తెలంగాణవ్యవసాయ పంటలు

ప్రోట్రే లలో కూరగాయల నారు పెంపకం

0

మనదేశంలో కూరగాయల పెంపకం 11.24 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణలో, 212.91 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తితో ప్రపంచ దేశాలలో కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, కూరగాయలలో ఉన్న పోషక విలువలు ప్రజలకు తెలియజేయడం వల్ల రోజూ తినే ఆహారంలో కూరగాయలు ఎక్కువ తినే విధంగా మొగ్గు చూపిస్తున్నారు. ఆరోగ్య పరిశోధనల ప్రకారం ప్రతి వ్యక్తి సగటున 200 గ్రాములు మాత్రమే తింటున్నారు. దాదాపుగా 100 గ్రాముల కొరత ఉంది. దీనిని భర్తీ చేయడానికి, దేశంలో కూరగాయల ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యత పెంచవలసిన అవసరం చాలా ఉంది. నాణ్యతలేని విత్తనాలు, శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచకపోవడం, తక్కువ ఉత్పత్తి ఇచ్చే రకాలు, సరైన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం, ఈ విధంగా కూరగాయల పెంపకంలో అనేక లోపాలు ఉన్నాయి. ఏదైనా పంట ఉత్పత్తి పెంచడానికి నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడం మరియు ఆరోగ్యవంతమైన మొక్కల్ని తయారు చేయడం కీలకపాత్ర పోషిస్తుంది. టమాటో, వంగ, మిరప, క్యాప్సికం, క్యాబేజీ, కాలిఫ్లవర్, ఉల్లి మొదలైన కూరగాయలు మొదట నారును పెంచి తర్వాత పొలంలో నాటుకోవాలి. సాధారణంగా రైతులు నారుని బెడ్డ మీద పెంచుతున్నారు. కానీ ఈ బెడ్లను పొలంలోనే ఏదో ఒక పక్కన తయారు చేసి, విత్తనాలు చల్లి, నారుమడి పెంచుతారు. కానీ ఈ పద్ధతి అన్ని పరిస్థితుల్లోనూ రైతులకు సరైన నారు మొక్కలను అందించకపోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడవచ్చు. పశువులు నారుమడిని పాడు చేయవచ్చు. ఇంకా కీటకాలు మరియు తెగుళ్ళ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా రైతు అనేక విధాలుగా నష్టపోతున్నారు. వీటిని అధిగమించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన నారును పొందడానికి ఉన్న ఒక శాస్త్రీయమైన పద్ధతే ప్రోట్రేలలో నారును పెంచడం.

ప్రో ట్రే నర్సరీ వలన ఉపయోగాలు :-

  1. ప్రో ట్రే నారును షేడ్ నెట్ ల క్రింద పెంచుతారు, దీని వలన మొక్కలు చీడపీడల నుండి రక్షించబడతాయి.
  2. విత్తనాలను, పూర్తిగా క్రిమిరహితంగా తయారు చేయబడిన పదార్ధాలతో (కోకోపీట్, పేర్లేట్, వెర్మికులైటు, మొదలైన) నాటడం వలన ఎటువంటి హానికారక క్రిములు విత్తనాలను పాడు చేయలేవు.
  3. ఈ ప్రో ట్రేలలో ఒక్కొక్క విత్తనమును ఒక్క ప్లగ్ లో నాటడం వల్ల, మొక్కల మధ్య నీటి కోసం కానీ, వెలుతురు కోసం కానీ పోటీ ఉండదు. దీనివల్ల ప్రతి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది.
  4. మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా తయారవుతుంది.
  5. మొలక శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల రైతులకు విత్తన ఖర్చు తగ్గుతుంది.
  6. ప్రోటే లలో నారు నిర్వహణ చాలా సులభం, చాలా తేలికగా మొక్కల్ని ట్రేలతో పాటే రైతులకు అందించవచ్చు. దీనివల్ల మొక్కలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు లోనవ్వకుండా ఉంటాయి. దీని వల్ల పొలాల్లో త్వరగా నాటుకొని, తొందరగా ఉత్పత్తి దశకు చేరుకుంటాయి.

