బెండను ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో వ్యాపార సరళిలో గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు. బెండలో అధిక దిగుబడినిచ్చే సూటి రకాలు, హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఆకుపచ్చ బెండతో పాటు ఎర్రబెండ కూడా పండిస్తున్నారు. ఎర్రబెండ ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఎర్ర బెండకాయలో ఆకుపచ్చ రకం కంటే ఎక్కువ పోషకవిలువలు ఉన్నాయి మరియు ఆరోగ్యనికి మేలు చేస్తుంది. ఇది రైతు ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుతుందని అంచనా. మన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రలో దీనిని సాగు చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎర్రబెండను రైతులు పండిస్తున్నారు.
బెండలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండ చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్ గా, ఎండబెట్టి ఒరుగులను (వడియాలు) తయారు చేయడంలో వాడతారు. వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమలో, నారతీయడానికి ఉపయోగిస్తారు. బెండకాయలను క్యానింగ్ చేసి, ఎండబెట్టిన వాటిని ఎత్తయిన ప్రాంతాలల్లో ఉన్న సైనికులకు అవి దొరకని కాలంలో ఎగుమతి చేస్తారు.
ఉపయోగాలు :-
లేత బెండ కాయలను వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు. వేపుడు గాను, ఉడకబెట్టి సలాడ్ గాను, సూప్ తో కానీ తీసుకుంటారు.
టర్కీలో బాగా ముదిరిన గింజలను వేయించి పొడి చేసి “కాఫీ పొడి” కి ప్రత్యామ్నాయంగా వాడతారు.
ముదిరిన కాండం, కాయల నుండి తీసిన నారను కాగితం పరిశ్రమలో వాడతారు.
అంతేకాక ఈ బెండకు కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్ర సంబంధిత, జీర్ణ సంబంధిత వ్యాధుల నివారణకు వాడతారు. టర్కీలో బెండ ఆకుల నుండి తయారు చేసిన మందును కాలిన గాయాల ఉపశమనానికి వాడతారు. దీని జిగురును విరోచనాలు అరికట్టేందుకు వాడతారు.
అలాగే ఎర్ర బెండలో 21% ఇనుము ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి సహాయం చేస్తుంది. కేవలం 5% ప్రోటీన్ శరీర జీవక్రియ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది.
ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ “ఎ” చర్మాన్ని మరియు కళ్ళను సంరక్షిస్తుంది.
ఎర్రబెండ యాంటీఆక్సిడెంట్ రిచ్ లక్షణాలు మరియు దీర్ఘకాలిక డైటరీ ఫైబర్ మూలం.
ఎర్రబెండ గర్భిణీ స్త్రీల ఆహారంలో కీలకమైన ఆహారంగా మారుతుంది. అలాగే న్యూరల్ ట్యూబ్ అసాధారణతల అవకాశాలను తగ్గిస్తుంది.
పచ్చి బెండకాయను ముక్కలుగా కోసి ఒక గ్లాసు నీటిలో రాత్రి మొత్తం నానబెట్టిన బెండకాయ నీటిని ఉదయాన్నే పరిగడుపున త్రాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, బరువు తగ్గడంలో తోడ్పడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎముకలను బలంగా చేస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వాతావరణం :-వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. పగటి ఉష్ణోగ్రత 25 – 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి 22 డిగ్రీల సెల్సియస్ ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెలియాస్ కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి, పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవికాలం అనుకూలం.
నేలలు :- సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి.
రకాలు :
పూస సవాని : పంట కాలం 85 – 90 రోజులు, కొమ్మలు లేకుండా నిటారుగా 120 – 180 సెం. మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఒకప్పుడు శంకు రోగం / పల్లాకు తెగులును బాగా తట్టుకునేది. కానీ ప్రస్తుతం ఈ రకంలో ఈ రోగాన్ని తట్టుకునే గుణం పోయింది. కాయ పొడవు 18-20 సెం. మీ. దిగుబడి 5 – 6 ట/ఎ.
