తెలంగాణ రాష్ట్రంలో కంది పంటను వర్షాధారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
గత ఐదు సంవత్సరాలుగా కంది పంటను 8-10 లక్షల ఎకరాలలో సాగు చేయగా ప్రస్తుత సంవత్సరం 4.9 లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది. దీనికి వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అధిక వర్షాలు, ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు, ఒక కారణంగా భావిస్తే మరో కారణం కంది పంటను ఆశించే చీడపీడలు ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసంలో ఉండే తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ వలన కంది పైరుకి స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఆశించి పైరు ఎదుగుదలను నియంత్రించి పూత పూయకుండా చేస్తుంది. తద్వారా దిగుబడి గణనీయంగా పడిపోయే ఆస్కారం ఉంది. కావున స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఆశించడానికి గల కారణాలు మరియు లక్షణాలను ముందే గమనించి తగు జాగ్రత్త చర్యలు పాటించాలి.
తెగులు ఆశించడానికి గల కారణాలు :-
- కంది పైరు 45-60 రోజుల దశలో అధికంగా వర్షాలు కురవడం వెంటనే బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
- గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలో మార్పులు కూడా కారణం.
- కంది పంట చుట్టూ వయ్యారిభామ, చిక్కుడు జాతి అడవి మొక్కలు లేదా చుట్టుపక్కలు నీటి వసతి ఉండడం వలన కూడా తెగులు ఆశించే అవకాశం ఉంది.
- స్టెరిలిటీ మొజాయిక్ తెగులు నల్లి (ఇరిమోఫిడ్ మైట్) ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- రటూన్ పద్ధతి పాటించడం వలన ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది.
లక్షణాలు :-
- స్టెరిలిటీ మొజాయిక్ ఒక వైరస్ తెగులు ఇది ఏసిరియా కజాని అని ఇరిమోఫీడ్ నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- తెగులు ఆశించిన మొక్కలు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా గాని మొజాయిక్ లక్షణాలు చూపిస్తాయి.
- తెగులు ఆశించిన మొక్కల ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకి మారుతాయి. ఆకుల పరిమాణం చిన్నవిగా మారుతాయి.
- ఎదుగుదల తగ్గిపోయి శాయ భాగాలు విపరీతంగా వేయడం వలన మొక్కలు గుబురుగా కనిపిస్తాయి.
- ఈ తెగులు ఆశించడం వలన మొక్కలు పూత పూయవు, కాత కాయవు అందుకే ఈ తెగులు ని గొడ్డుమోతు తెగులు అని అంటారు.
- పాక్షికంగా తెగులు సోకిన మొక్కలు కొంత భాగం పూత పూసిన కాయ సరిగా ఉండవు. గింజ పరిమాణం తగ్గిపోయి తాలు గింజలుగా మారుతాయి.
యాజమాన్య పద్ధతులు :-
- కంది పంటను ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేయకూడదు. పంట మార్పిడి పాటించాలి.
- తెగులుని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి.
- పంట పొలం చుట్టూ కలుపు మొక్కలు వయ్యారిభామ, అడవి జాతి చిక్కుడు లేకుండా చూసుకోవాలి.
- నీడ పడే ఎత్తుగా, పొడవైన చెట్లను పంట పొలంలో ఉంచకూడదు.
- కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటగా వేయకూడదు.
- తెగులు 30-40 రోజుల దశలో ఆశిస్తే పంట నష్టం 80-100 % ఉంటుంది. కావున నీటిలో కరిగే గంధకం పొడిని 3 గ్రా. లీటర్ నీటికి కలిపి మందు జాగ్రత్తగా పిచికారి చేయాలి.
- ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఫెన్ పైరాక్స్ మేట్ 1 మి. లీ / l లేదా అబామెకీటిన్ లేదా హెక్సాథాయోజాక్స్ 0.8 మి. లీ / l నీటికి కలిపి పిచికారి చేయాలి.
- తెగులు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పైన సూచించిన తగు జాగ్రత్త చర్యలు పాటించడం వలన గొడ్డమోతు తెగులు నివారించి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.
డా. జి. పద్మజ, డా. ఎం. మధు, డా. పి. గొన్య నాయక్, డా.ఎ.వెంకట్ రెడ్డి, డా.డి.వీరన్న, డా. ఆర్. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్, ఫోన్ : 9912522394


























