- రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి- మంత్రి తుమ్మల.
- మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి- మంత్రి తుమ్మల .
రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పర్యటించారు. తొలుత మంత్రి గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్, టెక్నాలజీ ని సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగం పై చేస్తున్న పరిశోధన ల గురించి తెలుసుకున్నారు. భవిష్యత్ వ్యవసాయ రంగం లో కూలీల సమస్య అధికమయ్యే అవకాశం ఉన్నందున డ్రోన్స్ వినియోగం ప్రాముఖ్యత ని గుర్తు చేసారు. తదనుగుణం గా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డ్రోన్ ఆధారిత వివిధ వ్యవసాయ విధానాల్ని మంత్రి అభినందించారు. అదే విధంగా ఇటీవల SBI – CSR నిధుల సాయం తో అభివృద్ధి చేసిన రోబోటిక్స్ మరియు సెన్సర్ బేస్డ్ ప్రయోగశాలని సందర్శించి ఇప్పటికే కొన్ని రోబోలని వ్యవసాయ రంగం లో ఉపయోగించే విధంగా అభివృద్ధి చేసినందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలని మంత్రి అభినందించారు. C-DAT లో భాగం అయిన RS&GIS ల్యాబ్ ని సందర్శించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అందించిన ఉపగ్రహ ఆధారిత గణాంకాల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రం లోని రైతాంగం యాజమాన్యం పరిధి లో ఉన్న మొత్తం భూమి లో సుమారు 9.3 శాతం భూమి సాగు లో లేదని ఈ సందర్బంగా మంత్రికి వివరించారు.
99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగం గా వ్యవసాయ విశ్వవిద్యాలయం తలపెట్టిన విత్తన వారోత్సవాలు కార్యక్రమాన్ని మంత్రి లాంఛనం గా ప్రారంభించి పది మంది రైతులకు వివిధ పంటలకి చెందిన నాణ్యమైన మూల విత్తనాలని పంపిణీ చేశారు
విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం చాలా అభినందనీయం అని మంత్రి అన్నారు.కొన్ని విత్తన కంపెనీల మాయ మాటలకి మోసపోకుండా రైతులు ఈ నాణ్యమైన విత్తనాలు వినియోగించి తక్కువ ఖర్చు తో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
అదే విధంగా రైతులు మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలని అనుసరించాలన్నారు. 60 ఏళ్ల క్రితం ఏర్పాటు అయిన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహా అనేక మంది మహానుభావుల తోడ్పాటు తో దేశం లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని మంత్రివర్యులు అభిప్రాయపడ్డారు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తోడ్పాటు తో విశ్వవిద్యాలయం ఇంకా పురోగతి సాధిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు నిరంతరం రైతుల తో మమేకం అయి వారికి కావలసిన పరిష్కారాలు అందించాలన్నారు. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక అదునాతన టెక్నాలజీ లని విశ్వవిద్యాలయం రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావాలని మంత్రి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి సూచించారు. సాగుకు కీలకం అయిన నాణ్యమైన విత్తనాలని రైతాంగానికి అందించాలనే ఉద్దేశం తో గత ఏడాది నుంచి ఈ విత్తన పంపిణి కార్యక్రమం చేపట్టామని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమం లో పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరామ్,డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నీలిమ, డాక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ వై.చంద్రమోహన్ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Leave Your Comments
























