మామిడి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఫల పంటల్లో ఒకటి, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయబడుతుంది. పూత దశ నుండి పండు కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పండ్ల ఉత్పత్తి మరియు నాణ్యతను మెరుగుపరచవచ్చు. మామిడి సాగులో పూత అనంతరం జరిగే దశలు తోట దిగుబడిని, పండ్ల నాణ్యతను మరియు రైతు ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. కాయ అభివృద్ధి దశలో పోషక లోపాలు, పండ్లపై మచ్చలు, కోత సమయంలో సరైన పద్ధతులను పాటించకపోవడం మరియు కోతానంతర నిర్వహణ లోపాలు పండ్ల మార్కెట్ విలువను తీవ్రంగా తగ్గిస్తాయి. అందువల్ల పూత పూర్తైన తరువాత నుంచి పండ్లు వినియోగదారుడి చేతికి చేరే వరకు ప్రతి దశను శాస్త్రీయంగా నిర్వహించడం అత్యంత అవసరం.
కాయ అభివృద్ధి దశ :-
ఈ దశ ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఉంటుంది, ఇక్కడ కాయ బఠాణి నుండి గోలి కాయ పరిమాణం వరకు అభివృద్ధి చెందుతాయి. కాయ రాలడం, తేనెమంచు పురుగులు, తామర పురుగులు, టెంక పురుగులు మరియు బూడిద తెగులు ప్రధాన సవాళ్లు. ఈ దశలో పోషకాలు మరియు నీటి సమతుల్యం కీలకం.

- ఎరువుల యాజమాన్యం :- 10 సంవత్సరాల వయసు చెట్టుకు సిఫారసు మోతాదులో 1/3 వంతు ఎరువులు వేయాలి (550 గ్రా. యూరియా + 1500 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ + 400 గ్రా. మ్యూరియేట్ ఆఫ్ పొటాష్). జింక్ సల్ఫేట్ (ZnSO4) 2-3 గ్రా/లీటరు పిచికారి చేయాలి. పిందె కట్టడాన్ని మెరుగుపరచడానికి పొటాషియం నైట్రేట్ (13-0-45) 10 గ్రా/లీటరు లేదా మోనో పోటాషియం ఫాస్ఫేట్ (0-52-34) 10 గ్రా/లీటరు + బోరాన్ 1.25 గ్రా/ లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. పూత మరియు పిందె రాలడాన్ని నియంత్రించడానికి ప్లానోఫిక్స్ 4.5 మి.లీ/25 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

- నీటి యాజమాన్యం :- రోజుకు 3 గంటలు 4-6 డ్రిప్పర్లు ఉపయోగించి నీరు అందించాలి. 10 సంవత్సరాల చెట్లకు 120 లీటర్లు, 5-10 సంవత్సరాల చెట్లకు 90 లీటర్లు సరిపోతాయి. డ్రిప్ లేనివారు నేల తేమను బట్టి 15-20 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి.
- చీడపీడల యాజమాన్యం :- తేనెమంచు పురుగులు మరియు తామర పురుగులకు థియామెథాక్సామ్ 0.5 గ్రా/లీటరు లేదా లాంబ్డా సైహాలోత్రిన్ 0.5 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టెంక పురుగుల నియంత్రణకు ప్రొఫెనోఫాస్ 1 మి.లీ/లీటరు రెండుసార్లు (పిందె కట్టిన తర్వాత ఒకసారి, నెల తర్వాత మరోసారి) చేయాలి. మాల్ఫార్మేషన్ నియంత్రణకు కార్బెండజిమ్ 1 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

- కాయ కోడిగుడ్డు పరిమాణంలో ఉన్నప్పుడు ఫ్రూట్ బ్యాగ్స్ (రెండు పొరల కాగితపు పండ్ల రక్షణ సంచులు) ఉపయోగించడం ద్వారా మచ్చలు మరియు పండు ఈగ దాడిని నివారించవచ్చు.
పండ్ల సంచుల వినియోగం మరియు పండ్ల సంచుల ప్రాముఖ్యత :-
కాయలు కోడిగుడ్డు పరిమాణానికి చేరుకున్న దశలో పండు సంచులు తొడగడం వల్ల కాయలు బయటి వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ పొందుతాయి. సంచులు తొడగడం వల్ల పండు ఈగ గుడ్లు పెట్టే అవకాశం లేకుండా పోతుంది. అలాగే కాయలపై శిలీంద్ర వ్యాధుల మచ్చలు, రసాయన పిచికారీల అవశేషాలు మరియు సూర్యకాంతి వల్ల కలిగే కాలిన మచ్చలు తగ్గుతాయి. పండ్ల సంచుల వల్ల కాయలు సమానంగా అభివృద్ధి చెంది, ఆకర్షణీయమైన రంగు పొందుతాయి.

పండ్ల సంచుల వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, పండ్లపై రసాయనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. దీనివల్ల వినియోగదారులకు సురక్షితమైన పండ్లు లభించడంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి సాధ్యమవుతుంది. మార్కెట్లో పండ్ల సంచులు తొడిగిన పండ్లకు అధిక ధర లభించడం రైతులకు అదనపు లాభాన్ని అందిస్తుంది.
కోత దశ మరియు కోత పద్ధతులు :-
కోత దశ ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు ఉంటుంది. ముందుగా వచ్చే రకాల్లో ఏప్రిల్లో మరియు ఆలస్య రకాల్లో మే నెలలో ప్రారంభమవుతుంది. పండు ఈగ, అకాల వర్షాలు మరియు పండు రాలడం ప్రధాన సమస్యలు. పండ్లు 80-85 శాతం పరిపక్వతను చేరుకున్నప్పుడు కోత చేయాలి. ఇది రంగు, పరిమాణం మరియు దృఢత్వం ఆధారంగా కోత చేయాలి.
నీటి యాజమాన్యం :-
ముందుగా కాపు వచ్చే రకాలకు కోతకు 25 రోజుల ముందు నీరు ఆపాలి. ఆలస్య రకాలకు 15-20 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి నెలలో నీరు పూర్తిగా ఆపివేయాలి. ఎందుకంటే అధిక తేమ పండ్లు పగిలిపోవడానికి కారణమవుతుంది.

