తెలంగాణ రాష్ట్రంలో యంసంగిలో అధిక విస్తీర్ణంలో పండించే పంటల్లో శనగ పంట ఒకటి. తెలంగాణలో శనగ పంట సాధారణ విస్తీర్ణం 3.04 లక్షల ఎకరాలల్లో ఉండగా, ఈ సంవత్సరం 16 లక్షల ఎకరాలల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. కావున రైతులు పంట పక్వదశను గుర్తించి సకాలంలో పంట కోత కోసి కోతానంతరం మరియు తదుపరి నిల్వ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక నాణ్యమైన పంట దిగుబడి తద్వారా అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.
పంట కోత సమయం:-
పంటను సరైన సమయంలో కోయడం ముఖ్యం. సాధారణంగా శనగ పంట పూత దశ 50 నుండి 55 రోజుల్లో పరిపక్వతకు చేరుతుంది. పంట కోత లక్షణాలైన
కాయలు ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగుకు మారినప్పుడు.
ఆకులు పసుపు బారినపడి పూర్తిగా ఆకులు రాలిపోయి మొక్కంతా ఎండినప్పుడు పంట కోత చేపట్టవచ్చును.
ఈ సమయంలో సకాలంలో కోతకోస్తే గింజ అధిక నాణ్యతను కల్గి మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది.
పంటను కూలీలు లేదా కంబైన్ హార్వెస్టర్ తో కూడా కోయించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సామర్ధ్యం కొరకు యంత్రాల్ని వాడాలి. వాడే ముందు యంత్రాన్ని శుభ్రపరచుకుంటే కల్తీల్ని నిరోధించవచ్చు.
కోత సమయంలో అధిక వర్షపాతం తేమ ఉన్నట్లయితే కీటకాలు మరియు శీలీంధ్రాలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కోతానంతరం విత్తనాలను నిల్వ చేయు సమయంలో చేడిపోవడానికి గల ముఖ్య కారణాలు
విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం. సాధారణంగా కోత సమయంలో గింజల్లో 15 – 22% వరకు తేమ ఉంటుంది. అయితే నిల్వ చేసేటప్పుడు తేమను 10 – 12%కు తగ్గించి నిల్వ ఉంచాలి.
నిల్వ చేసిన గదిలో తేమ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం.
పూర్తిగా శుభ్రం చేయకుండా విత్తనాలను నిల్వ చేయడం.
నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు మరియు శీలీంధ్రాలు ఆశించడం వలన విత్తన నాణ్మత మరియు మొలక శాతం తగ్గడం జరుగుతుంది.
పాత సంచులను సరిగ్గా శుభ్రం చేయకుండా వాడడం.
విత్తనం నిల్వ సమయంలో ఆశించు చిడ పీడలు – యాజమాన్య పద్దతులు :-
కీటకాలు:- నిల్వ సమయంలో వివిధ రకాల కీటకాలు ఆశించి నాణ్యతను తగ్గిస్తాయి.
శనగ విత్తనాలను నిల్వలో పెంకు పురుగు (బూచిడ్స్) అత్మధి కంగా నష్టపరుస్తుంది. సాంధారణంగా కాయ పరిపక్వత దశలోనే పెంకు పురుగు ఆశిస్తుంది. గింజల దార్వరా నిల్వ చేసే గోదాముల్లోకి ప్రవేశించి నష్టం కలుగజేస్తుంది. కాబట్టి కోతానంతరం గింజల్ని బాగా ఎండ బెట్టాలి మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పురుగు గింజలపై గుండ్రని, తెల్లని గ్రుడ్లను పెడుతుంది. ఈ గ్రుడ్లు నుండి వచ్చిన పిల్ల పురుగులు గింజ లోపలి భాగాన్ని తినేసి రంధ్రాలను చేస్తాయి. మరియు గింజిలోనే కోశస్థ దశలో మారి, అందులో నుండి తల్లి పురుగులు బయటకు వస్తాయి.
