- ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ
- యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ
- రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం
- సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఖరీఫ్-2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జేడీలు, జిల్లా వ్యవసాయ అధికారులు (DAOs)తో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో మంత్రి ఖరీఫ్ సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో ఎలాంటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని, అధికారుల వద్ద ఉన్న లెక్కలకు వాస్తవ నిల్వలకు పొంతన ఉండేలా చూడాలని ఆయన హెచ్చరించారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత డీలర్లపై తక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి, తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. నానో యూరియా వినియోగం ద్వారా అనేక మంది రైతులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన గుర్తుచేశారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రచారం చేయాలని, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అవకాశం ఉన్న మేరకు ప్రత్యక్ష విత్తన సాగును (Direct Sowing) ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ షాపుల వద్ద యూరియా కోసం గందరగోళ పరిస్థితులు ఏర్పడకూడదని, రైతులకు అవసరమైన మేరకు సరఫరా సక్రమంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతుల్లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నందున, అవసరమైన పరిమాణాన్ని ముందుగానే కేంద్రంతో సమన్వయం చేసుకుని తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రైతులను సంప్రదాయ వ్యవసాయం నుంచి సుస్థిర, సహజ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నానో యూరియా, మిశ్రమ పంటలు, అంతర పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల సరఫరా, నిల్వలు, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్-2026ను విజయవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Leave Your Comments























