వరి భారతదేశంలో ప్రధాన ఆహార పంటగా లక్షలాది రైతుల జీవనాధారంగా నిలుస్తోంది. అధిక దిగుబడుల సాధన కోసం మెరుగైన రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వినియోగం విస్తృతంగా జరుగుతున్నది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అసమతుల్య ఎరువుల వినియోగం మరియు విచక్షణారహిత పురుగు మందుల వాడకం కారణంగా వరి పంటలో వివిధ రకాల పురుగుల ఉధృతి ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. ఈ పురుగులు నారుమడి దశ నుండి పంటను ఆశించి మొక్కల వృద్ధి, కంకి ఏర్పాటు, గింజల నాణ్యత మరియు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. కాండం తొలుచు పురుగు, ఆకుముడత, సుడిదోమ, ఉల్లికోడు, ఆకునల్లి, కంకి నల్లి వంటి పురుగులు వరి సాగులో ప్రధాన సమస్యలుగా మారి రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి. కాబట్టి, ఈ పురుగుల లక్షణాలు, జీవచక్రం, ఉధృతికి అనుకూలమైన పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకొని, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం అత్యంత అవసరం.
కాండం తొలుచు పురుగు/మొవ్వు పురుగు/పీక పురుగు/తెల్ల కంకి :
ఈ పురుగు నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశించి వరి పైరును నష్టపరుస్తుంది. రబీలో మధ్యస్థం నుండి ఎక్కువగా ఆశిస్తుంది. నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది. ముదురు గోధుమ/పసుపు రంగులో ఉన్న ఆడ రెక్కల పురుగులు ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఆకు చివరి భాగాన గుడ్లను సముదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పుతుంది. తెలుపు-గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగుల (లార్వా) తల ఎదిగిన తర్వాత నారింజ-పసుపు రంగు కలిగి ఉంటుంది. గుడ్డు నుండి వచ్చిన లార్వాలు నీటి ఉపరితలం వద్ద వరి కాండానికి రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి మొవ్వను తిని వేస్తుంది. పొడి వాతావరణం, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, గాలిలో తేమ తక్కువగా ఉండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉన్నపుడు, నత్రజని ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల కాండం బలహీనంగా మారినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వరికోత యంత్రాల ద్వారా దుబ్బులను పైపైన కోయడం వలన మిగిలి ఉన్న దుబ్బుల అవశేషాలు “కోశస్థదశ” పెరుగుదలకు దోహదపడి తద్వారా పురుగు ఉధృతి పెరుగుతుంది.
యాజమాన్యం :
నారుమడిలో చ॥ మీటరుకు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం, పిలకల దశలో చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా 5% చనిపోయిన మొవ్వులు లేదా లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 30-35 మగ రెక్కల పురుగులు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. నారు పీకటానికి వారం రోజులు ముందు 5 సెంట్ల (200 చ.మీ.) నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3% సి.జి. గుళికలను ఇసుకలో కలిపి మడిలో పలుచగా నీరుంచి చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలి. నాటే సమయంలో నారు కట్టల చివరలను త్రుంచవలెను. పిలక లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3% సి.జి. గుళికలు ఎకరానికి 10 కిలోలు వేయాలి లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి. 1.5 గ్రా. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చిరుపొట్ట దశ నుండి పూత దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు వేయాలి లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి. 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత/ నాము/తెల్ల తెగులు :
