ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన అగ్రికల్చర్, వెటర్నరీ, ఉద్యాన యూజీ కోర్సుల మొదటి విడత కౌన్సిలింగ్
2025-26 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ యూజీ కోర్సులలో ప్రవేశాలకు మొదటి దశ కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతున్న ఈ కౌన్సిలింగ్ కు PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ EAPCET – 2025 లో 221 ర్యాంకు సాధించిన పిడిశెట్టి వర్ణిత కు రాజేంద్రనగర్ లోని వెటర్నరీ కళాశాలలో BVSC లో ప్రవేశం కల్పిస్తూ వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్ చంద్రతో కలిసి ఆయన ధ్రువపత్రాన్ని అందజేశారు. 262వ ర్యాంకు పొందిన రిగ్వేద్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. అలాగే 273 ర్యాంకర్ సత్యనారాయణ రెడ్డి, 276 ర్యాంకర్ మధుమిత, 316 ర్యాంకర్ R. మధుమిత, 362 ర్యాంకు పొందిన S. హరిచందన వరుసగా రాజేంద్రనగర్ లోని వెటర్నరీ కళాశాల మరియు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశం పొందారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ తాము ఈ మూడు విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో చివరి సీటు నిండే వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ కోర్సులలో ఎంత కష్టపడి చదివితే అంత ఫలితం ఉంటుందని చెప్పారు. గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలోనే చేరి మీ డిగ్రీలకు విలువను జోడించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో కేవలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మాత్రమే ICAR గుర్తింపు ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల అధికారులు డాక్టర్ ఈశ్వరి, డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ రమణారావు, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ ఉదయ్ కుమార్, డాక్టర్ జయలక్ష్మి తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ కోర్సుల కు ఉన్న ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాల గురించి వివరించారు. ఈ నెల 23 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతుంది.


























