వార్తలు

లాక్ డౌన్ సమయంలో కిచెన్ గార్డెన్ కు శ్రీకారం..

0

మన చుట్టూ పచ్చని వాతావరణం.. ఉదయం లేవగానే పలకరించే పూలు.. తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ పట్టణంలోనే మన ఇంటిపైనే అందుబాటులోకి తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది.. డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్ లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్దగా కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకున్నారు. 280 చదరపు గజాల ఇంటి పైకప్పుపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు. ఇటు కుండీలు, గ్రోబాగ్స్.. అటు హైడ్రోపోనిక్స్ పద్ధతిలోనూ ఇంటిపంటలు సాగు చేసుకొని పది నెలలుగా తింటున్నారు. లాక్ డౌన్ సమయంలో పది నెలల క్రితం డా. వేదప్రకాశ్ ఈ మిద్దెలోను శ్రీకారం చుట్టారు. కోతుల నుంచి కాపాడుకునేందుకు ఇనుప జాలీని ఏర్పాటు చేస్తూ ఇంటికి కావలసిన కూరగాయలను పండిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలను బంధువులు, స్నేహితులకు రుచి చూపిస్తున్నారు. వేదప్రకాశ్ తోపాటు కుటుంబ సభ్యులందరూ ఇంటి పంటలసాగు పనులు చూసుకుంటున్నారు.
వేదప్రకాశ్ ఇంటి పైకప్పుపై 32 రకాల కూరగాయలు సాగవుతున్నాయి. బీర, కాకర, దోస, గుమ్మడి, చిక్కుడు, సొరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, టమాట, చిక్కుడు, మిర్చి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఆలు, ఇలాయిచీ వంటివి పండిస్తున్నారు. అలాగే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బచ్చలి, బిర్యానీ ఆకును అక్కడ పండిస్తున్నారు. అలాగే అరటి, యాపిల్ చెర్రీ, వాటర్ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బాదాం, పనస, మునగ వంటి పండ్లు, కాయల చెట్లు పెంచుతున్నారు. వేదప్రకాశ్ తన ఇంటిపైకప్పుపై పండిస్తున్న కూరగాయలు వాళ్ళ ఇంటి అవసరాలకే కాకుండా ఇరుగు పొరుగు వారికి బంధువులు, స్నేహితులకు ఇస్తున్నారు. గడిచిన పది నెలలుగా మార్కెట్ లో అడుగు పెట్టలేదని కిరణ్మయి తెలిపారు. ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు అక్కడే లభిస్తున్నాయి. మార్కెట్లో లభించనవి కూడా మిద్దెపై అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఈ రోజు ఏ కర్రీ వండుకోవాలో మిద్దెపైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు. క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకుని వెళ్లి వండుకోవడం జరుగుతోంది. ఇంటిపంటల మధ్య వెదురు బొంగులతో వేసిన కుటీరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. పండుగల పూట, బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు అందరూ అక్కడే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాల మధ్యన విందులు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వెళ్లినా మిద్దెపైకి తీసుకువెళ్లి అంతా చూయిస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు కూరగాయలు కత్తిరించి చేతిలో పెట్టి పంపించడం వాళ్లకు ఆనవాయితీగా మారింది. మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. పది నెలల కాలంగా మార్కెట్ కు వెళ్లే అవసరం రాలేదు. ఇంట్లో అందరం పొద్దున లేస్తే చాలు మిద్దెపైకి రావడం, మొక్కలకు నీళ్లు పట్టడం, వాటిని చూసుకోవడం అలవాటైంది. మనకు కావలసిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో మాకు అర్థమైంది. ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నాం అని వేదప్రకాశ్ ఆనందం వ్యక్తం చేసారు.

Leave Your Comments

కలబంద సాగుతో మంచి రాబడి..

Previous article

రాజస్థాన్ రైతుల సాంకేతిక వ్యవసాయ పద్ధతులు..

Next article

You may also like