తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

0
  • పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు.
  • రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు.
  • రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం.
  • MSP ప్రకటించడం కాదు, ఆ ధరకు కొనుగోలు చేయడమే అసలు రైతు సంక్షేమం.
  • ప్రతి పంటలో కనీసం 75 శాతం దిగుబడిని కేంద్రం కొనుగోలు చేయాలి.
  • మొక్కజొన్న, జొన్నలను వెంటనే PSS పరిధిలోకి తీసుకురావాలి.
  • రైతుల శ్రేయస్సు కోసం మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • కొనుగోళ్లతో ఏటా 4000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం.
            2026–27 ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSPలు) రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.
స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా సూచించినట్లుగా “సంపూర్ణ ఉత్పత్తి వ్యయం (C2)పై కనీసం 50 శాతం లాభం కలిపి MSP నిర్ణయించాలి” అనే మూల సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తుంగలో తొక్కిందని మంత్రి మండిపడ్డారు. రైతుల కోసం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో మాత్రం రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు.
వరి MSP – పేరుకు మాత్రమే పెంపు :-
సాధారణ వరి MSPను క్వింటాల్‌కు ₹2,441గా నిర్ణయించడం ద్వారా గత ఏడాదితో పోలిస్తే కేవలం ₹72 మాత్రమే పెంచారని మంత్రి తెలిపారు. ఇది కేవలం 3 శాతం పెరుగుదల మాత్రమేనని, ఎరువులు, కార్మిక చార్జీలు, విత్తనాలు, డీజిల్, విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఈ పెంపు రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని పేర్కొన్నారు.
“రైతు వెన్నెముకతో దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంటే, వరి MSPలో ₹72 పెంపుతో రైతులను ఊరడించాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని మంత్రి వ్యాఖ్యానించారు.
మొక్కజొన్న MSP – రైతుల పట్ల కపట ప్రేమకు నిదర్శనం
మొక్కజొన్న MSPను క్వింటాల్‌కు ₹2,410గా నిర్ణయించి కేవలం ₹10 మాత్రమే పెంచారని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ఇది 0.4 శాతం పెరుగుదల మాత్రమేనని, ఇంత స్వల్ప పెంపును రైతు అనుకూల నిర్ణయంగా ప్రచారం చేయడం కేంద్ర ప్రభుత్వ కపట ప్రేమకు పరాకాష్ట అని అన్నారు.
“రైతులకు పదిరూపాయలు ఇచ్చి వందల రూపాయల ప్రచారం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటైపోయింది” అని మంత్రి ఘాటుగా విమర్శించారు.
కందిపప్పు MSP – రైతు వ్యయాలకు సరిపోని పెంపు
కందిపప్పు MSPను క్వింటాల్‌కు ₹8,450గా నిర్ణయించి ₹450 పెంచినప్పటికీ, పప్పుధాన్యాల సాగులో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, తెగుళ్ల ముప్పు, మార్కెట్ అనిశ్చితి దృష్ట్యా ఇది తగిన పెంపు కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
పత్తి MSP – తెలంగాణ రైతులకు పూర్తిస్థాయి న్యాయం కాలేదు
తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తికి MSPను క్వింటాల్‌కు ₹8,267గా నిర్ణయించారు. ₹557 పెంపు జరిగినప్పటికీ, పత్తి సాగులో ఎకరాకు అయ్యే భారీ పెట్టుబడి, కూలీల కొరత, పురుగుమందుల వ్యయం, దిగుబడి అనిశ్చితి దృష్ట్యా రైతులకు ఇది సరిపోదని మంత్రి తెలిపారు.
వేరుశెనగ, సోయాబీన్ MSPలు కూడా నిరాశాజనకం
వేరుశెనగ MSPను ₹7,517గా నిర్ణయించి కేవలం 3.5 శాతం పెంచడం, సోయాబీన్ MSPను ₹5,708గా నిర్ణయించి 7.1 శాతం పెంచడం కూడా రైతుల ఆశించిన స్థాయిలో లేవని మంత్రి పేర్కొన్నారు.
MSPల పేరుతో ప్రచారం – రైతుల చేతికి మాత్రం తక్కువ లాభం
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం MSPలను పెంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, రైతుల నిజమైన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని మంత్రి అన్నారు. ఒకవైపు ఉత్పత్తి వ్యయాలు రెట్టింపవుతుండగా, మరోవైపు MSP పెంపులు నామమాత్రంగా ఉండటం రైతులకు తీవ్ర అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామినాథన్ కమిషన్ అమలు ఎక్కడ?
ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసిందని మంత్రి విమర్శించారు.
రైతుల ఆదాయ భద్రత కోసం MSPలను 30–40 శాతం పెంచాలి
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు కల్పించాలంటే MSPలను కనీసం 30–40 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంపూర్ణ ఉత్పత్తి వ్యయాల ఆధారంగా MSPలు నిర్ణయించి, రైతులకు చట్టబద్ధమైన ధర హామీ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కనీసం 75 శాతం పంటను కేంద్రం కొనుగోలు చేయాలి
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు (MSP) కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఆ ధరలకే ఆయా పంటలను కేంద్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అనుసరిస్తున్నట్లుగా ఎకరానికి నిర్దిష్ట శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతుల పట్ల అన్యాయమని ఆయన పేర్కొన్నారు. రైతు ఎంత కష్టపడి పండించిన పంటకు కనీసం 75 శాతం మేర కేంద్ర ప్రభుత్వం హామీతో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. MSP ప్రకటించి కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకోవడం రైతులను మోసం చేయడమేనని మంత్రి విమర్శించారు.
మొక్కజొన్న, జొన్నలను PSS పరిధిలోకి తీసుకురావాలి
ప్రత్యేకంగా తెలంగాణలో విస్తృతంగా సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం (Price Support Scheme – PSS) పరిధిలోకి తీసుకువచ్చి, MSP ధరకు కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ పంటలను PSSలో చేర్చకపోవడం వల్ల రైతులు మార్కెట్‌లో దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయని పంటలను రైతు శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా మద్దతు ధరకు సేకరించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కొనుగోళ్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు ₹4,000 కోట్ల అదనపు భారం భరిస్తోందని ఆయన వెల్లడించారు.
“MSP ప్రకటించడం ఒక్కటే రైతుకు మేలు కాదు. ఆ ధరకు పంటను కొనుగోలు చేసినప్పుడే MSPకు అసలు అర్థం ఉంటుంది. లేకపోతే అది రైతులను మభ్యపెట్టే ప్రకటనగానే మిగిలిపోతుంది” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Leave Your Comments

తెలంగాణలో వైభవంగా జరిగిన రైతు వారోత్సవాలు

Previous article

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

Next article

You may also like