వార్తలు

కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు..

0

ఏపీ ప్రభుత్వం పంజరంలో చేపల సాగు(కేజ్ కల్చర్)ను మరింత ప్రోత్సహించేందుకు అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేనందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎం ఎఫ్ ఆర్ ఐ ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్ కల్చర్ ను 2017 లో రాష్టంలో ప్రారంభించారు. ఈ సాగుకు గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే ఈ సాగు సముద్రం, నదుల్లోనే కాదు అన్ని రకాల రిజర్వాయర్లలో ప్రోత్సహించే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. దీంతో మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఉపాధి మార్గాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్ లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్ లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్ లో 10 మెరైన్ కేజ్ లు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో 110 బ్యాక్ వాటర్ కేజ్ లు ఉన్నాయి. అత్యధికంగా 70కు పైగా కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉండడంతో కేజ్ కల్చర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన (పీఎం ఎం ఎస్ వై) ద్వారా 60:40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్ కేజ్ ద్వారా ఏటా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు బ్యాక్ వాటర్ కల్చర్ ద్వారా రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వస్తుంది.

Leave Your Comments

వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి..

Previous article

విటమిన్ “సి” ఉన్న ఆహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Next article

You may also like