చూడి పశువులను పెంపకంలో అధిక శ్రద్ధను వహించి తగిన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే చూడి పశువు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన దూడకు జన్మనివ్వడం జరుగుతుంది. చూడితో ఉన్న ఆవుల, గేదెల సంరక్షణ, నిర్వహణలో, వాటికి సరైన ఆహారం, వసతి, పరిశుభ్రత, మరియు వైద్య సంరక్షణ అందించడం చాలా ముఖ్యం. వాటికి కావలసిన పోషకాలు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలకు జన్మనివ్వడానికి సహాయపడుతుంది. ఆవులకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మాసం వరకు ఎద లక్షణాలు చూపించి కట్టడం అనేది జరుగుతుంది. కావున కట్టిన పశువులను అధిక శ్రద్ధతో పెంచవలసిన అవసరం ఉంది.
పాడి పశువులు ఈనిన తర్వాత వాటి గర్భాశయం తిరిగి తన పూర్వపు స్థితి సంతరించుకోవడం, సంకోచం చెందడానికి దాదాపుగా 30-45 రోజుల సమయం తీసు కుంటుంది. ఈ సమయం తర్వాత అవి ఎదకు వస్తాయి. కానీ తిరిగి అవి 60 రోజుల తర్వాత వచ్చే ఎదలో కట్టించడం వల్ల (A.I. ద్వారా) కట్టు నిలవడమే కాక ఏడాదికొక దూడను పొందడం సాధ్యమవుతుంది. కృత్తిమ గర్భోత్పత్తి చేయించిన (45-60) రోజుల తర్వాత అనుభవజ్ఞుడైన పశువైద్యునిచే చూడి పరీక్ష జరిపించాలి.
చూడి పశువులలో మామూలుగా తీస్కోవాల్సిన జాగ్రత్తలు :-
చూడి పశువులను బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. పరిశుభ్రమైన మేత, త్రాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. వాటిని ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీస్కోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. చూలు పశువులను ఈసుకుపోయిన పశువులతో కలవనీయరాదు. వీటిని కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, సంతలలోకొని ఎక్కువ దూరం నడిపించడం చేయరాదు.
ప్రత్యేక జాగ్రత్తలు తీస్కోకపోవడం వల్ల పశువులు ఈసుకుపోవడం, ఈన లేకపోవడం, మెయ్యదిగడం, పొదుగువాపు వ్యాధి రావడం, మాయ పడకపోవడం, చనిపోయిన దూడ పుట్టడం, బలహీనంగా ఉన్న దూడ పుట్టడం, నెలలు నిండకుండానే ఈనడం, పాల జ్వరం రావడం, పాలు తగ్గడం, త్వరగా వట్టిపోవడం, ఈనిన తర్వాత త్వరగా ఎదకు రాకపోవడం, ఎదకు వచ్చినా చూలు నిలవకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
చూడి పశువుల ఆహారం, పోషణ :-
చూలు పశువులకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పరిశుభ్రమైన నీరు తగినంతగా ఇవ్వాలి. గర్భకోశంలోని పిండపు పోషణకు గాను గర్భంతో ఉన్న పశువుకు ఐదవ నెల నుండి 7వ నెల వరకు నుండి దూడ వేసే వరకు రోజుకు ఒక కేజ్ దిగుబడికి, తన శరీరపోషణకు ఇస్తున్న పిండపు పోషణకు గాను గర్బం తొ ఉన్న పశువుకు ఐదవ నెల నుండి 7వ నెల వరకు రోజుకు అరకిలో దాణాను, 7వ నెల నుండి దూడ వేసే వరకు రోజుకు ఒక కిలో దాణాను ఇవ్వాలి. ఇది పశువు పాల దిగుబడికి, తన శరీరపోషణకు ఇస్తున్న దాణాకు అదనంగా ఇవ్వడం వల్ల పిండపు అభివృద్ధి బాగా ‘జరగడం మరియు ఈనిన తర్వాత పాల దిగుబడి బాగా ఉంటుంది.
“చూడి పశువుల పోషణకయ్యే ఖర్చు మున్ముందు లాభాలకు పెట్టుబడి”
చూలు చివరి మూడు నెలల కాలంలో 70 శాతం దూడ (గర్భంలోని) పెరుగుదల ఉంటుంది. ఈ కాలంలోనే పాలు పితకడం మానేయడం వల్ల రైతు సోదరులు దాణా ఇవ్వడం దండుగ మారి పనిగా అనుకుంటూ ఎలాంటి దాణా ఇవ్వకపోవడం వల్ల నష్టం ఎక్కువగా జరుగుతుంది. కావున ఈ చివరి మూడునెలల కాలంలో 1, 2 కిలోల మిశ్రమదాణా ప్రతిరోజు (అదనంగా) ఈనేవరకు ఇవ్వాలి. 25 కిలోల పచ్చగడ్డి, 7 కిలలో ఎండుగడ్డిని ఇవ్వాలి.
