ఆంధ్రప్రదేశ్ఉద్యానశోభతెలంగాణవ్యవసాయ పంటలు

చామంతి పూల సాగు

0

ప్రస్తుతం పూల తోటల వైపు మొక్కుచూపే రైతులకు శీతాకాలంలో సరైన ఆదాయాన్నిచ్చే పూల తోటగా చామంతి పంటను పరిగణించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో వాణిజ్యపరంగా సాగులో ఉన్నఅతి ముఖ్యమైన పూల పంట చామంతి. ఇది శీతాకాలం పంట అయినందున దీనికి శీతాకాలంలో వచ్చే పండుగలకు మరియు శుభకార్యాలకు మంచి గిరాకీ ఉంటుంది. దీని పూలు ఎరుపు, పసుపు, తెలుపు, పింక్ తో పాటు వివిధ వర్ణాలను కలిగి మరియు వివిధ ఆకృతులలో పూయటం వలన మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. చామంతి సాగులో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడి, నాణ్యమైన పూలు మరియు అధిక ఆదాయం ఆ ర్జించవచ్చు.

నేలలు :- మురుగునీరు సదుపాయం గల నేలలు, తేలికపాటి నేలలు అనుకూలం అధిక సేంద్రీయ పదార్థం మరియు నేల ఉద్ధజని సూచిక 6.5 – 7.0 మధ్య ఉన్న నేలల్లో సాగు చేయవచ్చు.

వాతావరణం : –చామంతి శీతాకాలం పంట మొక్క ఏపుగా పెరగటానికి పగటి సమయంలో ఎక్కువగా ఉన్న రోజులు కావాలి. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే శీతాకాలంలో పూత అనేది రావడం చామంతి పంట యొక్క ముఖ్య లక్షణం. చామంతి పగటి ఉష్ణోగ్రతలు 20-30° సెం మరియు రాతి ఉష్ణోగ్రతలు 16-20° సెం పంటకు అనుకూలం.

చామంతి పూల రకాలు :-

చామంతిలో చాలా రకాలు కలవు. వాణిజ్యసరలిలో సాగు చేసుకొనుట కొరకు తెలుపు, పసుపు మరియు ఎరుపు రంగు రకాలు అనుకూలం.

పసుపు రకాలు :- పూర్ణిమా ఎల్లో, బాసంతి, సిల్వర్, బిధాన్ రేఖ, కో-3

తెలుపు రకాలు :- పూర్ణిమా వైట్, ఎం.డి.యు, పంజాబ్ సింగర్, సెంటు సుగంధ,  రత్లామ్ సెలక్షన్, ఐ.ఐ.హెచ్, ఆర్-6

ఎరుపు రకాలు :- కో-2, రెడ్ గోల్డ్, పూర్ణిమా రెడ్

నాటే విధానం :- పిలకలు మరియు కొమ్మ కత్తిరింపులు ద్వారా చామంతిని సాగు చేస్తారు. వేర్లు తొడిగిన కొమ్మ కత్తిరింపులు లేదా పిలక మొక్కలను మే-జూన్ లేదు ఆగస్టు-సెప్టెంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. పాలీహౌస్లలో జూన్-జూలై మాసాల నుండి ఆగస్టు-సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు. వర్షాకాలంలో ముఖ్యంగా తుఫాన్ల కారణంగా ఎడ తెరిపు వర్షాలు పడే సమయాలలో నీరు నిలబడే అవకాశం గల నేలల్లో రైతులు అదును చూసుకొని జూన్ నుండి సెప్టెంబర్ వరకు చామంతి ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. పొలంలో ఒకేసారి కాకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు దఫ్ఫాలుగా నాటినట్లయితే పూలు ఎక్కువ రోజులు కోసుకోవచ్చు.

చామంతి సాగులో పొలం తయారీ అనేది ముఖ్యమైనది. సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి కావున పొలం గుల్లబారేటట్లు 2-3 దుక్కులు చేసుకొని ఆఖరి దుక్కిలో 15-20 టన్నుల పశువుల ఎరువును  ఒక ఎకరానికి వేయాలి. చామంతి పంటను బోదెలు లేదా బెడ్లు తయారు చేసుకొని నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు, వరుసకు వరసకు మధ్య దూరం 30 సెం.మీ లేదా ఒక అడుగు ఉండేటట్లు మొక్కలను నాటుకోవాలి.

కలుపు నివారణ :-  సాధారణంగా మొక్క ఎదిగే దశలో కలుపు ఉండరాదు. పంట కాలంలో 8-10 సార్లు చేతితో కలుపు తీసివేయాలి.