చీడపీడల యాజమాన్యం :-
పండు ఈగ నియంత్రణకు 1 ఎకరాకు 10-12 లింగాకర్షక ఉచ్చులు (ఏర్పాటు చేయాలి. తామర పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ/లీటరు లేదా ఫిప్రోనిల్ 2 గ్రా/లీటరు పిచికారి చేయాలి. అకాల వర్షాల తర్వాత బోర్డో మిశ్రమాన్ని కాండానికి పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కోత అనంతరం వచ్చే పక్షి కన్ను తెగులు యొక్క నియంత్రణకు డైఫెన్కోనజోల్ 0.5 మి.లీ/లీటరు నీటికి కలిపి (కోతకు 30 రోజుల ముందు) పిచికారి చేయాలి.
కోత పద్ధతులు :-
లేత ఆకుపచ్చ రంగు కలిగిన కాయలను మాత్రమే కోయాలి. ఎందుకంటే ఇవి రవాణా మరియు నిల్వలో మెరుగ్గా ఉంటాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో (తక్కువ ఉష్ణోగ్రతలో) కోయాలి. పండ్లను 6-7 సెం.మీ. కాడతో కత్తెరలు లేదా సీకేచర్ను ఉపయోగించి కోయాలి. భూమికి దగ్గరగా ఉన్నవాటిని 2-3 సెం.మీ. కాడతో కోయాలి. సొన కారకుండా కాడను 2 సెం.మీ. పొడవుగా ఉంచాలి. ఎందుకంటే సొన పండ్లపై మచ్చలు కలిగిస్తుంది. సొన కారే పండ్లను కాడ కిందకు పెట్టి ఉంచాలి దీని వలన సొన కాయపై పడకుండా ఉంటుంది.

మామిడి కోత ప్యాకింగ్ :-
కోత అనంతర యాజమాన్యం :-
కోత అనంతర యాజమాన్యం పండ్ల నాణ్యత, నిల్వ కాలం మరియు మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. ఈ దశలో శుద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు నిల్వ కీలకం. ఎగుమతి కొరకు, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి.
ప్రీ-కూలింగ్ మరియు శుద్ధి :- కోసిన కాయలను తక్షణం ప్రీ-కూలింగ్ చేయాలి. ఇది శ్వాసక్రియ శాతాన్ని తగ్గిస్తుంది. సొన కారకుండా కాయలను తడి గుడ్డతో శుభ్రం చేయాలి. 300-350 గ్రాముల బరువు ఉన్న పండ్లను గ్రేడింగ్ చేయాలి. వేడి నీటి శుద్ధి: 52°C నీటిలో శిలింద్ర నాశిని కలిపి 2-3 నిమిషాలు శుద్ధి చేయాలి.
ప్యాకింగ్ మరియు రవాణా :- కారుగేటెడ్ ఫైబర్ బోర్డ్ పెట్టెలు (పరిమాణం: 390×260×150 మి.మీ.) ఉపయోగించి 10-13 పండ్లు (4.5 కిలోలు మించకుండా) అమర్చాలి. 18 వరుసల వరకు ప్యాలెట్ చేయాలి. పరిపక్వత కోసం ఇథిలీన్ 500 ppm లేదా ఇథిఫాన్ 100-150 ppm తో 12-24 గంటలు చాంబర్లో ఉంచాలి, దీని వలన 4-5 రోజులలో కాయలు పక్వానికి వస్తాయి.

నిల్వ మరియు ఎగుమతి : 12.5°C ఉష్ణోగ్రత మరియు 90-95% సాపేక్ష తేమ వద్ద శీతలీకరణ చేయాలి. రవాణా సమయంలో రిఫ్రిజరేటెడ్ కంటైనర్లు ఉపయోగించి ఉష్ణోగ్రతను నియంత్రించాలి. అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఇర్రేడియేషన్ తప్పనిసరి, ఇది చీడపీడలను నాశనం చేస్తుంది.

కోత అనంతర నష్టాలు 20-30% వరకు ఉంటాయి. కానీ సరైన పద్ధతులు పాటిస్తే ఇవి 5-10%కి తగ్గించవచ్చు.
ముగింపు :-
మామిడిలో కాయ అభివృద్ధి దశ నుంచి కోత మరియు కోత అనంతర నిర్వహణ వరకు ప్రతి దశను శాస్త్రీయంగా నిర్వహిస్తే దిగుబడి మాత్రమే కాకుండా పండ్ల నాణ్యత, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ ధర గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా సొన శుభ్రపరిచే విధానం మరియు నియంత్రిత ఇథిలిన్ పక్వ ప్రక్రియను సరిగా అమలు చేయడం ద్వారా మామిడి సాగును మరింత లాభసాటిగా మార్చుకోవచ్చు.

ఎం. అఖిలేష్, డా. కె. వెంకటలక్ష్మి, డా. పి. హరికాంత్, డా. కె. మౌనిక, డా. బి. నవీన్ కుమార్, జి. నవ్య, ఎం. సోలమన్ ఫల పరిశోధన స్థానం, సంగారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫోన్ : 94406 91020


