చూడి పశువులను అతిగానూ, మరీ తక్కువగానూ మేపరాదు. 25 గ్రా. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజూ దాణాలో ఇవ్వాలి. ఈ దాణాలో 18 శాతం జీర్ణమగు మాంసకృత్తులు, 75 శాతం పూర్తిగా జీర్ణం కాగల పోషక పదార్థాలు ఉండేటట్టు చూడడం వల్ల చూడి పశువులు ఈ చివరి మూడు నెలల్లో 60 నుండి 80 కిలోల బరువు పెరగడం జరుగుతుంది. చివరి దశ చూడికాలంలో 20 కిలోల బరువు పెరిగితే ఆ ఈతకు అదనంగా పాల దిగుబడి ఉంటుంది. మరియు తొందరగా ఎదకు రావడం, తిరిగి కట్టడం జరుగుతుంది.
చూడి పశువుల్లో తీస్కోవాల్సిన రోగనిరోధక చర్యలు :-
ఆరవ నెల గర్భ సమయంలో చూడి పశువులకు నట్టల నివారణ మందులు త్రాగించడం లేదా ఐవర్ మెక్టిన్ లాంటి ఇంజక్షన్లు చేయించాలి. తద్వారా గర్భంలోని దూడలకు వాటి తల్లి ద్వారా ఏలికపాములు ఆశ్రయించకుండా కాపాడుకోవచ్చు. మూడవ నెల నుండి ఆరవ నెల వరకు చూడి పశువులకు గాలికుంటు, జబ్బ వాపు, గొంతువాపు లాంటి వ్యాధులకు రోగ నిరోధక టీకాలు ఇప్పించాలి. ఈ వాక్సినేషన్లు ఇచ్చేటపుడు పశువు భయపడకుండా చూసుకోవాలి. తద్వారా అబార్షన్ కావడం ఉండదు. ప్రతి టీకా వారం నుండి పది రోజుల వ్యవధిలో వేయించాలి. చూలు పశువుల కొట్టాలలో ఎలుకలు ఎక్కువగా ఉండడం వల్ల దాణా మలినమయి “లెప్టోస్పైరోసిస్” వ్యాధి వల్ల అబార్షన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కావున ఎలుకల నివారణ చేపట్టాలి. చూడి పశువుల కొట్టాన్ని గోమారులు, పేలు, మిన్నల్లులు మొదలగు బాహ్యపరాన్నజీవుల నుండి రక్షించడానికి బ్యుటాక్స్ లాంటి మందును 2 మి.లీ. లీటర్ నీటికి కలిపి నెలకు రెండుమార్లు పిచికారి చేయాలి.
చూడి పశువులను వట్టిపోయేటట్లు చేయడం :-
పాల ఉత్పత్తి అధికంగా ఉన్నా కూడా చూలు పశువులను పాలు పితకకుండా ఆపేయడం (వట్టిపోయేటట్టు చేయడం) వల్ల పొదుగుకు విశ్రాంతి ఇవ్వడమే కాక, ఆ కాలంలో పొదుగులోని పాలు ఉత్పత్తి చేసే కణాల అభివృద్ధి జరుగుతుంది. ఇది గేదెలలో 3 నెలలు, ఆవులలో 2 నెలలు తప్పనిసరిగా ఉండాలి. దూడ పెరుగుదల కూడా బాగా జరుగుతుంది (ఆవుల్లో 7వ నెలలో, గేదెలో 8వ నెలలో) తక్కువ పాలిచ్చే పశువులు వాటంతటవే వట్టిపోతాయి. కాని ఎక్కువ పాలిచ్చే పశువులను వట్టిపోయేటట్టు చేయడానికి, వట్టిపోయేటట్టు చేయాల్సిన రోజుకి 10 రోజులు ముందునుండి నాలుగురోజుల పాటు ఆ పశువుకు ఇస్తున్న దాణాను పూర్తిగా నిలిపేసి, నాలుగు రోజుల పాటు ఆ పశువుకు నీళ్ళను సగానికి తగ్గించేయాలి. పచ్చిమేతను పూర్తిగా నిలపేసి ఎండుగడ్డిని మాత్రం ఇవ్వాలి. తద్వారా పశువు పదిరోజుల్లోపు పూర్తిగా వట్టిపోతుంది. తర్వాత పచ్చిమేత, దాణా, నీళ్ళను మునుపు ఇస్తున్న ప్రకారం ఇవ్వాలి. వట్టిపోయేట్టు చేయడానికి రోజు విడిచి రోజు పితకడం, రోజుకు ఒక్కసారి పితకడం లాంటి వాటికంటే కూడా ఇది సులభమయిన పద్ధతి. పొదుగును ముట్టడం, కట్టడం చేయకుండానే పాల ఉత్పత్తి నిలిచిపోతుంది.
