వార్తలు

ఉన్నత చదువులు చదివి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న యువత..

0

రైతులకు ఆధునిక పద్ధతులపై చేదోడు వాదోడుగా యువరైతులు
ఒక పక్క.. వ్యవసాయాన్ని నామోషీగా భావించి ఐదారువేల జీతానికి పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత. మరోపక్క.. అందులో లభించని తృప్తిని మట్టిని నమ్ముకుని పొందాలనే తపనతో ఉద్యోగాలు వదిలి పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల సాగు లాభాల పంట పండిస్తోంది. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వివియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. అంతర్గాముకు చెందిన వామన్ రెడ్డి బీటెక్ చదివాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కూరగాయల సాగును చేపట్టాడు. వీటి సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చేయి సరిగ్గా పనిచేయకున్నా.. తానే అన్ని పనులు చేసుకుంటాడు. కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నాడు. రైతులు ఎక్కడ మోసపోయినా అక్కడ గళమెత్తడం కూడా వామన్ రెడ్డి ప్రత్యేకత. రైతులను చైతన్యం చేసేందుకు ఫేస్ బుక్, వాట్సాప్ లను ఉపయోగిస్తున్నాడు. వారికి సస్యరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై సలహా సూచనలతో పాటు చైతన్యవంతుల్ని చేసేలా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
హైదరాబాద్ లో బీటెక్ చదివిన సుభాష్ ది జగిత్యాల జిల్లా అంతర్గాము గ్రామం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. మంచి జీతమే వస్తున్నా.. ఆ జీవితం తృప్తిగా లేకపోవడంతో సొంతూరు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అందరూ కొత్తలో ఇదేం పనని ఆశ్చర్యపోయినా..ఈ రంగంలో ప్రత్యేక పద్ధతుల్లో పిల్లలుగా మారుస్తున్నాడు. నాటుకోళ్లను అందరి మాదిరిగా షెడ్లలో కాకుండా, మామిడి, జామ తోటల్లో పెంచుతూ డిమాండ్ ను బట్టి కిలో రూ. 250 – 300 కి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.
లక్ష్మీపూర్ కు చెందిన సురేష్ హైదరాబాద్ లో ఉంటూ బీటెక్ చదివాడు. కానీ ఎప్పటికైనా స్వయం ఉపాధి కల్పించుకుని తన కాళ్లపై తాను నిలబడాలనేది అతని లక్ష్యం. ఆ మక్కువతోనే స్వగ్రామంలో 30 ఆవులతో డెయిరీ ఫారాన్ని ప్రారంభించాడు. తొలుత నలుగురి భాగస్వామ్యంతో ఫారం నిర్వహించగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సురేష్ ఒక్కడే లాభాల బాట పట్టించాడు. ఇప్పుడు ఆవులతో పాటు గేదెల డెయిరీ కూడా నిర్వహించి నేరుగా వినియోగదారులకు పాలు విక్రయించేలా వ్యూహరచన చేస్తున్నాడు.
లక్ష్మీపూర్ కి చెందిన స్వామి రెడ్డి ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు ఏదో ఒక వుద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంటే తాను వ్యవసాయం చేస్తానంటూ సేద్యంలోకి దిగాడు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తుంటే ఆ తల్లిదండ్రులే మురిసిపోతున్నారు. పసుపు పంటకు డ్రిప్ తో పాటు ప్రతీ పనికి ఆధునిక పరికరాలను ఉపయోగించడం స్వామిరెడ్డి ప్రత్యేకత. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ ను కొనుగోలు చేసి, డ్రైవర్ అవసరం లేకుండా తానే డ్రైవింగ్ చేస్తూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అలాగే, తాను ఆచరించే ఆధునిక సాగు పద్ధతులపై ఇతర రైతులకూ అవగాహన కల్పిస్తుంటాడు.

Leave Your Comments

ఉలవలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

ఇండియా లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానాలు – డా. పద్మయ్య

Next article

You may also like