పంజాబ్ పద్మిని : మొక్కలు 180 – 200 సెం. మీ. పొడవు పెరుగుతాయి. 4 – 5 కొమ్మలు వస్తాయి. కాండం, కొమ్మలు, ఆకు తొడిమ ఎరుపు రంగులో ఉండి, కాండం, ఆకుల తొడిమల మీద సన్నని నూగు ఉంటుంది. కాయలు 15 – 20 సెం. మీ. పొడవు ఉండి. ఒక్కో కాయ 20 – 21 గ్రా. తూగుతుంది. కాయలు 3 – 4 రోజుల వరకు లేతగా ఉంటాయి. ఈ రకం పల్లాలు తెగులు రాకుండా నిరోధించగలుగుతుంది. కొంత వరకు రసం పిల్చే పురుగు, ప్రత్తికాయ తొలుచు పురుగు నుండి తట్టుకొని నిలబడుతుంది. దిగుబడి 4 – 5 ట/ఎ.
పర్భని క్రాంతి :- మరట్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పర్భని నుండి విడుదలైన రకం, ఇది పల్లాకు తెగులును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం. మొక్క కొమ్మలు లేకుండా నిటారుగా పెరుగుతుంది. 55 రోజులలో మొదటి కోతకు వస్తుంది. కాయ తొడిమ భాగం గరాటు ఆకారంలో ఉంటుంది. కాయలు 8 – 9 సెం. మీ. పొడవుతో ముదురాకుపచ్చ రంగంలో 5 కణుపులతో ఉంటుంది. కాయలు కోసిన 2 – 3 రోజుల తర్వాత కూడా లేతగానే ఉంటాయి.
దిగుబడి : వేసవికాలం పంట దిగుబడి: 3.5 – 4.0 ట/ఎ. వర్షాకాలం పంట 4.0 – 4.5 ట/ఎ. దిగుబడిని ఇస్తుంది.
అర్క అనామిక :- ఇది భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగుళూరు నుండి విడుదలైన రకం, మొక్క 100 సెం. మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. తక్కువ కొమ్మలు ఉంటాయి. కాండం మీద కణుపులు దగ్గరగా ఉంటాయి. లేత ఎరుపు రంగు మచ్చలు కాండం మీద, ఆకు తొడిమ భాగంలో ఉంటాయి. కొద్దిగా నూగు ఉంటుంది. 55 రోజులలో మొదటి కోతకు వస్తుంది. దిగుబడి 4.5 – 4.6 ట/ఎ. పల్లాకు తెగులును బాగా తట్టుకొని అధిక దిగుబడినీస్తుంది. వేసవి పంటకు అనువైనది.
అర్క అభయ్: ఇది కూడా బెంగుళూరు నుండి విడుదలైన రకం. ఇది కాయతొలిచే పురుగును, శంఖురోగాన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. వేసవి పంటకు అనువైనది.
కాశీ లలిమ: భారతదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (IIVR) శాస్రవేత్తలు ‘రెడ్ ఓక్రా’ అనే కొత్త రకం బెండకాయను అభివృద్ధి చేశారు. ఈ ఎర్రటి బెండకాయ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది ఆకుపచ్చగా కాకుండా ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే దీనికి కాశీ లలిమ అని పేరు పెట్టారు. ఈ ఎర్ర బెండకాయలలో ఆంథోసైనిన్లు మరియు ఫినాలిక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది రెండు నుండి ఐదు అంగుళాల పొడవు మరియు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మొక్క ఎత్తు 1.2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ ఎర్ర బెండి రకం ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ మరియు ఆకుముడత వంటి వైరస్ లకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఎర్ర బెండకాయలలో తెగుళ్ళు మరియు వ్యాధులు తక్కువగా ఉంటాయి.
విత్తే సమయం :- వాతావరణంలో 17 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే విత్తనం మొలకెత్తదు. కనీస ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ ఉంటే విత్తనం మొలకెతూతుంది. కావున వర్షకాలంలో జూన్ నెల రెండో వారంలో, వేసవి పంటగా ఫిబ్రవరి రెండో వారంలో వేసుకోవాలి. వర్షాకాలం పంటను జూన్ నుండి జూలై, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షకాలంలో ఆలస్యంగా విత్తుకుంటే మొక్కలు సరిగ్గా పెరగవు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవిలో ఆలస్యంగా పంట విత్తితే మొక్క పెరుగుదల తగ్గి, పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
విత్తన మోతాదు :- ఎకరాకు వర్షాకాలం పంటకు 8 – 10 కి./హె. వేసవి పంటకు 18 – 20 కి./హె. సంకర జాతి రకాలకు 5- 6 కి. /హె. విత్తనం కావాలి. ఎర్ర బెండ విత్తన మోతాదు 8 – 10 కి./హె.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ తో తరువాత 4 గ్రా. ట్రైకోడెర్మ విరిడి తో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తనం – వితేపద్దతి :- నేలను 4 – 5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం. మీ. ఎడంలో బోదెల మీద 30 సెం. మీ. దూరంలో విత్తుకోవాలి. వేసవి కాలపు పంటను, నేలను మళ్ళుగా చేసి వరుసల మధ్య 45 సెం. మీ., మొక్కల మధ్య 15 – 20 సెం. మీ. దూరం ఉండేటట్లు, విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టీ తర్వాత 4 – 5 రోజులకు రెండవ తడి ఇవ్వాలి. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి.