పొదుగువాపు నివారణ చర్యలు :
పాలు పితకడం నిలిపేసిన రోజున, పొదుగువాపు రాకుండా ముందు జాగ్రత్తగా పొదుగు యొక్క నాలుగు చన్నుల లోనికి “ఫ్లాక్లాక్స్-డి” మందును ఎక్కించాలి. పాలు ఇస్తున్న కాలంలో పశువుకు పొదుగు వాపు వచ్చి ఉంటే, దానికి ఈ మందును ప్రతీ మూడు వారాలకు ఒకసారి వాడాలి. ఇందుకోసం “కార్టిసోన్స్” ఉన్న మందులను వాడకూడదు, అబార్షన్ అయ్యే అవకాశాలుంటాయి. చూడి పశువుల పొదుగును 8%, నెల నుండి మృదువుగా మర్దన చేయాలి. తద్వారా గిలిగింతలు తగ్గి, ఈనిన తర్వాత “ఎగసేపు” ఉండదు.
మావి సకాలంలో పడిపోవడానికి తీస్కోవాల్సిన జాగ్రత్తలు :
చూడి పశువులను పాలు పితకడం మానేసిన రోజు నుండి, దూడ వేసే వరకు రోజుకు రెండు, మూడు కిలోమీటర్లు తిరుగనివ్వాలి. లేదా పొడవైన త్రాడుతో, ఆరుబయట కట్టి వేస్తే, మూడు నుండి నాలుగు గంటలు తిరుగగలవు. దీనివల్ల మంచి వ్యాయామం దొరుకుతుంది. ఇవి మావి పడిపోవడానికి అనుకూలిస్తుంది. చూలు పశువులకు త్రాగడానికి ఎల్లవేళలా మంచినీరు ఇవ్వాలి. ఈనిన తర్వాత మావి (చెత్త) త్వరగా పడిపోవడానికి 8వ నెల గర్భసమయంలో 15-20 కిలోల మొలకెత్తిన ఉలవలు రుబ్బి, ఉడికించి, తినడానికి పెట్టాలి. కడుపు ఉబ్బరం రాకుండా ఉండటం కోసం మొదటి రోజు పావుకేజీ, రెండవరోజు అరకేజీ, మూడవరోజు ముప్పావుకేజీ, ఆ తర్వాత రోజుకు ఒక కేజీ చొప్పున ఈ మొలకెత్తిన, ఉడికించిన ఉలవలు ఇచ్చినట్లయితే, ఈనిన తర్వాత మావి తొందరగా పడిపోతుంది. గర్భకోశం ఆరోగ్యంగా ఉంటుంది. తొందరగా సంకోచం చెంది తన పూర్వపుస్థితికి వస్తుంది.
గర్భంతో ఉన్న పశువులకు కాల్షియం ఇంజక్షన్ చేయించే రైతులు చాలా మంది కొన్ని జాగ్రత్తలు తీస్కోవడం అవసరం. ఆవులలో 8వ నెలలోపు, గేదెలలో 9వ నెల లోపు కాల్షియం ఇంజక్షన్ చేయించవచ్చు. సామాన్యంగా ఆవులలో 8’/2 నెల తర్వాత, గేదెలలో 10 నెల తర్వాత పొదుగు చేస్తాయి. పొదుగు చేసాక కాల్షియం ఇంజక్షన్ చేయించరాదు. ఒకవేళ చేస్తే ఈనిన తర్వాత పాల దిగుబడి తగ్గిపోతుంది.
