అర్హులైన ప్రతిఒక్క మత్స్యకారుడికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. సముద్ర జీవ సంపదను పరిరక్షించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధ కాలం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే సముద్ర మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్నారు. గతంలో కేవలం బియ్యం పంపిణీతో సరిపెట్టారని, 2014-15లో రూ.2 వేల నగదు, 2016-18 మధ్య రూ.4 వేల సహాయం ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని గుర్తు చేశారు. 2019లో వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రూ.20 వేలకు పెంచి మత్స్యకార కుటుంబాలకు నిజమైన అండగా నిలిచింది అని మంత్రి తెలిపారు. మోటారు లేని పడవల యజమానులు, సిబ్బందిని కూడా పథకం పరిధిలోకి తీసుకొచ్చి, అర్హులైన ప్రతి కుటుంబానికి సంతృప్తి స్థాయిలో భృతి అందిస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరంలో 1,21,433 మత్స్యకార కుటుంబాలకు రూ.242.866 కోట్లు చెల్లించామని, 2026-27 సంవత్సరానికి మొత్తం 1,52,248 మంది మత్స్యకారులను గుర్తించి, అందులో 1,30,796 మందికి భృతి చెల్లింపుల కోసం సిఫార్సు చేశామని వెల్లడించారు. ఇందుకోసం రూ.261.592 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.254.886 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.
మా ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల గడప-గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్తోంది. జాబితాలను పారదర్శకంగా ప్రచురిస్తూ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. డీజిల్ సబ్సిడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 2018-19 వరకు లీటరుకు కేవలం రూ.6.03 మాత్రమే సబ్సిడీ ఇచ్చాం. 2019 నుంచి దాన్ని రూ.9కు పెంచింది మా ప్రభుత్వమే. మోటరైజ్డ్ పడవలకు నెలకు 300 లీటర్లు, మెకనైజ్డ్ పడవలకు నెలకు 3000 లీటర్ల వరకు, వేట నిషేధ కాలం మినహా సంవత్సరానికి 10 నెలల పాటు సబ్సిడీ అందిస్తున్నాం అని తెలిపారు. HSD స్మార్ట్ కార్డుల ద్వారా కొనుగోలు సమయంలోనే నేరుగా సబ్సిడీ అందే విధంగా వ్యవస్థను పారదర్శకంగా మార్చాం. రాష్ట్రవ్యాప్తంగా 98 HSD అవుట్లెట్లు, అందులో 8 AFCOF అవుట్లెట్లు ద్వారా సబ్సిడీ డీజిల్ అందుబాటులో ఉంది అని తెలిపారు.
ప్రస్తుతం 21,093 చేపల వేట పడవలు HSD డీజిల్ సబ్సిడీ పొందుతున్నాయని, 2025-26లో ఈ సంఖ్య 21,935కు చేరిందన్నారు. 2019-20 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.183.04 కోట్ల డీజిల్ సబ్సిడీ మత్స్యకారులకు అందించామని తెలిపారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపులు నిలిచిపోయాయన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. 2024-25లో 63 క్లెయిమ్లకు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్లకు రూ.5.65 కోట్లు చెల్లించామని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు నెలకు రూ.4 వేల సామాజిక భద్రతా పింఛన్ అందిస్తున్నామని, 68,632 మంది లబ్ధిదారులకు రూ.330 కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.2,419.61 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. విశాఖ, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోందన్నారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయి. గణాంకాలు, పారదర్శకత, ప్రత్యక్ష లబ్ధితో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తోంది. మత్స్యకారుల సంక్షేమంపై ఎవరైనా విష ప్రచారం చేస్తే ప్రజల ముందే అసలు నిజాలు బయటపెడతాం అని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Leave Your Comments
