ఎరువులు :- చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నిచ్చే నత్తజని ఎరువులను సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3 వ వంతు 2 భాగాలుగా విత్తిన 30 వ మరియు 45 వ రోజున వెయ్యాలి. సంకరజాతి రకాలలో ఎరువుల మోతాదు సుమారు 50 శాతం పెంచి వేయాలి.
జీవన ఎరువులు : వాతావరణంలో 78% నత్రజని ఉన్నప్పటికీ మొక్కలు నేరుగా ఉపయోగించుకోలేవు. కొన్ని రకాల సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి, మొక్కలకు అందించి, భూసారాన్ని పెంపొందిస్తాయి. ఈ జీవన ఎరువుల వాడకం వలన ఉత్పత్తి ఖర్చులు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం సైతం తగ్గించవచ్చు.
అజటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి సూక్ష్మజీవులు యొక్క వేళ్ళ ద్వారా విసర్జించే కొన్ని పదార్థాలను, గాలిలోని నత్రజనిని ఉపయోగించుకొని పెరుగుతూ, మొక్కకు ఉపయోగపడే హార్మోన్ల తదితర నత్రజని పదార్థాలను విసర్జిస్తాయి. పంటలు ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ జీవన ఎరువులను విత్తనములకు పట్టించి వాడుకోవాలి. జీవన ఎరువులు ఉపయోగపడాలంటే సేంద్రియ ఎరువులు బాగా వేయాలి.
ఎకరాకు 2 కిలోల అజేటోబాక్టర్ ను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి, నీళ్లు చల్లుతూ 7 – 10 రోజులు మాగనిచ్చి, తరువాత ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. దీనితో పాటుగా ఎకరాకు 2 కిలోల ఫాస్పో బ్యాక్టీరియాను కూడా పొలం అంతా సమంగా చల్లుకోవాలి. ఈ జీవన ఎరువులు వేసుకున్నప్పుడు సిఫార్సు చేసిన దానిలో 75% నత్రజని, భాస్వరం పూర్తి పొటాష్ వేసుకుంటే సరిపోతుంది.
కలుపు నివారణ, అంతరకృషి: పెండిమిథలిన్ 30% ఎకరాకు 1.2 లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మలసటి రోజున గాని పిచికారీ చెయాలి. విత్తిన 25, 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదేలు సరిచెయ్యాలి.
నీటి యాజమాన్యం: వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 – 8 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4 – 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి.
పంటల వరస క్రమం: బెండ – ఆలుగడ్డ – టమాట; బెండ – పాలకూర – పుచ్చకాయ; బెండ – ముల్లంగి – కాలీఫ్లవర్ – కీరదోస; బెండ – టమాటా – తోటకూర క్రమంలో పంట మార్పిడి పాటించాలి.
కోత కోయడం : విత్తిన 45 – 50 రోజులకు మొదటి కోత వస్తుంది. కోత మొదలైన తర్వాత 2 రోజులకు ఒకసారి కొయ్యాలి. కాయలు ఆకుపచ్చగా, లేతగా, పీచు పట్టకుండా ఉన్నప్పుడు కోసినట్లయితే మంచి ధర పలుకుతాయి. పిందె పట్టిన 6 – 7 రోజుల్లో కోసిన కాయలు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. వీలైనంత వరకు కాయలను వెదురు బుట్టలో వదులుగా నింపి నీరు చిలకరించి నట్లయితే కాయలు గాలి భారీ 2 – 3 రోజుల వరకు తాజాగా ఉంటాయి. స్థానిక మార్కెట్ కైతే కాస్త ముదురు, పొడవు ఉన్న కాయలు కొయ్యాలి. ప్రాసెసింగ్ లేదా విదేశీ ఎగుమతులకైతే బాగా లేతగా ఉన్న ఆకుపచ్చని చిన్న కాయలు (6 – 8 సెం.మీ. పొడవు) కొయ్యాలి.
