ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ఉన్న నాణ్యత, విశ్వసనీయతపై విస్తృత ప్రచారం అవసరమని, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాణ్యతపై ప్రతి రైతు దృష్టి పెట్టాలని, అప్పుడే మంచి ధర లభిస్తుందన్నారు. చేపలు, రొయ్యల చెరువులకు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సీఎం సూచించారని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 48 శాతం చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. గతంలో రైతులు చెరువుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించామని, చెరువులకు జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆక్వారంగ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Leave Your Comments


























