కన్హా శాంతివనం, రంగారెడ్డి జిల్లాలో ఆసియా పిజిపిఆర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన మహాకిసాన్ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత, రసాయన ఎరువుల మరియు పురుగుమందుల అధిక వినియోగంతో నేల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుందో సదస్సులో పాల్గొన్న రైతులకు వివరించి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ. రసాయన ఎరువుల వినియోగం తెలంగాణలో గత పదేళ్లలో గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం భారతదేశ వినియోగం, అన్ని రకాల ఎరువులు కలుపుకొని 600 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే 40 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అదేవిధంగా దేశంలో సగటు పురుగుమందులు వినియోగం కంటే కూడా తెలంగాణ వినియోగం అధికంగా ఉందని, కావున మనమప్పుడు కేవలం ఉత్పత్తి మీదనే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడం మీద దృష్టిసారించాలని హితవు పలికారు.
అదేవిధంగా గత 30 సంవత్సరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించారో వివరిస్తూ. ప్రస్తుతం ఆ పంట సాగుకు గల అవకాశాలు మరియు ఆయిల్ పామ్ పంటలో వేయగల అంతరపంటల సాగు గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.
తరువాత వివిధ జిల్లాల నుండి ఎంపిక చేఐసిన ఆదర్శరైతులకు రైతురత్న అవార్డులను అందచేశారు. మహాకిసాన్ మేళాలో భాగంగా రైతుల ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేసిన 70 స్టాల్స్ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిజిపిఆర్ సొసైటీ చైర్మన్ ఎం.ఎస్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.
Leave Your Comments


