కోత అనంతరం జాగ్రత్తలు : సాధారణంగా రైతులు రెండు రోజులకు ఒకసారి కోత కోసి బస్తాలలో నింపి మార్కెట్ కి పంపిస్తారు. జనుము బస్తాలలో బాగా నింపి, కుదించి, బిగ్గరగా కుట్టడం వలన, కాయలు ఒత్తిడికి గురై విరగటం, కాయ రంగు మారుతుంది. దీని వలన కాయ నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాక లేత కాయల నుండి తేమ కోల్పోవడం వలన కాయ వడలి ధర తక్కువ పలుకుతుంది. దీనికి బదులుగా బెండకాయలను వెదురు గంపలలో వదులుగా నింపడం వలన 2 – 3 రోజులు కాయ దెబ్బ తినకుండా నిల్వ ఉంటుంది.
దిగుబడి : ఎకరాకు వర్షాకాలపు పంటకు 6-8 టన్నులు, వేసవి పంటకు 4-5 టన్నుల దిగుబడి వస్తుంది.
బెండకాయలను నిల్వ ఉంచు పద్ధతులు :
బెండ ఒరుగులు తయారీ : ఒరుగులు తయారీకి పూసా సవాని అనువైన రకం బెండకాయ మొత్తంగా లేదా ముక్కలు చేసి లేదా నిలువుగా చీల్చి వరుగులు తయారు చేస్తారు. ముక్కలుగా చేసినట్లయితే పావు అంగుళం మందం గల ముక్కలు చేయాలి. బెండకాయలు నిలువుగా చేసిన ముక్కలు లేదా అడ్డంగా చేసిన ముక్కలను మరిగే నీళ్లలో 4 – 8 నిమిషాలు ఉంచాలి లేదా 2 – 5 నిమిషాలు నీటి ఆవిరి మీద ఉంచాలి. ఆ తర్వాత తీసి జిగురంతా పోయేటట్లు చల్లని నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఈ ముక్కలను 145 – 155 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 6 – 8 గంటలు ఎండనివ్వాలి 12 కిలోల బెండ ముక్కలను ఈ విధంగా చేసి ఎండబెడితే 1 కిలో వరుగులు తయారవుతాయి.
ఒరుగులు నిల్వ చేయు విధానం : నిలువలో కీటకాల బారి నుండి కాపాడడానికి తయారైన వరులను మరల 130 – 150 ఉష్ణోగ్రత వద్ద ఎండబెట్టాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన గాలి చొరబడని డబ్బాలలో నిలువ చేయాలి. ఈ డబ్బాలలో తేమ, సన్నని కీటకాలు లోనికి చేరకుండా డబ్బా లోపల భాగం మైసం పేపర్ తో లైనింగ్ ఉండేటట్టు చూడాలి. ఈ డబ్బాలలో ఎండిన వరుగులు వేసాక గట్టిగా ప్యాక్ చేసే ముందు నైట్రోజన్ గ్యాస్ తో నింపితే నాణ్యత బాగుంటుంది.
క్యానింగ్ : పూసా సవాని లేదా పొట్టిగా ఆకుపచ్చగా ఉన్న రకాలు క్యానింగ్ కి అనుకూలం.
తయారు చేయు విధానం: లేత ఆకుపచ్చ బెండకాయలను అలాగే కానీ లేదా ముక్కలుగా చేసి మరిగే వేడి నీళ్లలో 1- 2 నిమిషాల నుంచి తీసి వెంటనే 1.5% ఉప్పు ద్రావణంలో వేసి 10 నిమిషాలు వుంచి చల్లబరచాలి. ఈ విధంగా చేసిన ముక్కలను 2% ఉప్పు ద్రావణంలో ఉంచి డబ్బాలలో నింపి ప్యాక్ చేయాలి.
సస్యరక్షణ
పురుగులు :- మొవ్వ మరియు కాయ తోలుచుపురుగు: ఈ పురుగు విత్తిన 30 రోజుల నుండి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వను, పూత, కాతా దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం క్రిందకి తుంచి నాశనం చేయాలి.
