ప్రస్తుత పరిస్థితి –ఆగస్టు 2026
ఈ ఏడాది వ్యవసాయ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం “ఎల్నినో”. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరగడంతో ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి బలపడుతున్నట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థల తాజా విశ్లేషణలు సూచిస్తున్నాయి. NOAA–CPC ఆగస్టు 13, 2026 నివేదిక ప్రకారం ఎల్నినో మరింత బలపడుతోంది మరియు ఉత్తరార్ధగోళ శరదృతువు–శీతాకాలంలో చాలా బలమైన ఎల్నినో ఏర్పడే అవకాశం 90 శాతానికి పైగా ఉంది. ఇది రైతులకు ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ, “ఎల్నినో వచ్చింది కాబట్టి పంటలు పండవు” అనే భయం అవసరం లేదు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండదు. వర్షపాతం పరిమాణంతో పాటు దాని సమయపాలన, పంపిణీ, పొడి విరామాలు, ఉష్ణోగ్రతలు, నేల తేమ, నీటి లభ్యత వంటి అంశాలే పంటలపై వాస్తవ ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.
ఎల్నినో అంటే ఏమిటి?
భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలు సాధారణం కంటే వేడెక్కి, సముద్ర–వాతావరణ వ్యవస్థలో మార్పులు సంభవించే పరిస్థితిని ఎల్నినో అంటారు. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణ ప్రసరణపై ప్రభావం చూపుతాయి. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ–పశ్చిమ రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే, రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి :
ఎల్నినో ప్రభావం ఉన్నంత మాత్రాన వర్షపాతం పూర్తిగా తగ్గిపోతుందని అర్థం కాదు. ఇది వర్షపాతం కాలం, విస్తీర్ణం మరియు పంపిణీలో అనిశ్చితి, అలాగే పొడి విరామాలు మరియు ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించే అవకాశాన్ని సూచించే ముఖ్యమైన వాతావరణ సంకేతం.
2026లో పరిస్థితి ఎందుకు ప్రత్యేకం?
2026లో ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. NOAA–CPC తాజా విశ్లేషణలో జూలై 2026లో నినో -3.4 సూచిక సుమారు +1.4°Cగా నమోదైంది. తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్లో కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు +2°C కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల 2026ను సాధారణ సంవత్సరంలా కాకుండా వాతావరణ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ప్రణాళిక చేసుకోవాల్సిన సంవత్సరంగా చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రైతుపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చు?
ఆంధ్రప్రదేశ్లో పంటల పరిస్థితి ప్రాంతానుసారం మారుతుంది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం ఉన్న ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
- వర్షపాతం అసమానత :- వర్షం సాధారణంగా పడినా, సరైన సమయంలో పడకపోతే పంటకు ప్రయోజనం తగ్గుతుంది. ఒకేసారి అధిక వర్షం, ఆ తర్వాత ఎక్కువ రోజుల పాటు వర్షం లేకపోవడం వల్ల “తడిగా ఉన్న పొలం – తర్వాత ఎండిపోయిన పొలం” అనే పరిస్థితి ఏర్పడవచ్చు.
- పొడి విరామాలు :- విత్తిన తర్వాత మొలక దశలో లేదా పుష్పించే దశలో వర్షం లేకపోతే పంట ఎదుగుదల దెబ్బతినవచ్చు.
- అధిక ఉష్ణోగ్రతలు :- ఎల్నినో పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కల్లో నీటి అవసరం పెరుగుతుంది. పుష్పించే మరియు గింజ నింపే దశల్లో ఉష్ణోగ్రత ఒత్తిడి దిగుబడిని ప్రభావితం చేయవచ్చు.
- సాగునీటిపై ఒత్తిడి :- వర్షపాతం తగ్గితే కాలువలు, చెరువులు, జలాశయాలు మరియు భూగర్భ జలాలపై ఆధారపడటం పెరుగుతుంది. అందువల్ల నీటి పొదుపు అత్యంత కీలకం.
ప్రస్తుతం రైతు ఏం చేయాలి?
“వాతావరణం చూసి వ్యవసాయం” – ఇదే 2026 మంత్రం
ఎల్నినో సంవత్సరంలో పాత అనుభవాల ఆధారంగా మాత్రమే వ్యవసాయ నిర్ణయాలు తీసుకోవడం సరిపోదు. రైతు మూడు స్థాయిల్లో వాతావరణ సమాచారాన్ని గమనించాలి .
దీర్ఘకాలిక సూచన → నెలవారీ సూచన → 5–10 రోజుల వాతావరణ సూచన
ప్రస్తుతం IMD 20 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ 2026 వరకు విస్తృత-శ్రేణి వాతావరణ సూచనలను అందిస్తోంది. కాబట్టి పంటలో ఎరువుల వేయడం, పురుగు మందుల పిచికారీ, నీటిపారుదల, కోత వంటి పనులను స్థానిక వాతావరణ సూచనలకు అనుగుణంగా నిర్వహించడం మంచిది.
