ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం రాష్ట్రం లోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికం గా యూరియా వాడుతున్నట్లు తెలుస్తున్నదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.యూరియా ఎక్కువ గా వాడితే అధిక దిగుబడులు వస్తాయని రైతాంగం లో అపోహ ఉందని, అది సరి కాదని జానయ్య వివరించారు.అధికంగా యూరియా వాడడం వల్ల అధిక దిగుబడులు రాక పోగా ఆయా పంట ఉత్పత్తులలో రసాయన అవశేషాలు నిండిపోయి తద్వారా మానవ అనారోగ్యానికి దారి తీస్తుందని వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిరూపించాయని ఆయన విశ్లేషించారు.అంతే కాకుండా నేలలో కూడా రసాయన అవశేషాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుందన్నారు.తద్వారా నేలలోని పోషకాల లభ్యత, నాణ్యత తగ్గిపోతుందని ఆయన తెలిపారు. దీనితో పాటు అధిక యూరియా వాడకం వల్ల మొక్కల్లో నిరోధక శక్తి తగ్గుతుందని, చీడ పీడల బెడద పెరుగుతుందనీ.. వాటి నివారణకు అధికం గా క్రిమిసంహారకాలు వాడాల్సి వస్తుందని జానయ్య గుర్తు చేశారు.
మొక్కలకి నత్రజని అవసరమే కానీ అందుకు ఎక్కువ గా యూరియా వాడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని జానయ్య రైతాంగానికి సూచించారు. ఇతర ఎరువుల కంటే చౌక గా యూరియా దొరకుతున్న కారణం గా రైతులు యూరియా ని ఎక్కువ గా వాడవద్దని జానయ్య రైతులకు సూచించారు. అవసరం అయిన మేరకే యూరియా వాడి నేల, నీళ్ళ లభ్యత, నాణ్యత లని కాపాడుతూ భవిష్యత్ తరాల ప్రయోజనాల పరిరక్షణ కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.
అధిక యూరియా తో యువత లో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం
ఇటీవల నిర్వహించిన వివిధ ప్రాధమిక ప్రయోగ ఫలితాల ఆధారం గా అధిక యూరియా తో పండించిన ఆహార పంటల వినియోగం కారణంగా వివిధ జంతువులలో సంతానోత్పత్తి తగ్గుతుందని జానయ్య తెలిపారు. అదే విధంగా యూరియా అధిక వాడకం తో పండిన ఆహర ఉత్పత్తుల వినియోగం వల్ల కాన్సర్, కిడ్నీ సంబంధిత ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ, యువత లోనూ సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం పొంచి ఉందని జానయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2022 లో United nations environmental assembly విడుదల చేసిన chemical fertilizer and health అనే నివేదిక లో ఈ అంశాన్ని పేర్కొందని తెలిపారు.ఈ అంశం పై PJTAU లోని ఆహార, పోషణ పదార్ధాల విభాగం ద్వారా మరింత లోతు గా పరిశోధనలు నిర్వహిస్తామని అల్దాస్ జానయ్య ఈ సందర్బంగా ప్రకటించారు.
Leave Your Comments


