నివారణ :- ఈ పురుగు ఆశించిన కాయలను తుంచి భూమిలో లోతుగా పూడ్చిపెట్టాలి. లేదా తగలబెట్టాలి. ట్రైకో గ్రామ ఖిలోనిస్ యొక్క గుడ్లను వదిలినట్లయితే ఈ పురుగు నివారించవచ్చు. క్రైసోపేర్ల కార్నియని మొదటి లార్వాదశలో హెక్టార్ కి సుమారుగా ఒక లక్ష వరకు వదిలి ఉధృతిని తగ్గించవచ్చు. దీపపు ఎర్రలను హెక్టార్ కి 12 చొప్పున పెట్టుకుని తల్లి పురుగుల ఉధృతిని గమనించుకోవాలి. లింగాకర్షణ బుట్టలను హెక్టార్ కి 5 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. బి. టి. ఫార్ములా కలిగిన డైపెల్ ను 2 గ్రా./లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 మి. గ్రా. లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
దీపపు పురుగులు :- ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న, పెద్ద పురుగులు ఆకుల బాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆకులు పైకి ధోనె మాదిరిగా ముడుచుకొని పోయి పండుభారీ రాలిపోతాయి. వీటి నివారణకు డైమీథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎర్ర నల్లి: పంట చివరి, దశలో చిన్న సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు బాగాన చేరి ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వెయ్యడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుభారీ పోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.ల్లీ. లీటర్ నేటికీ కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ: పంటలో పూతకు ముందు చిన్న, పెద్ద పురుగులు ఆకు అడుగు బాగానే చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంఖు రోగాన్ని వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు లీటర్ నీటికి డైమిధోయేట్ 2 మి.లీ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. తీవ్ర దశలో ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాను గ్రీజు గాని, ఆముదం గాని పూసి తెల్ల దోమను ఆకర్షింప చేసి నాశనం చేయాలి.
తెగుళ్లు :-
బూడిద తెగులు : ఆకుల పైన మరియు అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువ ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1మి. లీ. డైనోకాఫ్ లేదా రెండు మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
శంఖు/పల్లాకు తెగులు (వై. వి. యం. వి) : తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసవబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులును తట్టుకునే ఆర్క అనామిక, ఆర్క అభయ్ రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి. లీ. డైమిథోయెట్ లేదా 1.5 గ్రామ్స్ ఎసిఫేట్ కలిపి పిచికారి చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే దోమను అరికట్టవచ్చు. వర్షాకాల పంటను జూలై 15 కు ముందుగా విత్తటం ద్వారా ఈ తెగులును కొంతవరకు నివారించవచ్చు.
ఎండు తెగులు : గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజుల సమయంలోనే ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తన శుద్ధిలో చెప్పబడిన విధంగా చేయాలి. మొక్కల వద్ద కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరాకు 100 కిలోల చొప్పున దుక్కిలో వెయ్యాలి. పంట మార్పిడి పాటించాలి. వేసవి ప్రారంభంలో లోతు దుక్కులు చేయాలి. పచ్చి రొట్టె పైరును పెంచి భూమిలో కలియదున్నాలి.
సమగ్ర సస్యరక్షణ : కిలో విత్తనానికి 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఒక ఎకరాకు 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయ తొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం/ గ్రీసు పూసి పెట్టి తెల్లదోమను ఆకర్షింప చేయాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామను బదలికలను పూత దశలో వారానికి ఒకసారి చొప్పున నాలుగు సార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందును వాడకూడదు హెచ్. ఎస్. పి. వి., ఎస్. ఎస్. పి. వి. ని ఎకరాకు సమానమైన ద్రావణం పిచికారి చెయ్యాలి.
రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, పిప్రోనిల్, డైమిథో యెట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి. లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ 1లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయతోలుచు పురుగుల నివారణకు థయోడికార్బ్ 1 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
ఎస్. నీరజ, డా.జె. శ్రీనివాస్, డా.షహనాజ్ మరియు డా.జె.శంకరా స్వామి, వెజిటేబుల్ సైన్స్, ఉద్యాన కళాశాల, మోజర్ల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం -509 382
Leave Your Comments


























