మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మే నెల 5 న మొదలై జూన్ 13వ తేదీ వరకు ఆరు వారాల పాటు రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు పేరిట ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలోని 1200 గ్రామాల్లో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 200 బృందాలుగా ఏర్పడి వ్యవసాయ విద్యార్తులు, ప్రజా ప్రతినిథులు, గ్రామ పంచాయితి సభ్యులు, వ్యవసాయ శాక ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, గ్రామాల్లోని పాఠశాల ఉపాద్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు వ్యవసాయ అనుభంద రంగాల ఉద్యోగులను కూడా ఇందులో భాగంగా చేస్తూ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలను ప్రతి యొక్క రైతుకు అందజేయడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో 50, దక్షిణ తెలంగాణ లో 100 మరియు మధ్య తెలంగాణలో 50 బృందాలలో శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మధ్య తెలంగాణ లోని వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట ఆధ్వర్యంలో 08 శాస్త్రవేత్తల బృందాలు ఆరు వారాలలో అశ్వరావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు, ములకలపల్లి మండలాల్లోని 48 గ్రామాలలో కార్యక్రమాలు రూపొందించగా ఇప్పటివరకు మొత్తం 20 కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మిగితా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయి. వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట కు కేటాయించిన మండలాల్లోని గ్రామాలలో కార్యక్రమాలు సముచిత రీతిలో నిర్వహించబడ్డాయి. సగటున 80 నుండి 100 మంది రైతులు పాల్గొంటున్నారు. కేటాయించిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల శాఖల అధికారులు సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖ అధికారులు మరియు పశువైద్యులు కూడా ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో స్టానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక స్వచ్చంధ సంస్థలు, రైతు సంగాల సభ్యులు, వ్యవసాయ సహకార సమితి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీ అధికారులు కూడా పాల్గొంటున్నారు. మా పరిదిలోని వివిధ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాల మొత్తం షెడ్యూల్ గురించి ముందస్తు సమాచారంతో అభ్యుదయ రైతులు మరియు NGOలు, SHGలు మరియు రైతు సహకార సంఘాలను కూడా సంప్రదిస్తున్నాము.
ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా యూరియా వాడకాన్ని తగ్గించడం, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, ఖరీఫ్ లో రైతులు ఉపయోగించే విత్తనాలు కొన్నప్పుడు రసీదును భద్రపరచుకోవడం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా చేసే అవసరమైన పరిజ్ఞానాన్ని, ప్రత్యామ్నాయ పంటల వివరాలను మరియు చెట్ల పెంపకం లాంటి అంశాలపై శాస్త్రవేత్తలు మరియు అధికారులు రైతులకు సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై దృష్టిని సారించి లాభాలబాటలో పయనించేలా వారిని చైతన్య పరుస్తున్నారు.
ఇక్కడి ప్రధాన వ్యవసాయ పంటలు వరి, మొక్కజొన్న, మునగ, పత్తి, మరియు ఉద్యానవన పంటలు ఆయిల్ పామ్, కోకో, కూరగాయాల సాగు వివరాలు, సాగులో మెళకువలు అదనంగా రైతులు అడిగే వివిధ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అక్కడే తగిన సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలను తీసుకురావడం వల్ల రైతుల సాంకేతిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావించి ఈ వినూత్న పద్దతిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ పర్యటనల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్వయంగా రైతుల సాంకేతిక సమస్యలను తెలుసుకొని వ్యవసాయ అనుబంధ శాఖల సహకారం ద్వారా సూచనలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రణాళికల గురించి, ప్రతి రోజు జరుగుతున్న కార్యక్రమాల గూర్చి ఎప్పటికప్పుడు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాకు అందజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు రైతు సోదరులకు చేరువ కావడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో తెలియజేస్తున్న ఆరు అంశాలు సుస్థిర వ్యవసాయం పై సానుకూల ప్రభావం చూపుతాయని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని రైతు సోదరులు తమ ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. వీటితోపాటు వివిధ పంటల సాగు పై శిక్షణ కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. తమ గ్రామాల్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు అనుబంద రంగాల అధికారులు వచ్చి తమకు సూచనలు ఇవ్వడంతో పాటు తమకున్న సందేహాలను తీరుస్తున్నందుకు రైతు సోదరులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాల్లో రైతులతో పాటు వ్యవసాయ పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలు, మరియు వ్యవసాయం పై మక్కువ ఉన్న ఔత్సాహిక యువత ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు
వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట, ఫోన్ : 93923 65767
Leave Your Comments


























