- కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
- హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
- పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన మంత్రి తుమ్మల
- ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క వున్న యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని కోరిన మంత్రి తుమ్మల
నిజామాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమయింది. ఇదివరకే రాష్ట్రంలోని నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, నేడు దాని ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు మరియు నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ కి పసుపు బోర్డు ప్రకటించి, దాని కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఙతలు తెలిపారు. అలాగే పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పసుపు రైతులు తమ పంటను కనీస మద్ధతు ధరకు అమ్ముకునే విధంగా ధరలలో స్థీరికరణ తేవాలన్నారు. అందుకోసం పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని, MARKFED, NAFED వంటి సంస్థల ద్వారా నేరుగా కొనుగోళ్లను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పసుపు ప్రధానంగా పండే ప్రాంతాలలో డ్రైయింగ్ ప్లాట్ఫార్ములు నిర్మాణానికి కేంద్ర నిధులను కేటాయించాలన్నారు. రైతుల వద్దనే పసుపు పాలిషింగ్, గ్రేడింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అధిక కర్క్యూమిన్ శాతం, వ్యాధి నిరోధకత, ఎగుమతులకు అనుకూలత కలిగిన విత్తన రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
పసుపు సాగు యాంత్రీకరణ, విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపై ICAR మరియు UGC మద్దతుతో పరిశోధనలకు తోడ్పాటు కల్పించాలని, భౌగోళిక సూచిక (GI) ఆధారంగా తెలంగాణ పసుపును అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. పసుపు పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు డాక్యుమెంటేషన్ను సరళీకరించడం, అంతర్జాతీయ వాణిజ్య డెలిగేషన్లు, ఎగ్జిబిషన్లలో రైతుల పాల్గొనడాన్ని ప్రోత్సహించాలన్నారు.
పసుపు రైతులకు వారి స్థానిక భాషల్లో సలహాలు అందించే విధంగా మొబైల్ యాప్ లు అభివృద్ధి చేయాలని, విలువ ఆధారిత, సేంద్రీయ సాగు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు సాగులో కార్మిక వ్యయాన్ని తగ్గించేందుకు MGNREGS పథకంతో సమన్వయం చేయాలన్నారు. పసుపు రంగ అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పసుపు బోర్డు మరియు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని,
ప్రస్తుత పసుపు సాగు పరిస్థితులపై బేస్లైన్ సర్వేను చేపట్టి, వచ్చే ఐదు సంవత్సరాల కోసం ప్రణాళికను రూపొందించాలని అన్నారు.
ఏపిలోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి.
ఏపి పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్రమంత్రిని లేఖ ద్వారా కోరారు. భద్రాచలం పట్టణం తెలంగాణలో కొనసాగుతుండగా, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం అనే గ్రామ పంచాయతీలు [17 రెవెన్యూ గ్రామాలు] విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారని, వీటి వలన అనేక పరిపాలనా, అభివృద్ధి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా భద్రాచలం పట్టణం మరియు తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతుందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో మరియు రెండు రాష్ట్రాల చెక్పోస్టుల వల్ల గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఎల్డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహణకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎందుకంటే దేవస్థానం భూములు ఏపీ పరిధిలో ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఆ గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడం అత్యవసరమని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు.
Leave Your Comments


