నాటిన దగ్గర నుండి పోటాకు దశ వరకు ఆశిస్తుంది. పోటాకు దశలో ఆశిస్తే నష్టం ఎక్కువ. లార్వాలు ఆకు యొక్క రెండు అంచులను కలిపి గొట్టంగా/ముడత చేసి ఆకుపచ్చని పదార్ధాన్ని గోకి తినటం వల్ల ఆకు తెల్లబడి తర్వాత ఎండిపోతాయి. తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది. రెక్కల పురుగులు పసుపు మరియు గోధుమ మిశ్రమ రంగులో ఉండి రెక్కలపై అలల వలె నల్లని చారలు ఉంటాయి. ఆకులు నిలువుగా ముడుచుకొని తెల్ల గీతలుండటం, ఆకుముడతలు విడదీస్తే లార్వా దశలో ఉన్న లేత పుసుపు లేదా ఆకుపచ్చ పురుగులు కనబడటం లేదా పొలంలో నడస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి ఆకుముడతను గుర్తించవచ్చును. అధిక వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొని 35° సెంటిగ్రేడ్ పగటి ఉష్ణోగ్రత, 17° సెంటిగ్రేడ్ రాత్రి ఉష్ణోగ్రత, వారం రోజుల పాటు మబ్బులు, గాలిలో అధిక తేమతో (>90%) కూడిన వాతావరణం అనుకూలం. పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వలన ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన రకాలను సాగు చేసేటప్పుడు ఆకుముడత ఎక్కువగా ఆశిస్తుంది. దుబ్బుకి 1 లార్వా లేక 2 ఆకుముడత నష్టం కలిగిన ఆకులున్నచో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
యాజమాన్యం :
ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును అధికంగా వాడరాదు. పిలక దశలో చేనుకు అడ్డంగా తాడును 2-3 సార్లు లాగితే ఆకుల ముడతలు విడిపోయి పురుగులు (లార్వాలు) నీటిలో పడి చనిపోతాయి. పరాన్నజీవులైన ట్రైకోగ్రామా ఖిలోనిస్ ను ఎకరాకు 20,000 చొప్పున నాట్లు వేసిన 35వ రోజు నుండి 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు వదిలి అరికట్టవచ్చును. దీని నివారణకు పిలక దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి. 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగు ఉధృతికి దోహదపడే క్వినాల్ఫాస్, ఫోరేట్ 10 జి గుళికలు మరియు కారోఫ్యూరాన్ 3 జి గుళికలు వాడరాదు.
సుడిదోమ / దోమపోటు :
వరి పైరును ఆశించే పురుగులలో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడిదోమ మరియు తెల్లవీపు మచ్చదోమ. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వీటి తాకిడి పెరుగుతుంది. అధిక దిగుబడి సాధించాలని రైతులు రసాయనిక ఎరువులను మరియు పురుగు మందులను విచక్షణారహితంగా వాడటం వలన సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువ అయ్యింది. సుడిదోమ వల్ల “గ్రాసీస్టంట్” అనే వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. నీటి మట్టానికి పై భాగాన దుబ్బులపై రెండు రూపాలలో (రెక్కలున్నవి, రెక్కలు అభివృద్ధి చెందనివి) కనబడతాయి. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. ఉధృతి పెరిగే కొద్ది పైరు సుడులు సుడులుగా వలయకారంలో ఎండిపోతూ ఉంటుంది. అధిక తేమతో కూడిన వేడి వాతావరణం, రాత్రి ఉష్ణోగ్రతలు 21-23° సెంటిగ్రేడ్ మధ్య ఉంటే సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది. నత్రజనిని అధిక మోతాదులో వాడినప్పుడు, కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆశించే పురుగుల నివారణకు ట్రైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ లేదా సింథటిక్ పైరిథ్రాయిడ్ (డెల్టామైత్రిన్ లేదా సైపర్మెత్రిన్) మరియు ఫోరేట్ 10 జి గుళికలు వాడినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది.
యాజమాన్యం :
వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. ల కాలి బాటలు తీయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పిలక దశలో దుబ్బుకు 10-15 దోమలు, ఈనిక దశలో దుబ్బుకు 20-25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా పైమెట్రోజెన్ 50 డబ్ల్యు.జి. 0.6 గ్రా. లేదా ట్రైఫ్లూ మిజో ఫైరిమ్ 10 ఎస్.సి. 0.48 మి.లీ. లేదా డైనోటెఫ్యూరాన్ 20 ఎస్.జి. 0.4 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 80 డబ్ల్యు.జి. 0.25 గ్రా. కలిపి పిచికారి చేయాలి. రెండవసారి పిచికారి అవసరమైతే, మొదట వాడిన పురుగు మందును కాకుండా వేరే తరగతికి చెందిన పురుగు మందును పిచికారి చేయాలి. అవకాశం ఉన్న రైతులు పొలం గట్లపై తెలుపు మరియు పసుపు రంగు పూలనిచ్చే మొక్కలైన నువ్వులు, ధనియాలు, బంతి మరియు కాస్మోస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా గుడ్డు పరాన్నజీవలైన అనాగ్రస్, ఒలిగోసిటా మరియు గొనటోమస్ వంటి వాటిని పెంపొందించుకోవచ్చు. ఇవి సుడిదోమను కొంత వరకు అదుపులో ఉంచుతాయి.
