారు.
మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోందన్నారు. రైతులు వీటిని విస్తృతంగా వినియోగించి భూమిలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ పంటలను దున్నిపెట్టడం ద్వారా భూమి సారవంతం అవుతుందని, రసాయన ఎరువుల అవసరం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.
పచ్చిరొట్ట పంటల వినియోగంతో యూరియా వాడకం తగ్గడమే కాకుండా, యూరియా వాడినప్పటికంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని మంత్రి తెలిపారు. దీని వల్ల రైతుల సాగు ఖర్చులు తగ్గి, భూమి ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలంలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
నల్లబీడు భూముల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు :-
రాష్ట్రంలో సుమారు 1.26 లక్షల ఎకరాల నల్లబీడు (ఆల్కలైన్) భూములు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి భూముల్లో జిప్సం వినియోగించడం ద్వారా నేల గుణాత్మకత మెరుగుపడి, సాగుకు అనుకూలంగా మారుతుందని చెప్పారు. భూమి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అనుసరించడంలో రైతులు ముందుండాలని పిలుపునిచ్చారు.
అధిక ఆదాయ పంటల సాగుకు ప్రాధాన్యం :-
రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా అధిక దిగుబడి, అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తోందన్నారు. ఆయిల్ పామ్ తోటల మధ్య వరి, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలతో పాటు కోకో, వక్క వంటి వాణిజ్య పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఒకే భూమిలో బహుళ ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
రైతుల అనుభవాలను తెలుసుకున్న మంత్రి :-
కార్యక్రమంలో పచ్చిరొట్ట వినియోగం, జిప్సం వాడకం, ఆయిల్ పామ్ సాగుతో మంచి ఫలితాలు సాధించిన రైతుల అనుభవాలను మంత్రి ఆసక్తిగా విన్నారు.
సిద్ధిపేట జిల్లా రైతు మహేందర్ అనుభవం :-
సిద్ధిపేట జిల్లా కొహెడ మండలానికి చెందిన మహేందర్ అనే రైతు మాట్లాడుతూ తన పొలంలో పచ్చిరొట్ట పంటలు ఉపయోగించడం వల్ల యూరియా వినియోగం తగ్గడంతో పాటు దిగుబడి గణనీయంగా పెరిగిందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా రైతు సూర్యారెడ్డి అనుభవం :-
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలానికి చెందిన సూర్యారెడ్డి మాట్లాడుతూ తాను జీలుగ, జనుము, పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తున్నానని, వాటి వల్ల భూసారం పెరిగి యూరియా ఆధారిత సాగుతో పోలిస్తే మెరుగైన దిగుబడులు వచ్చాయని వివరించారు.
ఖమ్మం జిల్లా రైతు మహేష్ స్ఫూర్తిదాయక ప్రయాణం :-
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలాపేటకు చెందిన మహేష్ అనే రైతు తన అనుభవాన్ని పంచుకుంటూ, కరోనా సమయంలో సంవత్సరానికి రూ.36 లక్షల వేతనం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చానని తెలిపారు. స్థానికంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను చూసి ప్రేరణ పొంది తాను కూడా ఆయిల్ పామ్ సాగు ప్రారంభించానని చెప్పారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో సంపాదించిన దానికంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నానని, వ్యవసాయం ద్వారా ఆర్థిక లాభంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సాధ్యమైందని తెలిపారు. రోజుకు 8–9 గంటలు కుర్చీలో కూర్చొని పని చేసే అవసరం లేకుండా, వ్యవసాయం ద్వారా శారీరక వ్యాయామం కూడా లభిస్తోందని అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహేష్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, యువత రైతాంగంలోకి వచ్చి ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే వ్యవసాయం అత్యంత లాభదాయక రంగంగా మారుతుందని చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరూ మహేష్ను ఆదర్శంగా తీసుకుని ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది :-
రైతుల ఆదాయం పెంపు, భూమి ఆరోగ్య సంరక్షణ, సహజ వనరుల సమర్థ వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు లక్ష్యాలతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. శాస్త్రీయ వ్యవసాయం, సేంద్రియ పద్ధతులు, మార్కెట్ ఆధారిత పంటల ఎంపిక ద్వారా రైతులు మరింత లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Leave Your Comments
























