అర్కాసవి అనే గులాబీ జాతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (IIHR) బెంగళూరు వారు వినూత్నంగా రూపొందించిన ఒక కొత్త గులాబీ రకం.
విశేష లక్షణాలు…..
అర్కాసవి అనే గులాబీ “ఫ్లోరిబండ” అనే గులాబీ జాతికి చెందినటువంటిది. ఈ గులాబీ రకం గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తూ ఆకర్షణీయమైనటువంటి పింక్ రంగులో ఉండడం దీని విశేష గుణము. ఈ రకం పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తూ మధ్యస్థ పరిమాణం కలిగి మెత్తటి టెక్చర్ తోటి ఉంటాయి. ఈ రకం యొక్క అత్యంత విశేషమైన గుణం ఏంటంటే ఈ పువ్వులు అత్యధిక నిల్వ శాతాన్ని కలిగి ఉంటాయి, కోసిన తర్వాత ఐదు నుండి ఆరు రోజుల వరకు తాజాగా ఉండడం వీటి లక్షణం, మరి ఏ గులాబీ రకాన్ని చూసిన ఇంత ఎక్కువ నిలవ గుణాన్ని కలిగి ఉండదు. దీనివలన ఈ రకాన్ని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి, దండలు తయారీలోనూ, వివిధ రకాల పుష్పగుచ్చాల అమరికల్లోనూ దీన్ని ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. మొక్క ఎదుగుదలను గమనించుకున్నట్లయితే ఇది ఎక్కువగా పొదలాగా 5 నుండి 6 అడుగుల ఎత్తు ఎదిగే గుణం కలిగి ఉంటుంది. కొమ్మలు ఎంతో దృఢంగా ఉండడం వల్ల వీటి మీద వచ్చే పువ్వులు కూడా అధిక దృఢంగా ఉంటాయి. ఈ రకం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఈ రకం ఎంతో సులభంగా సాగు చేయవచ్చు.
స్థలాన్ని ఎంచుకోవడం :-
ఈ రకం సాగు చేయదలచిన రైతులు నీరు నిలవ ఉండని నేలలు, సారవంతమైన ఇసుక మట్టి నేలలు, నేల ఉదజని సూచిక 5. 5 నుండి 6. 5 ఉన్నట్లయితే సరిపోతుంది. ఎంచుకున్న స్థలం పూర్తి ఎండ తగిలే విధంగా ఉండాలి రోజుకి కనీసం 6 నుండి 8 గంటలు సూర్యరశ్మి తగిలే విధంగా ఉండాలి. ఈ రకం సాగు చేయడం కోసం ఎత్తయిన బెడ్లను మూడు అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగు ఎత్తు ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి . ఈ విధంగా తయారు చేసుకున్నాక పేడ లేదా వర్మి కంపోస్ట్ బెడ్ల మీద కలియబెట్టాలి.
మొక్కలు నాటడం :-
మొక్కలు నాటడానికి వర్షాకాలం ఎంతో అనువైనది, వర్షాకాలంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మధ్యాహ్నం ఎండ బారి నుంచి లేత మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ రకం సాగు చేసుకోవడానికి వరుసకి వరుసకి మధ్య 8 అడుగుల దూరం అలాగే మొక్కకి మొక్కకి మధ్య 2 – 3 అడుగుల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి. ఈ విధంగా నాటుకున్నట్లయితే చెట్ల చుట్టూ గాలి బాగా ప్రసరించి చెట్టు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
నీటి యాజమాన్యం :-
మొక్కలు నాటిన తర్వాత నుంచి ఆరు నెలల వరకు నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. ఈ ఎత్తైన బెడ్ల మీద బిందు సేద్యం ద్వారా నీటిని అందించినట్లయితే మొక్కలు నీటిని బాగా తీసుకొని మంచి వేరు వ్యవస్థ ఏర్పడి తద్వారా మొక్కలు బాగా పెరుగుతాయి. బిందు సేద్యం ద్వారా నీటిని అందించినట్లయితే మొక్క మీద నీళ్లు పడకుండా ఉండి చీడపీడల నుంచి మొక్కలను రక్షించవచ్చు. మొక్కల చుట్టూ ఎప్పుడూ తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం :-
మొక్కలు ఏపుగా ఎదగడానికి సేంద్రీయ ఎరువులు మరియు రసాయన ఎరువులను తగిన మోతాదులో ఇవ్వాలి. నేల లోని పోషక విలువల ఆధారంగా ఒక్కొక్క మొక్కకు 5-10 కిలోల పశువుల పేడ లేదా వాన పాముల ఎరువు (వర్మీ కంపోస్ట్) వేసుకోవాలి. మొదటి నాలుగు నుంచి ఆరు వారాలు మొక్క ఎదుగుదలలో అత్యంత కీలకం కాబట్టి సూచించిన ఎరువులను తప్పనిసరిగా అందించాలి. దీని కోసం N:P:K. 240:80:280 కిలో/ఎకరాకు, సూక్ష్మ పోషకాలైనటువంటి FeSO4 మరియు ZnSO4 1 గ్రా. / మొక్క మరియు 10 గ్రా. MgSO4 ఒక్కొక్క మొక్కకు ఒక సంవత్సరంలో రెండు నుంచి మూడుసార్లు వేయాలి.
కొమ్మ కత్తిరింపులు :-
మొక్కలు నాటిన తర్వాత ఏదైనా మొగ్గలు ఉన్నట్లయితే వెంటనే వాటిని తుంచేయాలి, నాటిన 45 రోజుల తర్వాత ప్రతి మొక్కకు నాలుగు ఐదు దృఢమైన కొమ్మలు ఉండేలాగా చూసుకొని మిగిలినవి కత్తిరించేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొక్క ఆకృతి సరిగ్గా ఉండి గాలి ప్రసరణ బాగా జరిగి మొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది.