ప్రో ట్రే లో నారుమడి పెంచే విధానం :

మొదటగా నారుమడి పెంచే ట్రేలు ఏదైనా శిలీంద్రనాసిని (0.3గ్రా లీటరు నీటికి కలిపి) లో ముంచి పెట్టుకోవాలి. తర్వాత ట్రేలలో కోకోపీట్ లేదా ఏదైనా మట్టి మిశ్రమాన్ని నింపాలి (కోకోపీట్ కు 30-40 శాతం తేమ ఉండడం వల్ల విత్తనం నాటిన వెంటనే నీటిని ఇవ్వాలసిన అవసరం లేదు). విత్తనాలు నాటుకోవడానికి వీలుగా ఒక్కొక్క ప్లగ్ లో చిన్న గుంటగ చేయాలి. ఈ గుంటలో విత్తనాలు నాటిన ట్రేలను ఒకదాని మీదకు ఒకటిగా10 ట్రేలను అమర్చాలి. ఈ ట్రేలను ప్లాస్టిక్ కవర్ తో 3-4 రోజుల వరకు కప్పాలి. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి, తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. షేడ్ నెట్ లో కింద ప్లాస్టిక్ షీట్ వేసి 4 రోజుల తర్వాత కవర్ తీసేసి, ట్రేలను ప్లాస్టిక్ షీట్ మీద రెండు వరుసలలో పక్కపక్కగా అమర్చుకోవాలి.

ఈ విధముగా ప్లాస్టిక్ షీటు మీద పెట్టడం వల్ల మొక్క వేర్లు భూమిలోకి చొచ్చుకు పోకుండా ఉంటాయి. ప్రతిరోజు నీటిని అందించాలి. మొక్క ఎదుగుదల కోసం 3గ్రా ఒక లీటరు నీటిని కలిపి 12-15 రోజులా తర్వాత అందించాలి. చీడ నుండి నారుమడి రక్షించడానికి డైమిథోయేట్ 30 ఈసి ను 0.25 శాతం లేదా మోనోక్రోటోఫాస్ 36 ఎస్ ఎల్-0.03 శాతం నాటిన 7-10 రోజుల తర్వాత అదేవిధంగా పొలంలో నాటడానికి 7 రోజులు ముందు పిచికారి చేయాలి. నారుమడిని వర్షాభావ లేదా మంచు నుండి కాపాడుకోవడానికి వెదురుతో అర్ధ చంద్రాకారంలో టన్నెల్ ఏర్పాటు చేయాలి. కావలసినప్పుడు వీటిమీద పాలిథిన్ కవర్ తో కప్పాలి. ఈ విధంగా నారు 20 నుండి 25 రోజులకు తయారవుతుంది. ఉల్లిపాయ నారు మాత్రం 40 నుండి 45 రోజులకు తయారవుతుంది. షేడ్ నెట్ ఏర్పాటు చేయడం చాలా సులభం మరియు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రో ట్రేలు కూడా రైతులు కొనుగోలు చేయడానికి అనువైన ధరల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అనేక పరిశోధనల ప్రకారం నాణ్యమైన విత్తనం ఎంపిక మరియు శాస్త్రీయ పద్దతిలో నారు పెంచడం వల్ల ఉత్పత్తి 20 నుండి 25 శాతం వరకు పెరుగుతుంది. కాబట్టి రైతులు శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచి అధిక దిగుబడులు పొందగలరు.

డా. జె. హేమంత కుమార్, డా. పి. నీలిమ, శ్రీమతి.డి. స్రవంతి, టి. పావని, డా. కె. నాగాంజలి, డా. ఎం. రాంప్రసాద్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫోన్ :  7036203090.

 

Leave Your Comments

PJTSAU మరియు ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు

Previous article

వానాకాలం కంది పంటలో “నిప్పింగ్” చేసే విధానం –  ప్రయోజనాలు

Next article

You may also like