చూడి పశువులు ఈనేముందు వాటి వసతి విషయంలో తీస్కోవల్సిన జాగ్రత్తలు :-
ఈనడానికి 15 రోజుల ముందు చూడి పశువును దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, ప్రక్కగోడలకు సున్నం పూసి శుభ్రతను కాపాడుకోవాలి. పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా ఇది కాపాడుతుంది. మేత తొట్టెనుండి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డిని పరుపుగా వాడాలి. వరిపొట్టు, రంపపుపొట్టు లాంటివి వాడడం వల్ల గర్భాశయ రోగాలు రావడం, మావి పడిపోకుండా నిల్చిపోవడం, గర్భకోశం చీము పట్టడం లాంటివి జరుగుతాయి. కొన్ని పశువులలో ఈనడానికి 10 రోజుల ముందు “పొదుగుకు నీరు” రావడం కన్పిస్తుంది. వీటికి, ఈనిన తర్వాత కర్పూరం కలిపిన నూనెను రుద్దడం వల్ల అధిక రక్తప్రసరణ జరిగి వాపు తగ్గిపోతుంది. ఇది వ్యాధి కాదు. ఎలాంటి మందులు వాడనవసరం లేదు.
చూడి పశువులు ఈనే సమయంలో కన్పించే లక్షణాలు మరియు తీస్కోవాల్సిన జాగ్రత్తలు :-
పశువు దూడవేయుటకు వారం రోజుల మునుపు నుండే మానము పెద్దదిగా వాపు కల్గినట్లు ఉండాలి. ఈనాల్సిన సమయానికి 12 గంటలు ముందు దాణా తినదు. పచ్చిగడ్డి కూడా సరిగా తినదు. పల్చగా పేడ వేస్తుంది. తోక మొదలుకు ఇరువైపుల గుంటలు పడతాయి. మానం నుండి పసుపు రంగులో పెద్దతీగె వేస్తుంది. పొదుగు ఉబ్బి, చన్నులు కూడా ఉబ్బి పాలు కారవచ్చు. కొన్ని పశువులలో ఈనడానికి ముందు, ఈనిన తర్వాత “మెయ్యదిగడం” (ప్రొలాప్స్ ఆఫ్ వెజైనా లేదా ప్రొలాప్స్ ఆఫ్ యుటిరస్) కన్పిస్తుంది. ఇది జీవరసాల పొంతనలో లోపం వల్ల, దూడ కదలికలు ఎక్కువగా ఉంటే వస్తుంది. దీనికి తగిన జాగ్రత్తలు పశువైద్యుని సలహా మేరకు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, నీరు ఇవ్వాలి. సాధారణంగా పశువు ఈనడానికి 4-5 గం. ల సమయం పడుతుంది. ఈనిన తర్వాత మావి (చెత్త) పడిపోవడానికి 8 గంటల సమయం సరిపోతుంది. ఒకవేళ 8 గంటల సమయంలోపు మావి పడకపోతే పశువైద్యుని సహాయం తీసుకోవాలి. పశువు గర్భంలో రెండు దూడలుంటే అవి మామూలు కాలం కంటే 7 నుండి 15 రోజులు ముందుగానే ప్రసవిస్తాయి. పశువైద్యుని సహాయం తప్పక తీసుకోవాలి.
పశువు దానంతట అదే ఈనేటందుకు దోహదం చేయాలి. తొందరపడి లేని ఇబ్బందిని కల్గించవద్దు. తొలిచూలు పశువులలో నొప్పులు మొదలైనాక 10-12 గంటలకు ఈనవచ్చు. కొన్ని ఈతల పశువులు 4-5 గం.లు తీసుకొంటాయి. పశువు ఈనగానే గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డ తడిపి, శరీరాన్ని శుభ్రం చేసి, వరిగడ్డిని పక్కవేయాలి. ఈనాక తల్లి దూడను నాకుతుంది. లేదా పొడిగుడ్డతో దూడపై జిగురును తుడిచేయాలి. గంటలోపు దూడను తల్లి పొదుగు వద్దకు తీస్కెల్లి “జున్నుపాలు” త్రాగించాలి. బొడ్డును 2 అంగుళాలుంచి, కత్తిరించి, అయోడిన్ పూయాలి. ఇది “నావల్ ఇల్” రాకుండా కాపాడుతుంది. ఈనిన తర్వాత పశువుకు సులభంగా జీర్ణమయ్యే గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు నలగ్గొట్టి, ఉడికించి, 1-1/2 కిలో తినిపించాలి.
చూడి పశువుల పోషణలో తగిన సలహాలను, సూచనలను పాటిస్తూ, పశువైద్యుల సహాయంతో పద్ధతిగా పోషించటం వలన అధిక లాభాలను ఆర్జించవచ్చు.
డా. ఎన్. రాజన్న, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, డా. జే. సాయికిరణ్, వెటర్నరీ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ,మామునూరు, వరంగల్ జిల్లా, ఫోన్ : 94401 53884.


