ఇదేవిధంగా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే ఏదైనా విరిగిపోయిన కొమ్మలు లేదా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకోవాలి. కొమ్మలు కత్తిరించిన వెంటనే కత్తిరించినచోట కాపర్ ఆక్సి క్లోరైడ్ మిశ్రమాన్ని పూయాలి. ఈ చెట్టుకు పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తాయి కాబట్టి పువ్వుల కోత అయిపోయిన తర్వాత కొమ్మలను కత్తిరించుకోవాలి తద్వారా వచ్చే సీజన్ కోసం మంచి కొమ్మలు తయారై అధిక పూల దిగుబడి వస్తుంది.
పురుగులు-తెగుళ్ల యాజమాన్యం :-
ముఖ్యంగా గులాబీలో పురుగులను చూసుకున్నట్లయితే తెల్ల దోమ మరియు నల్లి ఎక్కువగా ఆశిస్తాయి వీటికోసం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (IPM) చర్యలను పాటించాలి. జిగురు అట్టలు వినియోగించడం వేప నూనె మరియు సేంద్రియంగా తయారు చేసిన కషాయాలను పిచికారి చేయడం వల్ల వీటి భారి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. మొక్కలను ప్రధాన పొలంలో నాటేటప్పుడు మొక్కల మధ్య మరియు వరుసల మధ్య సరైన దూరాన్ని పాటించినట్లయితే తెగుళ్ల బారి నుంచి చాలా వరకు కాపాడవచ్చు. సరియైన ఎరువులు మరియు నీటి యాజమాన్యాన్ని చేసినట్లయితే ఈ పురుగు మరియు తెగుళ్ళ బారి నుంచి చాలా వరకు మొక్కలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది.
దిగుబడి :-
అర్కాసవి గులాబీ రకం ఒక ఎకరానికి 30 టన్నుల పూల దిగుబడిని ఇస్తుంది. ఈ రకానికి అధిక నిల్వగుణం ఇచ్చే లక్షణం, తెగుళ్లు మరియు పురుగుల బారిన తక్కువ పడడం వల్ల రైతులకు పంట ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ లాభాలను గడించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు తమ పొలంలో కూడా అర్కాసవి గులాబీ రకం సాగు చేసి అధిక దిగిబడులను పొందాలని ఆశిస్తున్నాము.
అర్కా సవి సాగులో రైతు నాగచంద్రుడు గారి విజయ గాధ :-
బి.నాగచంద్రుడు గారు ఖమ్మం జిల్లాలోని, ముష్టి గుంట గ్రామంలో అర్కా సవి గులాబీ రకాన్ని ఒకటిన్నర ఎకరంలో 2023లో వేసుకున్నారు. ఈ రకం యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్న రైతు తమ 10 ఎకరాల్లో 1.5 ఎకరాల్లో 3,500 మొక్కల్ని 6×3 అడుగుల దూరంలో వేసుకున్నారు. మొదటి సంవత్సరంకిగాను రైతు మొక్కలు కొనుగోలు చేయడానికి, 10 నుండి 15 టన్నుల పశువుల ఎరువు కి, బిందు సేద్యం ఏర్పాటు చేయడానికి మరియు మల్చింగ్ విధానం అమర్చడానికి 10 లక్షల వరకు సాగు ఖర్చు అయింది.
సాగు ఖర్చు నిమిత్తం, మొక్కలు కొనుగోలు చేయడానికి, 10 నుండి 15 టన్నుల పశువుల ఎరువు కి, బిందు సేద్యం ఏర్పాటు చేయడానికి మరియు మల్చింగ్ విధానం అమర్చడానికి ఖర్చయ్యింది. నాటిన ఐదవ నెల నుండి మంచి పూల దిగుబడిని అందుకున్నారు, మొదటి సంవత్సరం ఖర్చులు పోను ఐదు లక్షల లాభాన్ని గడించారు. వినూత్నంగా ఆలోచించే ఈ రైతు గులాబీ మొక్కల మధ్య సాళ్ళ ల్లో మల్లెను అంతర పంటగా సాగు చేస్తూ, మల్లెపూల మీద కూడా అధిక దిగుబడి మరియు లాభాలను ఆర్జిస్తున్నారు.
ఈ రకం విశిష్టతను మరియు అధిక నిల్వ శాతం, అధిక దిగుబడులను అందించే లక్షణాల వల్ల తమ పొలంలో మరొక రెండు ఎకరాలలో అర్కా సవి సాగును చేపట్టారు. ఈ రైతు తమ గ్రామంలోని మరొక 10- 15 మంది రైతులకు ఈ రకం యొక్క విశిష్ట లక్షణాలను గురించి వివరించి వారితో కూడా అర్కాసవి గులాబీ రకాన్ని సాగు చేయిస్తున్నారు. ఇలా ఈ కొత్త రకం గులాబీని సాగు చేస్తూ మరియు అంతర పంటగా మల్లె ను సాగు చేస్తున్న రైతు నాగచంద్రుడు గారు యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విజయ గాధ ద్వారా మరికొంతమంది రైతులు తమ పొలంలో కొంత భాగంలో ఈ పూల సాగు చేపట్టి అధిక దిగుబడులను పొందాలని రైతు ఆకాంక్షిస్తున్నారు.
డా. పి. నీలిమ., డా. జె. హేమంత కుమార్, డా. డి. స్రవంతి, డా. కె. నాగాంజలి, డా. ఐ కృష్ణ తేజ, డా. బి. దీపక్ రెడ్డి, మరియు డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి , వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫోన్ : 8184929874


























