ఆంధ్రప్రదేశ్తెలంగాణమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

వరి నారుమళ్ళలో సస్యరక్షణ

0
              మన రాష్ట్రంలో వరిని ప్రధాన ఆహార పంటగా పండిస్తున్నారు. వరి ప్రాథమిక దశ అంటే నారుమడి దశ నుంచి అనేక రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. కావున, సకాలంలో ఈ పురుగుల ఉనికిని, ఉధృతిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ఆరోగ్యవంతమైన నారుమడితో అధిక దిగుబడిని సాధించవచ్చు.
వరి నారుమడిని ఆశించే పురుగులు :
                   సాధారణంగా నారుమడిని ఉల్లికోడు, కాండం తొలిచే పురుగులు, హిస్పా, తామర పురుగులు మరియు నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశించి ఎక్కువగా నష్టం చేకూర్చుతున్నాయి.
కాండం తొలిచే పురుగులు :
              తల్లి రెక్కల పురుగులు పసుపు రంగులో ఉండి ముందు రెక్కల మీద నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఈ పురుగులు వరి ఆకుల చివరి భాగంలో గుడ్లను సుమాదాయాలుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలికి రంద్రం చేసుకుని వెళ్ళి కణజాలాన్ని తింటూ కాండాన్ని తొలిచివేస్తాయి. దీనివల్ల మొవ్వు చనిపోవడంతో పాటు ఆకులు ఎండిపోతాయి. నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే అవి ప్రధాన పొలాన్ని ఆశించి తీవ్రంగా నష్టాన్నికలుగజేస్తాయి. కనుక ప్రధాన పొలంలో నారు ఊడ్చుకునేటప్పుడు ఆకుల చివర్లు తుంచి నాటుకోవాలి. ఈ పురుగు నివారణకు ఒక చదరపు మీటరు నారుమడికి ఒక గుడ్ల సముదాయం లేదా1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 గ్రా. కార్టస్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే నారుతీయడానికి వారం రోజుల ముందు పలుచటి నీటి తడి ఇచ్చి 160 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడిలో వేసుకుంటే నారుమడిలోనే పురుగును నాశనం చేయవచ్చు.
హిస్పా (తాటాకు తెగులు) :
                    ఈ పురుగులు పెంకు పురుగుల్లాగా నలుపు రంగులో ఉండి శరీరం మీద ముళ్ళు కలిగి ఉంటాయి. ఇవి ఆకుల ఈనెల మధ్యలో ఉండే పత్రహరితాన్ని గోకి తినడం ద్వారా తెల్లటి చారలు ఏర్పడతాయి. పిల్ల పురుగులు ఆకు పొరల మధ్యలోనికి చొచ్చుకుని పోయి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద తెల్లటి చారలు ఏర్పడి క్రమేపీ ఆకులు ఎండిపోతాయి. దూరం నుండి చూస్తే ఈ పురుగు ఆశించిన నారుమడి ఎండిపోయినట్లు తాటాకు తెగులు ఆశించినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగులు వరితోపాటు పొలం గట్ల మీద ఉండే గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా ఆశిస్తాయి. పొలంలో పంట లేనప్పుడు కలుపు మొక్కల మీద ఆశ్రయం పొంది తరువాత వరిని ఆశించి నష్టం కలుగజేస్తాయి. కనుక పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. దీని నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. ప్రొఫినోఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లికోడు :
                     ఈ పురుగు ఎరుపురంగులో దోమలాగా ఉంటుంది. ఇవి ఆకు తొడిమల మీద గుడ్లు పెడతాయి. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు అంకురం భాగాన్ని ఆశించి దానికి నష్టం కలుగజేస్తాయి. దీనితోపాటుగా కొన్ని రసాయనాలను విడుదల చేయడం వల్ల అంకురం ఆకులాగా వృద్ధి చెందకుండా పొడవాటి గొట్టంలా మార్పు చెంది ఉల్లికోడులాగా బయటకు వస్తుంది. దీని నివారణకు ఒక చదరపు మీటరుకు ఒక ఉల్లికోడు సోకిన పిలక గమనించిన వెంటనే సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి.
తామర పురుగులు :
               తల్లి, పిల్ల పురుగులు ఆకుల అంచుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి చుట్టుకుని పోతాయి. మెట్ట వరినారుమళ్లలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. ఫిప్రొనిల్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నారు కత్తిరించే పురుగులు :
              ఈ లద్దె పురుగులు పగటి వేళలో మొక్క మొదలు దగ్గర దాగి ఉండి రాత్రి వేళలో నారును కత్తిరించినట్లుగా కొరికి తింటాయి. దీనివల్ల నారుమడి పశువులు మేసినట్లుగా కనిపిస్తుంది. దీని నివారణకు నారుమడిని నీటిలో నింపడం వల్ల లోపల ఉన్న పురుగులు బయటకు వస్తాయి. నీటిపై తేలుతున్న పురుగులను పక్షలు తిని కొంతవరకు నాశనం చేస్తాయి. అదేవిధంగా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్లోరిపైరిఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
డా. ఎం.స్వాతి, శాస్త్రవేత్త (కీటక శాస్త్రం), డా.టి.ఎస్.ఎస్.కె. పాత్రో,
ప్రధాన శాస్త్రవేత (మొక్కల తెగుళ్ళ శాస్త్రం),
డా. ఎన్. అనురాధ, సీనియర్ శాస్త్రవేత్త (మొక్కల ప్రజనన శాస్త్రం),
డా.యు.త్రివేణి, శాస్త్రవేత్త (సస్యశాస్త్రం),
డా. కె. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త (సస్య శాస్త్రం),
డా.ఎం.దివ్య, రీసెర్చ్ అసోసియేట్ (మొక్కల తెగుళ్ళ శాస్త్రం)
మరియు ఎం.త్రివేణి, రీసెర్చ్ అసోసియేట్ (మొక్కల ప్రజనన శాస్త్రం),
వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం, ఫోన్ : 94930 84826
Leave Your Comments

తెలంగాణాలో అధిక దిగుబడినిచ్చే సన్నగింజ వారి వంగడాలు

Previous article

You may also like