తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

0
            రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే వానాకాల పంటల సాగు కోసం రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గత పంటకు సంబంధించిన అవశేషాలను తొలగించేందుకు అత్యంత సులభమైన మార్గంగా పంట వ్యర్థాలను కాల్చివేయడం జరుగుతున్నదని వ్యవసాయ శాఖ గమనించింది.
           అయితే పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతులకు లాభాల కంటే అధిక నష్టాలు కలుగుతున్నాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దహనం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం పదార్థం దెబ్బతినడంతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా నశిస్తాయి. దీని ప్రభావంతో భూసారం తగ్గి, భవిష్యత్‌లో రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
          అదేవిధంగా పంట వ్యర్థాల దహనం వల్ల గాలి కాలుష్యం పెరగడం, ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
                పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాల బహిరంగ దహనాన్ని పూర్తిగా నిషేధిస్తూ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జి.ఓ.ఎంఎస్ నెం.27 ప్రకారం కఠిన చర్యలు అమల్లో ఉన్నట్లు తెలియజేయబడింది. భూములపై, చెత్త మైదానాల్లో (ల్యాండ్‌ఫిల్ సైట్లలో) లేదా ఇతర ప్రదేశాలలో వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిహార రుసుము విధించబడుతుంది.
సాధారణంగా చెత్తను కాల్చినట్లయితే రూ.5,000/- పర్యావరణ పరిహారం విధించబడుతుంది. భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చినట్లయితే రూ.25,000/- పర్యావరణ పరిహారం విధించబడుతుంది.
               ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై చెత్తను బహిరంగంగా కాల్చకుండా సహకరించాలని విజ్ఞప్తి చేయబడుతుంది. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం ద్వారా భూసారం మెరుగుపడటంతో పాటు   సేంద్రియ   కార్బన్ పెరుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ సూచించింది. అలాగే వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొంది.
               వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది రైతులు ఇప్పటికీ పంట వ్యర్థాలను కాల్చివేస్తున్నారని తెలిపారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులు చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మలు పంట వ్యర్థాలు కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన తీవ్ర విచారం కలిగించిందని తెలిపారు.
            ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు డా. బి. గోపి, ఐఏఎస్ తెలిపారు.
               రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి  భూముల సారాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.
డా. బి. గోపి, ఐఏఎస్, సంచాలకులు, వ్యవసాయ శాఖ, తెలంగాణ
Leave Your Comments

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

Previous article

అధిక దిగుబడికి అధిక సాంద్రత పత్తిలో విత్తనాలు, ఎరువుల నిర్వహణ

Next article

You may also like