మామిడిలో దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణం పూత, పిందె రాలడం. ఈ సమస్యను అధిగమించాలంటే మామిడి తోట యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న, చిన్న మెళకువలు పాటించి తోటను కాపాడుకోవాలి. లేదంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. తోటను సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధికదిగుబడులు సాధించవచ్చు.
ఆకుగూడుపురుగు :

ఆకు జల్లెడ గూడు పురుగు నివారణకు గూళ్ళను వెదురుకర్రలతో జల్లెడ దులిపి తరువాత క్లోరోపైరిఫాస్ 2 మి. లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తేనెమంచు పురుగులు :

తల్లిపురుగులు గుంపులుగ చేరి లేత ఆకులను, పూత కాండాలను లేతపిందెల నుండి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర మరియు పూత మాడిపోతాయి. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి పదార్ధాన్ని విసర్జించడం వల్ల ఆకులు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. వీటి నివారణకు థియామెథోక్సామ్ 0. 3 మి. లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా 0. 2 మి. లీ. / లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ మందును పిచికారీ చేసుకోవాలి.
బూడిద తెగులు :

లేత ఆకులు, పూత, చిరు పిందెలమీద తెల్లటి పొడి లాంటి బూజు చేరుతుంది. ఇది ఎక్కువగా రాత్రి పూత చల్లగా, పగలు వేడిగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. నివారణకు మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం లేదా హెక్సాకోనజోల్ 2 మి. లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుల మీద, కొమ్మల మీద నల్లటి మచ్చలు ఉన్నట్లయితే 1 గ్రాము కార్బండిజమ్ లేదా 2. 5 గ్రా. మాంకోజెబ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగు, తేనెమంచు పురుగు అధికంగా ఉంటే ఫిప్రోనిల్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో అకాల వర్షాల వల్ల వచ్చే తెగుళ్లను కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసి అరికట్టవచ్చు.
పూత, పింద రాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్ 0.2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా సకాలంలో తగిన చర్యలు చేపట్టి రైతులు మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.
డా.ఎ.నిర్మల, శాస్త్రవేత్త,
డా.కె.అరుణ, శాస్త్రవేత్త, రాహుల్ విశ్వ కర్మ, శాస్త్రవేత్త,
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం,
సంగుపేట్, సంగారెడ్డి, ఫోన్ : 8330940330


























