ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతుల కోసం బీమా పథకాలు అమలులో ఉన్నాయి. అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమైంది. ఈ పథకం కింద , నాట్లు వేయడానికి ముందు నుంచి పంట కోసిన తర్వాతి కార్యకలాపాల వరకు మొత్తం సాగుదశలన్నింటికీ పంట నష్టం నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నాయి. రైతాంగంలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వ్యవసాయమే వీరికి పూర్తి జీవనాధారం. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే ఆదుకుంటుంది. దీనికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వర్తిస్తుంది. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, నీటమునిగిపోవడం, ప్రతికూల వాతావరణం మొదలైన వాటివల్ల కలిగే దిగుబడి ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తుంది. చాలా మంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ పరిహారం ఎలా పొందాలో తెలియక నష్టపోతున్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా ఎలా పొందాలి…
సదరు రైతు తాను పండించే పొలం ఏ భీమా కంపెనీ పరిధిలో ఉందో తెలుసుకోవాలి. దానికి ముందు పండించిన ఆ పంట భారత ప్రభుత్వం నిర్ధేశించిన పంటల్లో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. బ్యాంకులో ఎలాంటి రుణం తీసుకోనివారు సదురు బీమా కంపెనీ నిర్దేశించిన సంస్థను లేదా దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రానికి సంబంధిత పత్రాలను అంటే రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ, రైతు పేరుతో ఉన్న బ్యాంకు పాసుబుక్ కాపీ, ఆధార్కార్డు జిరాక్స్ కాపీ, వ్యవసాయశాఖ నుంచి పొందిన విత్తన పత్రం ఒరిజినల్ కాపీ తీసుకెళ్లి సంప్రదించాలి. ప్రపోజల్ ఫారాన్ని రైతులు పూర్తిగా నింపాలి. ఏ సర్వే నంబరులో పంట బీమా చేయాలనుకుంటున్నారో ఆ సర్వే నంబరు, విస్తీర్ణం గురించి పూర్తి వివరాలు రాయాలి. రైతులు బీమా చేయించాలనుకుంటున్న విస్తీర్ణాన్ని బట్టి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసుకుని సరిపడా డి.డి తీసి అన్ని పత్రాలతో పాటు డి.డి. ని జత పరచాలి. కాగా రైతులకు పంటనష్టం జరిగినప్పుడు వెంటనే సంబంధిత బీమా కంపెనీకి తెలియజేయాలి.
ఈ పథకం అందరికి వర్తిస్తుందా ?
రైతులు పండించే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం అందుబాటులో లేదు. శీతోష్ణస్థితి, వ్యవసాయ పద్ధతులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం పంటల బీమాకు అవకాశం కల్పిస్తోంది. వరి, గోధుమలు, పప్పుధాన్యాలు,మిర్చి, ఆముదం, వేరుసెనగ, జీడిపప్పు, అవిశ, అరటి, పత్తి ,మామిడి మొదలైన పంటలు పండించే రైతులు బీమా పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత ప్రీమియం చెల్లించాలి..
ఖరీఫ్ పంటకు 2% ప్రీమియం, రబీ పంటకు 1.5% ప్రీమియం చెల్లించాలి. పిఎమ్ఎఫ్బివై పథకం వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో రైతులు 5% ప్రీమియం చెల్లించాలి. కావాల్సిన డాక్యెమెంట్లు…
రైతు ఫోటో, ఐడి కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫీల్డ్ నంబర్, పొలంలో పంటకు రుజువు ఇవ్వాలి.
అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
1. www.pmfby.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి
2. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి.
3. అప్లికేషన్ నెంబర్, captcha ఎంటర్ చేయండి
4. ఆ తర్వాత చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
#PradhanMantriFasalBimaYojana #PMFBY #SchemesforFarmers #agriculturelatestnews #eruvaaka