వార్తలు

ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణ శిక్షణ..

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతును ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంటల సాగు మొదలుకుని వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ తదితర అన్ని విషయాల్లోనూ రైతుకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దిగుబడులు పెంచడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలనూ మరింత మెరుగుపరిచి అన్నదాతకు అండగా నిలిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం రైతులతో పాటు సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లకూ రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టింది. దీనిలో భాగంగా కడప కేంద్రంగా నీరు, భూమి నిర్వహణ శిక్షణ, పరిశోధన కేంద్రం (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ను ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని ఇప్పుడు కడపలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
డీపీఆర్ సిద్ధం చేసే పనులను త్వరలోనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. ఇప్పటికే తొలి దశలో అద్దె భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. డీపీఆర్ సిద్ధమైన మరుక్షణమే మొదట మామిళ్ళపల్లె ప్రాంతంలోని కొన్ని ప్రభుత్వ భవనాలతో పాటు మరికొన్ని అద్దె భవనాల్లో శిక్షణ కార్యాలయాలను ప్రారంభిస్తామని కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్, ఈ శిక్షణ పరిశోధన కేంద్రం ఇన్ చార్జ్ చెప్పారు. ఆ ఆర్థిక సంవత్సరంలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. కడపలో ప్రధాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా నెల్లూరు, అమరావతి, విశాఖ పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తారు. అన్ని చోట్లా సొంత భవనాలు నిర్మిస్తారు.
శిక్షణ, పరిశోధన కేంద్రం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం.
పంటల సాగు మొదలుకుని ఉత్పత్తి, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తారు.
ఆధునిక పంటల సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు.
అధిక దిగుబడులిచ్చే పంటలు సాగవుతున్న ప్రాంతాలకు రైతులను ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లి వారికి మరింత అవగాహన కల్పిస్తారు.
ఈ కేంద్రాల్లో రైతులకు భోజనం, వసతి సమకూరుస్తారు.
రైతులతో పాటు సాగునీటి పారుదల శాఖ పరిధిలోని ఇంజినీర్లకు సైతం ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఎం. బుక్ ల నిర్వహణ, చెక్ మెజర్ మెంట్ తో పాటు అన్ని అంశాలపై ఇంజినీర్లతో పాటు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకూ శిక్షణ కార్యక్రమాలుంటాయి. ప్రధానంగా సమగ్ర నీటి యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందుకోసం నిపుణులైన టీచింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ప్రిన్సిపాల్ ను కూడా ఈ శిక్షణ కేంద్రంలో నియమిస్తారు. టీచింగ్ స్టాఫ్ కు వసతి గృహాలు, రైతులకు హాస్టల్ వసతి సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తారు. రైతులను ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లేందుకు వాహనాలను సైతం సిద్ధం చేయనున్నారు.

Leave Your Comments

వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

లాభసాటిగా పుట్టగొడుగుల పెంపకం..

Next article

You may also like