ఉద్యానశోభ

కొమ్మ కత్తిరిస్తే గుత్తులు గుత్తులుగా కాయలు..

0

పాత మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ బాగా పాత చెట్ల కొమ్మల బెరడును కొద్ది మేరకు కత్తిరించి వలిచేయటం ద్వారా ఆ పాత చెట్ల ద్వారా కూడా అధిక మొత్తంలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. అదే విధంగా పాత చెట్టు కొమ్మను కత్తిరిస్తే ఆ ప్రయోగాలు రైతులు, శాస్రవేత్తలకు తెలియనివి కాకపోయినప్పటికీ .. గుజరాత్ కు చెందిన రాజేష్ షా, ఈడ్పుగల్లుకు చెందిన శ్రీనివాస్ ల అనుభవాలు ఆసక్తి గొలుపుతున్నాయి.
35 – 40 ఏళ్ల క్రితం నాటిన పాత మామిడి చెట్ల కాపు తగ్గిపోవటం సహజమే. ఇటువంటి చెట్ల కాండానికి బెజ్జం వెయ్యటం వంటి చిట్కాల ద్వారా పండ్ల దిగుబడిని పెంపొందించుకోవడం చిరపరిచితమైనదే. గుజరాత్ కు చెందిన రాజేష్ షా తోటలో 65 ఎకరాల్లో అల్ఫాన్సో, కేసర్ వంటి రకాల మామిడి చెట్లు వందల కొద్దీ ఉన్నాయి. వాళ్ళ తాత కాలం నుంచీ ఆ తోట ఉంది. పాత చెట్లకు కాపు ఏటేటా తగ్గిపోతుండటంతో షా గిర్ డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్ చిట్కాను ప్రయోగించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభించారు. పాత పండ్ల చెట్టు కాండం లేదా కొమ్మ లేదా రెమ్మలకు చుట్టూ బెరడును కత్తిరించి తీసెయ్యటమే హార్టికల్చర్ పరిభాష లో గిర్ డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్ అంటే. 15 ఏళ్ల తర్వాత గానీ ఈ పనిలో తనకు పూర్తిస్థాయి నైపుణ్యం చేకూరడంటారాయన. ఈ సంవత్సరం 75 కొమ్మలకు గిర్ డ్లింగ్ చేశారాయన.
శుభ్రమైన, పదునైన చాకుతో అంగుళం వెడల్పున చెట్టు కాండం చుట్టూతా కత్తిరించి బెరడును తొలగించాలి. ఆ గాయంతో నుంచి చెట్టుకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి క్రిమిసంహారక మందు లేదా స్థానికంగా రైతులు తయారు చేసుకునే పేస్ట్ ను పూయాలి. అంతే చెట్టు ఆ ప్రాంతానికి ముఖ్యమైన పోషకాలను అందించడానికి కత్తిరించిన ప్రాంతంలో కొత్త పొరలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా పోషకాలు పుష్కలంగా అంది చెట్టు కాపు పెరుగుతుంది. గాలిలో తేమ 70% మేరకు ఉండే దీపావళి కాలంలో రింగ్ బార్కింగ్ చేయటం వల్ల తమ తోటలో చెట్లకు ఉపయోగపడిందని షా తెలిపారు. 35 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసున్న చెట్లకు నేలపై నుంచి 15 – 20 అడుగుల కన్నా ఎత్తున్న కొమ్మలకే రింగ్ బార్కింగ్ టెక్నీక్ సంస్థవంతంగా పని చేస్తోందని షా వివరించారు.
అంతేకాదు కాండం లేదా కొమ్మల చుట్టుకొలత కనీసం 12(30 సెం .మీ ) అంగుళాల మేరకు ఉంటేనే ఈ చిట్కా బాగా పనిచేస్తున్నదని షా వివరించారు . గాటు పెట్టి బెరడు తీసేసిన పై ప్రాంతంలో కొమ్మల్లో కాపు చాల ఎక్కువగా వస్తుందని పండ్లు పెద్దగా తియ్యగా వుంటాయని ఆయన చెబుతున్నారు . 125,100,80 ఏళ్ల క్రితం నాటిన చెట్లకు కూడా ఈ టెక్నిక్కే ద్వారా మంచి పండ్ల దిగుబడిని పొందానని సంబరపడుతున్నారాయన.
45 ఏళ్ల నాటి మామిడి చెట్టు కొమ్మను కత్తిరిస్తే ఆ మోడు కు ఆశ్చ్యర్యకరంగా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో దేశవాళీ రకం మామిడి చెట్టుకు వింతగా ఎక్కువ మొత్తంలో కాసిన కాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస్ వృత్తి ఉపాధ్యాయుడైనా వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయన తండ్రి కోటేశ్వరరావు 45 ఏళ్ల క్రితం దేశవాళీ మామిడి విత్తనాన్ని నాటారు. ప్రస్తుతం అది మహా వృక్షం గా మారింది. పీచు లేకుండా ముదురు పసుపు రంగులో తియ్యని గుజ్జుతో కూడిన ఈ చెట్టు పండ్లు రుచికరంగా ఉన్నాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ చెట్టు కాస్తుందని శ్రీనివాస్ తెలిపారు.
కొమ్మలు బాగా విస్తరించటంతో అడ్డుగా ఉన్న కొమ్మలను రంపంతో రెండేళ్ల క్రితం కత్తిరించారు. అలా కత్తిరించిన ప్రదేశంలో గుత్తులుగా కాయలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని కొమ్మలను కత్తిరించారు. కత్తిరించిన ప్రతి చోటా గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉన్న రకం సేంద్రియ/ రసాయనిక ఎరువులు ఏవీ వెయ్యటం లేదు. నీరు పెడుతున్నాం అంతే అన్నారాయన. విషయం తెలుసుకున్న డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. టి. జానకిరామ్ తదితర ఉద్యాన శాస్త్రవేత్తలు ఇటీవల ఈ దేశవాళీ మామిడి చెట్టు వైభవాన్ని సందర్శించి రైతును ప్రశంసించారు. 45 ఏళ్ల నాటి దేశవాళీ మామిడి చెట్టు జన్యు వనరుల పరంగా ఎంతో విలువైనదని అంటూ మెరుగైన వంగడాల అభివృద్ధి కోసం జరిపే పరిశోధనల్లో ఈ జన్యు వనరును ఉపయోస్తామని తెలిపారు. వాణిజ్య దృష్టితో కాకుండా దేశవాళీ రకం పండ్ల రకాలను మక్కువతో పెంచడమే తనకు ఇష్టమని శ్రీనివాస్ సంతోషంగా చెప్పారు. జామలో కూడా ఈ టెక్నీక్ ప్రయోగిస్తున్నానన్నారు.

Leave Your Comments

మన్యంలో అల్లం సాగు..

Previous article

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

Next article

You may also like