తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

తెలంగాణలో IFFCO నానో ఎరువుల విప్లవం: రైతుల అద్భుత విజయగాథ!

0

IFFCO నానో యూరియాకు అనూహ్య ఆదరణ: కేవలం ఒక్క వానాకాలం పంటలో 2.5 లక్షల నుంచి 7 లక్షల బాటిల్స్‌కు పెరిగిన వినియోగం!

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం వినూత్న మార్పుకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా, సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో యూరియా మరియు నానో డీఏపీ ఎరువులు రైతుల్లో పెను విప్లవాన్ని సృష్టించాయి. ఈ సరికొత్త సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరించడం ఒక గొప్ప విజయం.

నానో ఎరువుల వినియోగం విషయంలో రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం వానాకాలంలో కేవలం 2.5 లక్షల బాటిళ్లు ఉన్న నానో యూరియా వినియోగం, ఈ ఏడాది ఏకంగా 7 లక్షల బాటిళ్లకు పెరగడం రైతులలో నానో ఎరువులపై పెరిగిన నమ్మకానికి, ఆమోదానికి ప్రత్యక్ష నిదర్శనం.

విజయానికి కారణాలు :-

ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రచారం  నానో ఎరువుల విస్తృత ప్రచారంలో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ PJTAU, ICAR పరిశోధన సంస్థలు కీలక పాత్ర పోషించారు. వీరి సహకారంతో, నానో ఎరువుల వినియోగాన్ని రైతుల దాకా చేరవేయడానికి ప్రత్యేక కృషి జరిగింది.

యూరియా వాడకంపై జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. ఆల్తాఫ్ జానయ్య గారు మాట్లాడుతూ పంటలకు నత్రజని అవసరం ఉన్నప్పటికీ, కేవలం యూరియానే విపరీతంగా వాడటం నేల మరియు పర్యావరణ ఆరోగ్యానికి హానికరం అని ఆయన హెచ్చరించారు. రైతులు యూరియాకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

నానో యూరియా గొప్ప ప్రత్యామ్నాయం :- వీసీ ముఖ్యంగా నానో యూరియా యొక్క సామర్థ్యాన్ని ఉదహరిస్తూ మాట్లాడుతూ: “యూరియా బదులుగా లిక్విడ్ రూపంలో వచ్చిన నానో యూరియా మంచి ఫలితం వస్తుందని తెలియజేశారు.

నానో విప్లవం :- కలెక్టర్ ప్రశంసలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు వ్యవసాయ అధికారులు నానో యూరియా వాడకంపై భరోసా ఇచ్చారు. అర లీటరు నానో యూరియా 45 కిలోల బస్తాకు సమానం. ఈ టెక్నాలజీతో తక్కువ పెట్టుబడి, శ్రమతో అధిక దిగుబడి సాధ్యమని, డ్రోన్ పిచికారీ పద్ధతిని ప్రోత్సహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. నానో ఎరువులు నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయని నొక్కిచెప్పారు.

ఇఫ్కో నేరుగా వెయ్యి ఫీల్డ్ డెమోలను నిర్వహించింది :- రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి, పంట దిగుబడిపై నానో ఎరువుల సానుకూల ప్రభావాన్ని కళ్ళారా చూపించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1000 క్షేత్ర స్థాయి (ఫీల్డ్ లెవెల్) ప్రదర్శనలు  ఇఫ్కో ద్వార విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ ప్రదర్శనలు నానో ఎరువుల స్వీకరణకు బలమైన పునాది వేశాయి.

ఇఫ్కో సంచలనం :- నానో ఎరువుల పిచికారీకి గ్రామ స్థాయి డ్రోన్ వ్యవస్థాపకులు!

ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో ఎరువుల వినియోగాన్ని వేగవంతం చేయడానికి డ్రోన్ టెక్నాలజీని విప్లవాత్మకంగా వాడుతోంది. ఇఫ్కో అభివృద్ధి చేసిన గ్రామ స్థాయి డ్రోన్ ఎంట్రప్రెన్యూర్స్ ద్వారా రైతులకు పిచికారీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

యువతకు ఉపాధి, రైతులకు లబ్ధి :-

వ్యవసాయ నేపథ్యంకలిగిన గ్రామీణ యువతకు, మహిళలకు ఇఫ్కో డ్రోన్‌లను అందించి, వారిని ఎంట్రప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దింది. ఎకరానికి కేవలం రూ. 300 ఖర్చుతో అందించే ఈ డ్రోన్ సేవలు, రైతులకు సమయాన్ని, శ్రమను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ చర్య నానో ఎరువుల సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరించడానికి ఎంతగానో దోహదపడుతోంది.

శాస్త్రవేత్తల ఆమోదం :- వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విజయవంతమైన పరీక్షలు నానో ఎరువుల సామర్థ్యంపై శాస్త్రీయ దృవీకరణ కోసం, CRIDA వంటి అగ్రగామి వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విస్తృతమైన క్షేత్ర పరీక్షలు (ట్రయల్స్) నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం, PJTSAU వ్యవసాయ కళాశాలల్లో కూడా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ నుండి వచ్చిన ఫలితాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు, ఇది నానో సాంకేతికతపై మరింత విశ్వాసాన్ని పెంచింది.

రైతుల హృదయం నుంచి :- సానుకూల అనుభవాలు

నానో ఎరువుల వినియోగంపై తెలంగాణ రైతులు తమ అనుభవాలను, ఆనందాన్ని పంచుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో వారు పొందుతున్న అద్భుత ఫలితాలు ఈ మార్పునకు మరింత బలాన్ని చేకూర్చాయి.

క్యూల కష్టాలు తీరాయి :-

“నానో యూరియా వాడకంతో యూరియా కోసం క్యూలలో నిలబడే ఇబ్బందులు పోయాయి. ఇప్పుడు పంటకు ఎప్పుడు యూరియా అవసరం ఉంటే అప్పుడు సీసా కొనుక్కొని స్ప్రే చేస్తున్నాను. దిగుబడిలో కూడా ఎటువంటి తగ్గుదల లేకుండా మంచి ఫలితాలు వస్తున్నాయి.”

తెగుళ్ల నివారణ :-

“సాధారణ యూరియాతో పోలిస్తే నానో యూరియా వాడకం వాళ్ళ మొక్కజొన్న పంటలో తెగుళ్లు, పురుగుల తీవ్రత తగ్గింది. దీని వల్ల దిగుబడి మరింతగా పెరుగుతోంది.”

డ్రోన్ స్ప్రేయింగ్ మేలు :-

“IFFCO వారు డ్రోన్ల సహాయంతో ఎకరాకు 300 రూపాయలకే స్ప్రే సేవలు అందిస్తున్నారు. సాధారణ స్ప్రేయింగ్ చేయడంలో వచ్చే ఖర్చుతో పోలితే డ్రోన్ స్ప్రేయింగ్ చాలా తక్కువ ఖర్చుతో, మంచి ఫలితాలు ఇస్తోంది. నానో ఎరువుల వల్ల పంట చాలా బాగా అభివృద్ధి చెందుతోంది.”

ఇఫ్కో సందేశం :- “వానాకాలంలోనే 7 లక్షల బాటిల్స్”

ఈ అద్భుతమైన విజయంపై స్పందిస్తూ, ఇఫ్కో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్, శ్రీ కృపా శంకర్ గారు మాట్లాడుతూ, “తెలంగాణలో నానో ఎరువుల స్వీకరణ ఊహించని విధంగా పెరిగింది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ PJTAU, ICAR పరిశోధన సంస్థలు మరియు ఇఫ్కో అధికారుల ద్వారా, రైతు స్థాయిలో నిరంతర కృషి వల్లనే ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ వానాకాలం (ఖరీఫ్ సీజన్) లో మాత్రమే 7 లక్షల బాటిల్స్ విక్రయించామని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను” అని తెలిపారు.

నానో ఎరువుల విప్లవం, తెలంగాణ వ్యవసాయాన్ని మరింత సుస్థిరం చేస్తూ, అన్నదాతల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Leave Your Comments

పసుపు ప్రాముఖ్యత  – విలువ ఆధారిత ఉత్పత్తులు

Previous article

కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు – యాజమాన్యం

Next article

You may also like