ఆంధ్రప్రదేశ్తెలంగాణవ్యవసాయ పంటలు

అధిక దిగుబడికి అధిక సాంద్రత పత్తిలో విత్తనాలు, ఎరువుల నిర్వహణ

0

అధిక సాంద్రత పత్తి సాగు అనగా సాధారణ పత్తి సాగుకు భిన్నంగా  మొక్కల మధ్య మరియు వరుసల మధ్యదూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా విత్తు కోవడం సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ. మొక్కల మధ్య 60 సెం.మీ (90×60) ఎడం పెట్టినప్పుడు ఎకరానికి 7,407 మొక్కలు వస్తాయి. రైతులు సాధారణ పద్ధతిలో వరుసల మధ్య విత్తే 90 సెం.మీ. అచ్చు మార్చకుండా అంతరకృషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు వరుసల మధ్య 90 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. తో  (90X10) విత్తుకుంటే ఎకరాకు 44,444 మొక్కలు వస్తాయి. (లేదా) వరుసల మద్య 90 సెం.మీ. మొక్కల మధ్య 15 సెం.మీ తో (90×15) విత్తుకుంటే ఎకరాకు 29,629 మొక్కలు వస్తాయి. (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ. మొక్కల మధ్య 20 సెం.మీ. (90×20) విత్తుకుంటే ఎకరాకు 22,222 మొక్కలు వస్తాయి.

ఈ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరానికి  3 – 5 కిలోలు అవుతుంది. అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగు వర్షాధార తేలిక  నేలలు మరియు భూసారం తక్కువగా ఉండే చల్కా నేలలకు చాలా అనుకూలం. ఇలాంటి నేలల్లో మొక్కలు. ఎత్తు పెరగవు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. అధిక సాంద్రత సాగులో మొక్కకు  8 నుండి 10 కాయలు వచ్చిన మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన  ఎకరానికి 10-12 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.

పెరుగుదల నియంత్రణ మందుల వాడకం :

వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అధిక సాంద్రత సాగులో పత్తి మొక్కలు పెరగకుండా నియంత్రించే హార్మోన్ని పిచికారి చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రించడం వలన కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్క గుబురుగా, కాయల సైజు పెరిగే అవకాశం ఉంది. పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి పత్తి త్వరగా ఒకే సారి కోతకు రావడం వలన పంటకాలం తగ్గుతుంది. పెరుగుదల నియంత్రణకు 1.0 మి.లీ . చొప్పన మెపిక్వాట్ క్లోరైడ్ ను పంట 40-45 రోజులప్పుడు (మొదటి సారి) మరియు 60-65 రోజులప్పుడు (రెండవసారి) లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

కలుపు యాజమాన్యం  :

సాధారణ పత్తి సాగులో చేసినట్లే  పత్తి విత్తనం వేసిన 24 – 48 గంటలలోపు ఎకరాకు 1.2. లీ పెండిమిథాలిన్ 30% లేదా అల్లాక్లోర్ 50% 1.5-2 లీ . కలుపు మందు 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. భూమిలో సరియైన పదును, తేమ  ఉన్నప్పుడే పిచికారి చేసినట్లైతే  గడ్డి మందు చాలా  సమర్థవంతంగా  పనిచేసి, కలుపును నివారిస్తుంది. ఈ విధంగా కలుపు మందు పిచికారి చేయడం వలన పంట తొలిదశలో ఆశించే కలుపును 20 రోజుల వరకు అరికట్టవచ్చు.

రసాయనిక ఎరువుల యాజమాన్యం :-

సాధారణ, సూటిరకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 19 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి.

పైన సూచించిన అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలను అనుసరించి ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు, ఆ పోషకాన్ని  సిఫారసు కంటే 30% ఎక్కువగా, పోషకం అధికంగా ఉనప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా మరియు పోషకం మధ్యస్తంగా ఉనప్పుడు, సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం ఉంటుంది.

అధిక సాంద్రత పత్తి సాగు వల్ల కలిగే లాభాలు :

  •  ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి తీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత పత్తి సాగు యంత్రీకరణకు అనుకూలం. పత్తి  ఏరే యంత్రం ద్వారా ఒకే సారి పత్తి ఏరుకోవచ్చు.
  • ఒకే సారి పూత, కాయలు రావడం వలన పంట తొందరగా చేతకి వస్తుంది. తద్వారా గులాబీ రంగు పురుగు తాకిడి నుండి బయటపడుతుంది.
  • డిసెంబర్లో పంటను తీసేసి రెండవ పంటగా నీటి వసతి ఉన్నచోట ఆరుతడి పంటలను సాగు చేసుకొని సుస్థిర దిగుబడులు పొందవచ్చును.
  • ఈ అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగు వలన కూలీలకు కూడా త్వరగా పత్తిని ఏరడానికి అవకాశముంటుంది.
  • ఈ పద్ధతిలో సుమారుగా ఎకరాకు 30-40% అధిక దిగుబడిని కూడా పొందే అవకాశముంటుంది.

గమనిక : అధిక సాంద్రత ప్రత్తి సాగుకు అనుకూలమైన తక్కువ కాలపరిమితి గల రకాలను, హైబ్రీడ్లను  ఎంపిక చేసుకోవాలి.

డా. యస్. ఓం ప్రకాశ్, డా. జి. వీరన్న,డా. ప్రశాంత్ , డా. రమ్య, డా. వెంకన్న, డా. ఆర్. ఉమా రడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్, ఫోన్ : 98663 73563 .

Leave Your Comments

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

Previous article

రైతన్న కో ప్రశ్న

Next article

You may also like