Andhra Pradesh Veterinary : గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రపదేశ్ పశు సంవర్థక శాఖ తన పరిధిలోని పశువైద్యశాలల పనివేళలను అత్యంత బాధ్యతా రహితంగా,అవగాహన లేకుండా మార్చివేసింది.బ్రిటీష్ కాలం నుంచి మన పశు వైద్యశాలలన్నీ వేసవిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు,ఇతర నెలల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు,మరల సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటలవరకు తెరచివుండేవి.
- దాదాపు ఇదే విధానాన్ని దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలు ఈనాటికీ పాటిస్తుండగా రైతుల ప్రయోజనాలను,సౌకర్వాన్ని ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఈ పనివేళల్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొంత భోజన విరామం ఉండే విధంగా మార్చి వేసింది.ఈ మార్పు కేవలం అధికారిక గ్రామంలో నివసించకుండా సమీప పట్టణాలు,నగరాల నుంచి వస్తూ,పోతూ ఉండే సిబ్బంది సౌకర్యాన్ని,కొందరు సిబ్బంది ప్రైవేట్ ప్రాక్టీసుకు అనుకూలంగా ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది.
- పూర్వపు పనివేళల్లో,చల్లని సమయంలో రైతులు తమ పుశుపును పశువైద్యశాలకు తీసుకొచ్చి చికిత్స చేయించుకోవటం వల్ల అటు పశువుతోపాటు యజమానికి కూడా సౌకర్యంగా ఉండేది. పశువైద్య సేవలను ఉదయమే ముగించుకొని రైతు తన దినసరి వ్యవసాయ పనులకు, ఇతర దైనందిన పనులకు హాజరయ్యేవాడు.ఈ చల్లని వేళలో వ్యాధి గ్రస్త పశువును హాస్పిటలుకు తీసుకారావడం కూడా అన్నివిధాలా మంచిది.
- కొత్త విధానంలో ఎండ ముదిరిన తర్వాత అంటే ఉదయం 10 గంటలకు తీసుకువచ్చిన పశువుకు మండుటెండలో కాల్షియం వంటి కొన్ని ఇంజక్షన్లు,మందులు వాడటం కూడా ప్రమాద కరమే! చికత్సలు పూర్తయిన తార్వాత ఇళ్లకు తిరిగి వెళ్ళటం కూడా ప్రమాదకరమే. పైగా ఈ కొత్త పనివేళల్లో గ్రామీణ రోడ్లు కూడా ట్రాఫిక్ రద్దీతో ఉండి,పశువులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
- ముఖ్యంగా కృత్రిమగర్భోత్పత్తికి వాడే వీర్యదానాలను చల్లని వేళల్లో మాత్రమే చేయాలి ఒకేరోజు రెండు సార్లు వీర్వదానం చేస్తే కట్టునిలిచే అవకాశాలు షుమారు 10-15 శాతం పెరుగుతాయని శాస్త్రజ్ఞులు చెబుతారు.అయితే ఉదయం 10 గంటలకు పశువైద్యశాల విధులు ప్రారంభిస్తే సాధారణంగా కృత్రిమ వీర్యదానాల ప్రారంభం 12 నుంచి 1 గంట వరకు మాత్రమే జరుగుతుంది.మొదటి వీర్యదానానికి రెండో వీర్యదానానికి మధ్య వ్యవధి సుమారు 6- 8 గంటలు ఉండాలి.కాత్త పని వేళల్లో ఈ వ్యవధిని పాటించటం సాధ్యం కాదు.ఒక ఎదలో చూడి నిలవక పోతేనే ఈనటం 21 రోజులు ఆలస్యమై సగటున 10 -12 వేల రూపాయల విలువైన 150-200 లీటర్ల పాల ఉత్పత్తిని రైతులు కోల్పోతారు.వరుసగా మూడు ఎదల్లో చూడి నిలవక పోతే పశువు గొడ్డు మోతుగా మారిపోయే ముప్పు కూడా ఉంటుంది.
- వాతావరణంలో వేడి పెరిగినప్పుడు వీర్యాన్ని భద్రపరిచే అతిశీతలమైన ద్రవ నత్రజని కంటెయినరు ఉష్ణోగ్రత (- 19 డిగ్రీలసెంటీగ్రేడ్)ఎక్కువసార్లు మూత తెరిచినప్పుడు బయట వేడి ప్రభావంతో కంటెయినర్ లోపలి వీర్యం త్వరగా చెడిపోయి,అదిపూర్తిగా నిరుపయోగమై పోతుంది.వీర్వాదానం చేసే ముందు వీర్యంలోని వీర్యకణాల స్థితిని గుర్తించే వెసులు బాటు గ్రామీణ స్థాయిలోనే కాక పెద్ద హాస్పిటల్, పోలీక్టినిక్ లలో కుండా ఉండదు.
- అత్యవసర సేవలు అవసరమైన ప్రసూతి సమస్యలు, ప్రమాదాలు, విషాహారం,ప్రాణాంతక అంటురోగాల చికిత్సకు గ్రామాలలో ఎల్ల వేళలా అందుబాటులో వుండవలసిన పశు వైద్యులు,ఇతర సిబ్బంది ఎక్కడో దూరాన ఉండే పట్టణాల్లో నివసించడాన్ని నిషేధించాలి.
పైగా గ్రామాలలోనే నివసించే పశువైద్యులు మాత్రమే రైతులతో సన్నిహితంగా ఉంటూ ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని వారికి అందిస్తూ కొత్త పద్దతుల అమలుకు వారికి తగిన ప్రోత్సాహక, సహకారాలను సమర్థంగా,సకాలంలో అందించగలుగుతారు. - స్థానికంగా పశువైద్యుడు అందుబాటులో లేనందువల్ల భారీ ఫీజులు చెల్లించి గోపాలమిత్రలు ,కాంపౌండర్లు ,అటెండర్లతో తమ పశువులకు చికిత్స చేయించుకోవాలిసిన దుస్థితి ఉండదు.ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పశువైద్యాశాలల పూర్వపు పని వెళలను (ఇతర రాష్ట్రాల తీరులో) పునరుద్ధరిస్తే బాగుంటుంది.
డా.ఎం.వి.జి.అహోబలరావు,హైదరాబాద్ ,
ఫోన్: 9393055611
Leave Your Comments