పంటను కాపాడే ఐదు ముఖ్యమైన చర్యలు
- నేలలో తేమను కాపాడాలి :- వర్షపు నీరు పొలం నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి. పంట అవశేషాలను నేలపై ఉంచడం, మల్చింగ్, సేంద్రియ పదార్థాల వినియోగం వంటి పద్ధతులు నేలలో తేమ నిల్వకు సహాయపడతాయి.
- ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగించాలి :- అవసరానికి మించి నీరు పెట్టకూడదు. వీలైన చోట్ల డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలి.
- పంట కాలవ్యవధిని తగ్గించాలి:- వర్షాలు ఆలస్యమైతే ఎక్కువ కాలం తీసుకునే రకాల స్థానంలో తక్కువ వ్యవధి రకాలను ఎంపిక చేయడం ద్వారా పంట ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక సిద్ధంగా ఉంచాలి :- వర్షాలు అనుకున్న సమయానికి రాకపోయినా, సాధారణం కంటే తక్కువగా లేదా అధికంగా కురిసినా పంట నష్టాన్ని తగ్గించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా పంటను ఎంపిక చేసుకోవడం ద్వారా వాతావరణ అనిశ్చితి వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
- వర్షాలు ఆలస్యమైతే → తక్కువ కాలవ్యవధి గల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి.
- వర్షపాతం తక్కువగా ఉంటే → తక్కువ నీటి అవసరం ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- పంట వైవిధ్యం పాటించాలి :- ఒకే పంటపై ఆధారపడకుండా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కలిపి సాగు చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వరి రైతులు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి :-
- వరి సాగులో నీటి నిర్వహణ అత్యంత కీలకం. వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు నిరంతర నీటిముంపు పద్ధతికి బదులుగా అవసరానికి అనుగుణంగా నీటిపారుదల చేయడం నీటి పొదుపుకు సహాయపడుతుంది.
- వర్షం అధికంగా ఉన్నప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సౌకర్యం ఉండాలి.
పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు :-
- పొడి విరామాలు ఏర్పడినప్పుడు పంట ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి నేల తేమను కాపాడటం, సరైన సమయంలో కలుపు నివారణ చేయడం, సమతుల్య పోషక యాజమాన్యం పాటించడం అవసరం.
- అధిక తేమ వచ్చినప్పుడు వ్యాధులు పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ ఆధారిత పురుగు–వ్యాధి నిర్వహణ పాటించాలి.
ఎల్నినో కంటే వాతావరణ అనిశ్చితిని ఎదుర్కోవడమే ముఖ్యం :-
- ఎల్నినోను చూసి రైతులు భయపడాల్సిన అవసరం లేదు.
- వ్యవసాయంపై ప్రభావం చూపేది ఎల్నినో ఒక్కటే కాదు; వర్షపాతం సమయం, పరిమాణం, పొడి విరామాలు, ఉష్ణోగ్రతలు, నేల తేమ వంటి అంశాలు కూడా కీలకం. అందువల్ల వాతావరణ సూచనల ఆధారంగా వ్యవసాయ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాతావరణ అనిశ్చితి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు.
ఎల్నినో – సవాలుతో పాటు ఒక అవకాశం :-
ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ, నేలలో తేమ పరిరక్షణ, పంట వైవిధ్యం, తక్కువ వ్యవధి రకాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాల అమలు చేపట్టడం ద్వారా పంటలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
రైతులు గుర్తుంచుకోవాల్సిన ఐదు సూత్రాలు
- వాతావరణాన్ని తెలుసుకో – సరైన నిర్ణయం తీసుకోవాలి.
- నేల తేమను కాపాడు – నీటిని పొదుపుగా వినియోగించు.
- తక్కువ వ్యవధి రకాలను ఎంచుకో.
- పంట వైవిధ్యాన్ని పాటించు.
- ప్రత్యామ్నాయ పంట ప్రణాళికను సిద్ధంగా ఉంచుకో.
ముగింపు :-
2026లో ఎల్నినో బలపడుతున్నప్పటికీ, దాని ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. కాబట్టి దీర్ఘకాలిక అంచనాలతో పాటు స్థానిక వాతావరణ సూచనలు, నేల తేమ మరియు పంట పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలి.
“ఎల్నినోను భయపడకండి – వాతావరణ సూచనలను తెలుసుకుని ముందుగానే సిద్ధం అవ్వండి.”
వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవడమే స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి మార్గం.
డా. ఎం. రత్నం, వి. ఎస్.ఎస్. గౌతమి మరియు ఎన్.వి.వి.ఎస్ దుర్గా ప్రసాద్,ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, పరిశోధన స్థానం, లాం, గుంటూరు, ఫోన్ : 7702606857
























