వార్తలు

మొక్కల్లో పోషకాలు వృద్ధి పరిచే మిశ్రమాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి

0

క్యారెట్, చిలకడ దుంప, మొక్కజొన్న పిండితో తయారు చేసిన మిశ్రమాన్ని పంటలపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో కనిపించిన “డి” విటమిన్
బియ్యం, గోధుమల్లో ఇదే తరహాలో ఎ, సి విటమిన్లను గతంలోనే తెప్పించిన వెంకట రెడ్డి
డి – విటమిన్ పై ఇటీవలే వెలువడిన అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ పబ్లికేషన్.. 130 దేశాల్లో వేర్వేరుగా జాతీయ స్థాయి పేటెంట్లు పొందేందుకు మార్గం సుగమం..
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్ ను ఏదో ఒక వంగడంలోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసల కోర్చి” జన్యుమార్పిడి” ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎరువులు, పురుగుమందులు,కలుపు మందులు వాడకుండా జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే. . మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పాత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళుకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకట రెడ్డి చెప్పారు.సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని(ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు. వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ – డి, ని రాబట్టానని ఆయన ప్రకటించారు తన పొలంలో నుంచే పై మట్టిని, లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి .. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకట రెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలూ, టీవీ చానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్టాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంటను ఆశించకుండా చెయ్యడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు.
ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారెట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారెట్లు , చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి,ఒక లీటరు మిక్సీ లో వేసి ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర్ల డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4 – 5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే పూత,పిందె దశలో 4 – 5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి – విటమిన్ ను పొందవచ్చు అని వెంకట రెడ్డి తెలిపారు.
ఎ- విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలగడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్ లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. “సి” విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మకాయలను 2 కొలువులు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకట రెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన “రెయిన్ డ్రిప్” ప్లాస్టిక్ ట్యూబ్ లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్ తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు.
డి – విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నీక్ ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, , ఆకుకూరలు, క్యాబేజీ వంటి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నలు మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి “రెయిన్ డ్రిప్” ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు నెల రోజుల్లో 4 – 5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితో పాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరోటినాయిడ్స్ ను పంట మొక్కలు ద్వారా విటమిన్ “డి” ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు. వరి , గోధుమల్లో విటమిన్ “డి” తెప్పించడం కోసం 2011 ప్రయోగాలు చేస్తున్నానని, 2018 లో సక్సెస్ అయ్యానని, కూడా అనేక పంటలు పండించి వచ్చానని చింతల వెంకట రెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వాల్ లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను “డి” విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5 – 6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు.
క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి – విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకట రెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీష్ లో పండించిన వరి బియ్యం లో 100 గ్రాములకు 102.70 ఐ.యు. ల మేరకు విటమిన్ “డి” వచ్చిందని వెంకట రెడ్డి వివరించారు.

Leave Your Comments

కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు ..

Previous article

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like