వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ సొంత నిధులతో 85 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించనుంది. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ గిడ్డంగులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మార్కెట్ పరిస్థితులను అనుసరించి రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. భూముల మార్పిడి ద్వారా ప్రభుత్వ ఆస్తులు సమర్థవంతంగా వినియోగంలోకి రావడంతో పాటు రైతులకు మరింత మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
Leave Your Comments























