రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో నీటి ఒత్తిడి పరిస్థితులపై ఇప్పటికే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్లు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 37 వేల హెక్టార్ల స్వీట్ ఆరెంజ్ తోటలు ఉండగా, అందులో 2,260 హెక్టార్లలో సాగునీటి సమస్యను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు లైవ్ మల్చింగ్, వీడ్ మ్యాట్ వినియోగం, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట్ల నీటిని తరలించి జీవనాధార నీటి సరఫరా చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా మూడు గ్రామాల్లో 875 హెక్టార్లలో తీవ్రమైన నీటి కొరత నెలకొన్నదని, రైతులు భారీ వ్యయంతో నీటిని తరలించి తోటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే రవాణా వ్యయం అధికంగా ఉండటం, ఇతర ప్రాంతాల్లో కూడా తోటలు ఉండటంతో ఇద్దరు రైతులు కలిపి సుమారు 4.5 హెక్టార్ల తోటలను వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్లో నీటి కొరత కారణంగా ఆయా గ్రామాల చెరువులు నింపబడలేదని, చెరువులు నింపగలిగితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఈ మొత్తం అంశంపై జిల్లా కలెక్టర్కు సమాచారం అందించామని, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే యాడికి మండలంలో కూడా కొన్ని నెలల క్రితం ఆమ్ల నిమ్మ పంటకు సాగునీటి సమస్య ఏర్పడిందని గుర్తుచేశారు. రైతులు నీటిని తరలించి పంటలను కాపాడుకోవడంతో పాటు, ప్రస్తుతం ఆమ్ల నిమ్మ ధరలు అధికంగా ఉండటం వల్ల వారికి మంచి ఆదాయం లభించిందని చెప్పారు. రైతులు తీవ్ర ఆర్థిక భారం భరించి పంటలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో, వారికి నీటి రవాణా ఖర్చు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
Leave Your Comments
