నివారణ చర్యలు :-
అనాది కాలంగా విత్తనాలను నింపే సంచులలో వేప ఆకులు వేసేవారు. దానితో కీటకాలు ఆశించకుండా గింజిల్ని చాలా వరకు భద్రపరచవచ్చు.
వేప గింజల పొడి 5గ్రా లేదా వేప నూనె 5 మి.లీ కిలో విత్తనానికి కలిపి నిల్వ చేస్తే పరుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
విత్తనం నిల్వ ఉంచే గదుల్లో పగుళ్ళు, రంధ్రాల్ని పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు చనిపోతాయి..
పాత సంచులు వాడే ముందు లీటరు నీటికి 10 మి.లీ. వేప ద్రావణం కలిపి పిచికారి చేసి వాడు కోవాలి. లేదా 5% వేప కాషాయంలో ముంచి ఆరబెట్టిన తరువాత విత్తనాన్ని నింపుకోవాలి.
శీలీంధ్రాలు :- శనగ నిల్వ సమయంలో వివిధ శీలీంధ్రాలు ఆశించి గింజలపై తెల్లటి, పచ్చని లేదు నల్లటి బూజుగా ఏర్పడతాయి. దీని వలన గింజల నాణ్యత, రంగు, రుచిని కోల్పోతాయి. ఈ బూజు తెగులు మైకో టాక్సిన్ అనే విషపూరిత రసాయనాలను గింజల్లో విడుదల చేస్తాయి. ఈ గింజలు మనుషులు, పశువులకు హానికరం. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తాయి.
నివారణ చర్యలు:-
గింజిల్లో అధిక తేమ ఉన్నట్లయితే ఈ శీలీంధ్రాలు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి గింజల్లో తేమ 9% శాతం కన్నా ఎక్కువ ఉండకుండా ఆరబెట్టాలి.
కీటకాలు, ఎలుకలు ఆశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి తిన్న గింజల్లో శీలీంధ్రాలు ఎక్కువగా ఆశిస్తాయి.
విత్తనం కొరకు భద్రపరచే గింజల్ని ధైరమ్ / కాప్టాన్ 2.5 గ్రా, కిలో విత్తనానికి చొప్పున కలిపి ఆరబెట్టుకుని నిల్వ చేసుకోవాలి.
ఎలుకలు:- ఎలుకలు నిల్వ చేసిన గింజల్ని తినడంతో పాటు వాటి విసర్జనలు మూత్రంతో గింజల్ని మలినం చేస్తాయి. తద్వారా గింజల నాణ్యత తగ్గిపోయి తినడానికి పనికిరావు. నిల్వ ఉంచిన గోనె సంచులను, గాదెలను కొరికి కూడా నష్టం చేస్తాయి.
నివారణ చర్యలు:-
గోదామును శుభ్రంగా ఉంచాలి.
గోదాముల్లో రంధ్రాలు / పగుళ్ళు లేకుండా మూసేయాలి.
ఎరలు /బోన్లు, సహాయంతో వాటిని పట్టి నాశనం చేయాలి.
నింపిన బస్తాలను నేలపైనే కాకుండా కొంచెం ఎత్తైన చెక్క బిల్లలపై ఏర్పాటు చేయాలి. త్వరగా విష ప్రభావం చూపించే జింక్ ఫాస్ఫైడ్ నిధానంగా పనిచేసే బ్రోమో డయోలో న్ ఉపయోగించి 40 – 60% ఎలుకలను 3 – 4 రోజుల్లో చంపవచ్చు.
రైతులు శనగ ఉత్పత్తిని నిల్వ చేసేటప్పుడు తేమ శాతం ఎప్పటికప్పుడుగమనించి మధ్యలో ఆరబెట్టుకుంటూ జాగ్రత్త పడాలి తద్వారా మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
డా.ఎం.మధు, డా.ఎ. వెంకట్ రెడ్డి, డా. జి. పద్మజ, డా.జి .శేషు, డా. కె. రుక్మిణి దేవి, మరియు డా. ఆర్. ఉమారెడ్డి.ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్.
























