ప్రముఖ రైతు, శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి గారు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల సేంద్రియ రైతులకు ఉపయోగపడే రెండు ఆవిష్కరణలను ప్రకటించారు.

- వరి పొలంలో ఎకరానికి 50 కిలోల వరి బియ్యపు నూకలు చల్లితే పంట ఏపుగా పెరగటంతో పాటు కలుపు మొలవదని వెంకటరెడ్డి గారు తెలిపారు.
- సోయా, మొక్కజొన్న పిండిని పంటలకు పిచికారీ చేస్తే చీడ – పీడలు, శిలీంధ్ర తెగుళ్లు దరిచేరవని ఆయన వివరించారు.
- ద్రాక్ష, వరి తదితర పంటల్లో మట్టినే ఎరువుగా, పురుగుమందుగా వాడటం. డి, బీ12 విటమిన్లతో కూడిన వరి ధాన్యాన్ని పండించటం వంటి అనేక ఆవిష్కరణలను ఆయన రైతులోకానికి అందించి అనేక అంతర్జాతీయ పేటెంట్లతో పాటు పద్మశ్రీ పురస్కారం పొందిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ గారి “మన్ కీ బాత్” లో చింతల వెంకటరెడ్డి గారి ఆవిష్కరణలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి చింతల ఆవిష్కరణలు సుపరిచితమే.
పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో 20-25 ఏళ్లుగా భూమి లోపలి మట్టి, భూమిపై మట్టిని ఎరువుగా, పురుగుమందుగా వాడుతున్నాను. వీటితో పాటు జనుము, జీలుగ కలియదున్నటం. ఆ తర్వాత ఆముదం చెక్క వెయ్యటం, గోధుమ + సోయా మొలకల ద్రావణం చల్లుతూ వస్తున్నాను. కొత్తగా నేర్చుకున్నదేమిటంటే. వరి బియ్యపు నూకలను వరి పంటలో చల్లటం వల్ల కలుపు నివారణ జరగటంతో పాటు పోషకాల లోపం తీరిపోయింది. జనుమును నేలలో కలియ దున్నిన తర్వాత దమ్ము చేసి ఆర్ఎన్ఆర్ 1508 రకం వరి నారు మొక్కల్ని నాటాం. నాట్లేసిన వెంటనే ఎకరానికి 3 క్వింటాళ్ల ఆముదం పిండి చల్లాము. 10 – 15 రోజుల్లో ఆముదం పిండినే మరో డోసుగా వెయ్యాల్సి ఉంది. కానీ, కూలీల కొరత వల్ల కుదరలేదు.
నాటు వేసిన 40 రోజుల తర్వాత నత్రజని కొరతతో వరి పైరు ఎరుపెక్కింది. ఆ దశలో ఇంట్లో ఉన్న వరి నూకలను అనుకోకుండా పొలంలో చల్లాము. అరెకరం మడిలో 50 కిలోల పాలిష్ పట్టిన వరి బియ్యం నూకలు చల్లిన పది రోజుల్లోనే పంట డార్క్ గ్రీన్ అయ్యింది. నూకలు వేసినందు వల్ల వరి పొలం పది రోజుల్లోనే పచ్చబడింది. సూక్ష్మజీవులు, సన్నటి
వానపాములు వృద్ధి చెంది మంచి ఫలితం కనిపించింది. దీంతో మిగతా రెండు మడుల్లో కూడా ఇలాగే నూకలు చల్లాం. అయితే నిజానికి వరి నాటు వేసిన మరునాడు ఎకరానికి 100 కిలోల వరి నూకలు, 20 రోజుల తర్వాత మరో 100 కిలోల నూకలు చల్లితే పంట ఏపుగా పెరుగుతుంది. నేలలో సూక్ష్మజీవులు సమృద్ధిగా వృద్ధి చెంది కలుపు రాదు.
విటమిన్ డి3 (ఈ సాంకేతికతపై వెంకటరెడ్డికి పేటెంట్ ఉంది), బి12, ఎ వంటి విటమిన్లతో కూడిన వరి ధాన్యం పండించడానికి వరి పంట కంకిపోసుకునే దశలో మొక్కజొన్న 50 కిలోలు, సోయా 50 కిలోలను బరకగా / దొడ్డుగా పిండి పట్టించి పొలంలో నూకలకు ముందే చల్లాం. వరి పొలంలో మొదటి సారి వీడర్లతో గడ్డి తీశాం. ఆ తర్వాత ఎకరానికి 100 కిలోల చొప్పున నూకలు చల్లిన తర్వాత వరి కోతలయ్యే వరకూ కూడా పొలంలో గడ్డి పోచ కూడా మొలవనే లేదు.
నేల బాగా గుల్లబారింది. మొగి తెగులు సహా ఎటు వంటి చీడపీడలూ రాలేదు. ఎకరానికి 35 బస్తాల (75 కిలోల) ధాన్యం దిగుబడి వచ్చింది. పొలంలో ఫలితం వచ్చినప్పుడు అందరి రైతుల పొలాల్లో కూడా వస్తుందని అనుకుంటున్నాను.
వరిలో అధిక పిలకలు పొందటానికి నాటిన 10 రోజులకు, 20 రోజులకు ఎకరానికి 2 కిలోల గోధుమ మొలకలు, కిలో సోయా, కిలో బియ్యం నూకల పిండిని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి ఫెరిలైజర్ అసలు వాడొద్దు అనుకునే రైతులు ఈ పద్దతులను తెలుసుకోవాలి.
Leave Your Comments


