నీటియాజమాన్యం :- మొదటి నెల రోజులు వారానికి రెండు సార్లు తడినివ్వాలి. అటు తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి వాతావరణానికి ఒకటి లేదా రెండుసార్లు నీటి తడులను అందించాలి. ద్విద్వారా నీరు అందించాలంటే ప్రతి చదరపు మీటరుకు రోజుకు 8-10 లీటర్లు నీరు అందించాలి. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వారానికి ఒకసారి నీరు అందించాలి.

ఎరువుల యాజమాన్యం :- మాగిన పశువుల ఎరువును ఎకరాకు 15-20 టన్నుల చొప్పున అందించాలి. సేంద్రియ ఎరువుతో పాటు 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల భాస్వరం మరియు 60-80 కిలోల పొటాషి చెరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.

చామంతిలో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు :-

ఊతమివ్వటం :- చామంతి మొక్కలు పూలు పూచేటప్పుడు బరువుకి పక్కకి వంగిపోకుండా ఊతమివ్వటం మంచిది.

పించింగో/తలలు తుంచడం :- నారు మొక్కలు నాటిన నాలుగు వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచి వేయాలి. ఈ విధంగా చేయటం వలన పక్క కొమ్మలు అధికంగా వస్తాయి. దీని వలన పూలు దిగుబడి పెరుగుతుంది.

సూక్ష్మ పోషకాలు మరియు హార్మోన్ల వాడకం :-  సూక్ష్మధాతులోపి నివారణకు జింకు సల్ఫేట్ 0.2%+ ఐరన్ సల్ఫేట్ 0.2%+ మాంగనీస్ సల్ఫేట్ 0.2% మరియు మెగ్నీషియం సల్ఫేట్ 0.5% మిశ్రమాన్ని మొక్కలు నాటిన 60 రోజులకు మరియు 90 రోజులకు రెండు దఫాలుగా పిచికారి చేయాలి. సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.

మొక్కల పెరుగుదలకు జిబ్బర్లిన్ ఆసిడ్ ను 50 పి.పి. యమ్ అంటి 50 మి.గ్రా ఒక లీటరు నీటికి కలిపి మొక్క నాటిన 30,45 మరియు 60 రోజులకు పిచికారి చేయాలి.

పూలకోత :- రకాలను బట్టి మొక్కలు నాటిన 4 నుండి 6 నెలలకు పూతకు వస్తాయి. పూర్తిగా విచ్చుకున్న పువ్వులను ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ కోసుకోవాలి. ఎకరాకు దాదాపు 5 నుండి 6 టన్నుల దిగుబడి వస్తుంది.

చామంతిలో సస్యరక్షణ

తెగుళ్లు…..

వేరుకుళ్ళు :- వేరు కుళ్ళిపోతాయి. ఆకులు పసుపు రంగుకి మారుతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపిన మందుతో నేలను బాగా తడపాలి.

ఆకుమచ్చ: – నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రా లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగులు :- దీని నివారణకు కరిగే గంధకం 2.5గ్రా లేదా ఎజాక్సీస్టోబిన్ 1 మి.ల్లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగులు :-

ఆకుముడత : –ఈ పురుగు ఆశించిన ఆకులపై సొరంగాల వలె చారలు ఏర్పడతాయి. దీని ఉధృతి అధికంగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. నివారణకు 0.5 మి.లీ. ఇమిడాక్లోపిడ్ లేదా 0.3 గ్రా ఎసిటామిప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.

తామరపురుగులు: – రసాన్ని పిలిచి ఆకులు ముడుచుకునేలా చేస్తాయి. నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ, లీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.

పేనుబంక :- దీనిని వారానికి డైమిధోయెట్ 2 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

డా. వి. హరికుమార్ , ఉద్యాన శాస్త్రవేత్త, డా. ఎస్. అనూష, సస్యరక్షణ శాస్త్రవేత్త డా. ఎస్. కిరణ్ కుమార్, సస్యపోషణ శాస్త్రవేత్త, డా. జి. ఎస్. రాయ్, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, డా. కె. భాగ్యలక్ష్మి, కెవికె, సమన్వయ కర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, ఫోన్ : 8281440912

Leave Your Comments

కన్హా శాంతివనంలో మహాకిసాన్ మేళ – మంత్రి తుమ్మల

Previous article

సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ కీటకాలను నివారించడంలో  “వేప యొక్క పాత్ర”

Next article

You may also like