మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సుమారు 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా వరి సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పైగా ఉంది. పెద్ద ఎత్తున వరి సాగు జరుగుతున్న నేపథ్యంలో కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి గడ్డి నిర్వహణ ఒక ముఖ్యమైన సమస్యగా మారింది.
చాలా మంది రైతులు కోతల అనంతరం పొలంలో మిగిలిపోయిన వరి గడ్డిని తొలగించడానికి కాల్చివేయడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. వరి గడ్డిని కాల్చడం వలన భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించిపోతాయి. అంతేకాకుండా కార్బన్ మోనాక్సైడ్, మిథేన్ వంటి హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలై పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయి.
అందువల్ల కోతల అనంతరం వరి గడ్డిని కాల్చకుండా పశువులకు మేతగా ఉపయోగించడం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించడం చాలా మంచిది. మిషన్లతో కోతలు కోయడం వలన సుమారు ఒకటిన్నర నుండి రెండు టన్నుల వరకు గడ్డి ప్రతి ఎకరానికి పొలంలో మిగిలిపోతుంది. ఈ గడ్డిని తగలబెట్టడం వల్ల పంటకు అవసరమైన అనేక పోషకాలు నష్టపోతాయి మరియు పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుంది.
వరి గడ్డిని పొలంలోనే కలియదున్నడం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గడ్డిని బాగా కలియదున్నడం వలన ఆ పొలంలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా భూమిలో కలిసిపోతాయి. సుమారు 30 నుండి 90 రోజుల మధ్య గడ్డిలో ఉన్న పోషకాలు పూర్తిగా కుళ్ళి తదుపరి పంటలకు అందుబాటులోకి వస్తాయి.
దీని వల్ల తదుపరి పంటలకు వేయవలసిన ఎరువుల పరిమాణాన్ని సుమారు 25 నుండి 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎరువులపై అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. వరుసగా మూడు నుండి ఐదు సంవత్సరాలు ఈ విధంగా వరి గడ్డిని కాల్చకుండా భూమిలో కలియదున్నడం వలన భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుంది.
వరి గడ్డిని కుళ్లించే విధానం :
వరి కోత పూర్తయిన తరువాత పొలంలో కొద్దిగా నీరు పెట్టి కేజ్ వీల్స్ లేదా రోటావేటర్ సహాయంతో ఒకసారి కలియదున్నాలి. అనంతరం ఎకరానికి సుమారు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 10 నుండి 15 కిలోల యూరియాను చల్లి మళ్లీ మూడు నుండి నాలుగు రోజుల తరువాత దున్నాలి. ఇలా చివరిసారి దున్నిన తరువాత పొలంలో సూక్ష్మజీవాల సంఖ్య పెరిగి గడ్డి త్వరగా కుళ్ళిపోతుంది. దీని వలన గడ్డిలో ఉన్న పోషకాలు భూమిలో కలసి తదుపరి పంటలకు ఉపయోగపడతాయి.
డీకంపోజర్ ఉపయోగించడం :
ప్రస్తుతం మార్కెట్లో వరి గడ్డిని త్వరగా కుళ్లించే వివిధ రకాల డీకంపోజర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వలన వరి గడ్డి వేగంగా కుళ్ళిపోతుంది మరియు భూమికి అవసరమైన పోషకాలు త్వరగా అందుతాయి.
పూసా డీకంపోజర్ ఉపయోగించే విధానం :
ఐదు లీటర్ల నీటిలో 250 గ్రా. బెల్లాన్ని బాగా మరిగించాలి. ఈ ద్రావణం చల్లారిన తరువాత 50 గ్రా. శెనగపిండి మరియు రెండు పూసా డీకంపోజర్ మాత్రలు వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని నాలుగు నుండి ఐదు రోజుల పాటు మూతపెట్టి ఉంచితే సూక్ష్మజీవాలు బాగా పెరుగుతాయి. తర్వాత తయారైన ఈ ఐదు లీటర్ల ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో సమానంగా పిచికారీ చేయాలి. దీని వలన వరి గడ్డి త్వరగా కుళ్ళిపోతుంది.
ఘజియాబాద్ డీకంపోజర్ ఉపయోగించే విధానం :
200 లీటర్ల నీటిలో రెండు కిలోల బెల్లం పొడిని వేసి బాగా కలపాలి. అనంతరం ఒక ప్యాకెట్ ఘజియాబాద్ డీకంపోజర్ వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంచి తర్వాత పొలంలో సమానంగా పిచికారీ చేయాలి. ఈ విధంగా చేయడం వలన 10 నుండి 15 రోజులలో సూక్ష్మజీవాల సంఖ్య పెరిగి వరి గడ్డి త్వరగా కుళ్ళిపోతుంది.
వరి గడ్డిని కాల్చకుండా పొలంలోనే కలియదున్నడం లేదా డీకంపోజర్లను ఉపయోగించి కుళ్లించడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవాలను కాపాడుకోవచ్చు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుంది. దీని వల్ల రైతులకు ఎరువుల ఖర్చు తగ్గి స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.
డా. రమ్యా రాథోడ్, డా. కృష్ణ చైతన్య, డా. వై.ఎస్. పరమేశ్వరి, డా. ఫిర్దోస్ సహానా, మంజు భార్గవి, ఎం. సాయి చరణ్, జి. రాకేష్, డా. ఆర్. రమేష్, డా. జే. చంద్రకళ, సాయి దివ్య మరియు డా. కె. పవన్ చంద్ర రెడ్డి, ప్రాంతీయ చెఱకు మరియు వరి పరిశోధన స్థానం, రుద్రూర్, నిజామాబాద్, ఫోన్ : 8179525139
























