సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం చేస్తూ లాభాలు గడిస్తున్న 70 ఏళ్ల మహిళా రైతు..

0

ఏడుపదుల వయస్సులోనూ ఆమె సాగులో దూసుకెళ్తున్నారు. వ్యవసాయ రంగాల్లో అనేక మార్పులు వచ్చినా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులతో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏడూళ్ళబయ్యారం పిచుకలగుంపునకు చెందిన మహిళా రైతు భాగం అరుణ. సాగు, సామజిక సేవలో అరుణ తనదైన ముద్ర వేస్తున్నారు. తోటకూర, కొత్తిమీర, చుక్కకూర, పాలకూర, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కీరదోస, చిక్కుడు, టమాటా, మిర్చి, మునగ, బత్తాయి, నారింజ, సపోట, బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, మామిడి తదితర పండ్ల తోటలను సేంద్రియ ఎరువుతో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. అంతేకాదు ఆమె సమాజసేవలోనూ ముందున్నారు. గ్రామంలోని నిరాశ్రయులైన మహిళలకు అండగా నిలుస్తున్నారు. వారికి సేంద్రియ ఎరువుల తయారీలో మెళకువలు నేర్పించి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి రాత్రిపూట అక్షరాలు నేర్పిస్తుంది. పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నది. శ్రమదానంతో చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు తొలగింపజేస్తున్నది. మరుగుదొడ్ల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నది. తన సొంత ఖర్చుతో రెండు కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడం విశేషం. మొక్కలు మానవ మనుగడకు ఉపయోగపడతాయని, పర్యావరణాన్ని కాపాడతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని హరితహారంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు అరుణ.
సేంద్రియ ఎరువుల తయారీ:
సాగులో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ తదితర రసాయన ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడుతున్నారు. ఇలా పండిన ఉత్పత్తులు తినడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సేంద్రియ ఎరువుతో పండించిన పంటలకు ఎటువంటి చీడపీడలు, రోగాలు దరిచేరవని చెబుతున్నారామె. వారం రోజుల్లోపు సేకరించిన ఆవు పేడ, ఆవు మూత్రం, కొంత బెల్లం, శనగలు, ఉలవలు, మినుములు ఏదైనా ఒక పప్పుల పొడిని తీసుకోని తక్కువ ఖర్చుతో పెరటిలోనే సులభంగా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో కొంత సేంద్రియ ఎరువుతో పాటు మరికొంత జీవామృతాన్ని తయారు చేసుకొని పంటలకు వాడినట్లయితే చీడపీడలు దరిచేరవు. మంచి దిగుబడిని సాధించవచ్చు. ఆవుపేడ, ఆవుమూత్రంతో తయారు చేసిన జీవామృతాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చునని, పంటలకు పురుగు, దోమ, తెగులు రాదు. మొదట్లో సేంద్రియ ఎరువులతో కొంత దిగుబడి తగ్గినా రానురాను పెరుగుతుందంటున్నారు అరుణ. పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూల మొక్కలను పెంచుతూ ఇంటిని, పరిసరాలను పూలవనంగా మార్చారు. రకరకాల అరుదైన పూల మొక్కలను సేకరించి ఇంటి చుట్టూ నాటారు. అరుణ ఇల్లు ఓ పూలతోట.. ఆమె ఇంటికి వెళ్లిన అతిధులకు పూలు, పండ్లను అందజేస్తున్నది. ఎవరికైనా పూలమొక్కలు కావాల్సి వస్తే ఉచితంగా అందజేస్తారు.
వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగింది. వీటి ధరలకూ రెక్కలు వచ్చి పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఎరువుల అధిక వాడకంతో భూమి నిస్సారమవుతున్నది. దీంతో దిగుబడి తగ్గుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ది చేకూరే సేంద్రియ సేద్యంపై దృష్టి పెట్టి సిరులు పండించాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. మహిళలు తమ పెరట్లో సేంద్రియ ఎరువులను సులభంగా తయారు చేసుకోవచ్చు.

Leave Your Comments

రాజస్థాన్ రైతు బిడ్డ అద్భుతమైన ఆవిష్కరణ..

Previous article

ఉద్యాన పంటల సాగు..రైతు బతుకు బాగు

Next article

You may also like