ఉల్లికోడు :
నారుమడి / పిలక దశలో ఈ పురుగును గమనించవచ్చు. దోమ జాతికి చెందిన తల్లి పురుగులు లేత ఎరుపు రంగులో ఉండును. గుడ్డు నుండి వచ్చిన వెంటనే పిల్ల పురుగులు (మాగట్స్) కాండంలోనికి పోయి అంకురం వద్ద వృద్ధి చెందే క్రమంలో అంకురం “ఉల్లి కాడ” వలె లేత ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మార్పు చెంది బయటకు వస్తుంది. కంకి వేయదు. దుబ్బులలోని కొన్ని పిలకలు మాత్రమే ఉల్లికాడ వలె గొట్టాలుగా మారుతాయి. ఉల్లికోడు తట్టుకోని రకాలను సాగు చేసినప్పుడు, ఋతుపవనాలు ఆలస్యమయ్యి, నాట్లు ఆలస్యమయినప్పుడు, గాలిలో తేమ 82-88 శాతం మధ్య ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. నారుమడిలో చదరపు మీటరుకు “ఒక ఉల్లికోడు సోకిన పిలక”, పిలక దశలో “5 శాతం ఉల్లి గొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక” గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి.
యాజమాన్యం :
నారుమడిలో విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల లోపు ఒక సెంటుకు 160 గ్రా. ల కార్బోఫ్యూరాన్ 3% సి.జి. గుళికలు పలుచగా నీరుంచి చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలి. నాట్లు ఆలస్యంగా వేసినప్పుడు, నాటిన 10 నుండి 15 రోజులలో కార్బోఫ్యూరాన్ 3% సి.జి. గుళికలను ఎకరాకు 10 కిలోలు వేయాలి.
ఆకునల్లి :
సాధారణంగా పంటను 40 రోజుల నుండి 80 రోజుల వరకు ఈ నల్లి ఆశిస్తుంది. సాలీడు జాతికి చెందిన ఈ నల్లులు నాలుగు జతల కాళ్ళతో నలుపు లేదా పసుపు రంగులో ఉంటాయి. ఆకుల వెనుక వైపు ఈనెల వెంబడి సమూహాలుగా వుండి రసాన్ని పీలుస్తాయి. ముందుగా ఆకులపై తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు/చారలు ఏర్పడి క్రమేపి కాషాయం రంగుకు మారి చేను ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల పైభాగాన కూడా ఆశించి నష్టం కలుగజేస్తాయి. తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు, ఈ నల్లి ఉధృతికి అనుకూలం.
యాజమాన్యం :
అవసరాన్ని బట్టి నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా స్పెరోమెసిఫెన్ 1.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
కంకి నల్లి / నల్ల కంకి తెగులు :
సాలీడు వర్గానికి చెందిన ఈ నల్లి అతి సూక్ష్మమైనది. దీనిని రైతు స్థాయిలో గుర్తించటం కష్టం వరి పంటను పిలక దశ నుండి ఆశిస్తుంది. ఈ నల్లి ఆశించి ఎప్పుడు ఆకుల మధ్య ఈనెలపై మరియు ఆకు తొడిమలపై ఉదారంగు లేదా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వెన్నులు వంకర తిరగటం లేదా పాక్షికంగా బయటకు రావటం మరియు గింజ తయారీ దశలో గింజల మీద నలుపు మచ్చలు ఏర్పడి, పాలు పోసుకోక తాలు గింజలు ఏర్పడడం బట్టి కంకినల్లి ఆశించినట్లు గుర్తించాలి. పగటి ఉష్ణోగ్రతలు 28-300 సెంటిగ్రేడ్, గాలిలో అధిక తేమ (>80%) కంకినల్లి ఉధృతికి చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితుల్లో పురుగు త్వరితంగా వృద్ధి చెందుతుంది.
యాజమాన్యం :
నల్లి ఆశించిన లక్షణాలు గమనించిన వెంటనే ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా స్పైరోమెసిఫెన్ 1.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి ఒకసారి, 15 రోజులకు మరోసారి పిచికారి చేయాలి.
డా. బి.కె. కిషోర్ రెడ్డి, డా. కె. కిరణ్ కుమార్ రెడ్డి, డా. మల్లేశ్వరి, సాధినేని, డా. లలిత శివ జ్యోతి, ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,గుంటూరు, ఫోన్ : 9493344440

























