ఆంధ్రప్రదేశ్తెలంగాణమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

ఆత్మ నిర్భర పప్పు ధాన్యాల ఉత్పత్తి భారతదేశానికి సాధ్యమయ్యేనా!

0

ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026 సందర్భంగా ప్రత్యేక కథనం!

ప్రపంచవ్యాప్తంగా మానవ పోషణకు చౌకగా దొరికే ప్రోటీన్లకు పప్పు ధాన్యాలు మూలాధారం.  అంతేకాకుండా అపరాల సాగు, సాగు వ్యర్ధాలు నేల మరియు పశు పోషణకు మిక్కిలి మేలు చేస్తాయి.  నేల ఆరోగ్యం మరియు మానవ పోషకాహార భద్రత మొదలైనవి  పటిష్ట పరచాలంటే  అది అపరాల సాగుతోనే ప్రారంభం అవుతుందని ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఫిబ్రవరి  10 తేదీన  ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026 ను “సాధారణ స్థాయి నుండి శ్రేష్టమైన స్థాయి వరకు పప్పుధాన్యాలు” అనే ముఖ్య ఉద్దేశంతో అవగాహన సదస్సులు,  రైతు సదస్సులు  మరియు చైతన్య ర్యాలీలు  చేపట్టి వచ్చే సీజన్ నుండి పెద్ద ఎత్తున అపరాల సాగుతో నేల ఆరోగ్యంతో పాటు మన  ఆహారంలో భాగంగా  పప్పు ధాన్యాలను విరివిరిగా తిని  మన ఆరోగ్యాన్ని  పటిష్టపరుచుకోవాలని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రపంచ దేశాలను కోరుకుంటుంది.

పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, సోయాబీన్, మరియు ఇతర నూనె గింజల లో అపరాల సాగు అంతర పంటగా చేపట్టడం వలన జీవవైవిధ్యం పెరిగి, సహజ ప్రకృతి ఆవిష్కరించడంలో తోడ్పాటు అందిస్తాయి. పప్పుధాన్యాలు అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగంతో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి. మట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ తో పాటు పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల ప్రభావం పప్పు ధాన్యాల సాగుతో తగ్గే అవకాశం ఉంది.

పప్పు దినుసులు మరియు వాటితో తయారుచేసిన వివిధ ఆహార ఉత్పత్తులను  తినడం ద్వారా కలిగే పది ముఖ్యమైన ప్రయోజనాలు

  1. శరీరానికి ఎంతో ఉపయోగపడే ప్రోటీన్లకు ప్రధానమూల పదార్థం
  2. తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి
  3. శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పీచు పదార్థం విరివిగా దొరుకుతుంది
  4. తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారం
  5. గ్లూటెన్ ప్రోటీన్ లేని ఆహారం
  6. కొలెస్ట్రాల్ లేని ఆహారం
  7. అధిక మోతాదులో ఐరన్ దొరుకుతుంది
  8. అధిక మోతాదులో పొటాషియం దొరుకుతుంది
  9. తక్కువ మోతాదులో సోడియం కలిగి ఉంటాయి
  10. అధిక మోతాదులో ఫోలిక్యాసిడ్ దొరుకుతుంది

Table. వివిధ వివిధ పప్పుధాన్యాలలో పోషక విలువలు ప్రతి 100 గ్రాములకు

ఆత్మనిర్భర్త పప్పు ధాన్యాల మిషన్ :

భారతదేశం దిగుమతి చేసుకుంటున్న ఆహార ఉత్పత్తులలో పప్పుధాన్యాలు కూడా చాలా ప్రధానమైనవి. 2024-25 సంవత్సరంలో 5.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 73 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మన దేశం దిగుమతి చేసుకున్నది. ఇది అంతకుముందు  సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం అధికం. మరోవైపు రైతులకు ప్రభుత్వ  ప్రోత్సాహకాలు, క్షేత్రస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు వరి మరియు గోధుమ పంటలు సాగు చేయడానికి  ఉండటం వలన వాటిని అధిక దిగుబడులతో ఉత్పత్తి చేయడానికి ఎక్కువ  మక్కువ చూపుతున్నారు.  తద్వారా పంట మార్పిడి లేకపోవడం, పప్పు ధాన్యాల కోసం ఇతర దేశాల వైపు చూడడం మరియు  ఎక్కువగా ఎరువులు వాడడం వలన నేలలు సారవంతతను కోల్పోతున్నాయి.

దేశంలో పప్పు ధాన్యాల సాగు క్షీణత రైతుల వైఫల్యం కాదు  ఇది విధానాల సమన్వయ లోపాలుగా  మన దేశ ఆర్థిక సర్వే 2025-26 పేర్కొన్నది. మన దేశంలో 2023-24 సంవత్సరంలో సుమారు 27.5 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల పప్పుధాన్యాల పంటలను  సాగు చేసాము తద్వారా  సుమారు 24.25 మిలియన్ మెట్రిక్ టన్నుల  పప్పు ధాన్యాల ఉత్పత్తి జరిగినది. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఉత్పత్తి వ్యత్యాసమైన  ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే ఐదు సంవత్సరాలలో పెంచాలని  కేంద్ర ప్రభుత్వం ఇటీవల  ఆత్మనిర్బరత పప్పు ధాన్యాల మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  రైతులను పప్పు ధాన్యాల సాగు వైపు ప్రోత్సహించడానికి ముఖ్యంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సుమారు 11,440 కోట్ల పెట్టుబడి ప్రోత్సాహం, హామీ తో కూడిన పప్పు ధాన్యాల సేకరణ ద్వారా సుమారు 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి  మరియు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న సుమారు 27.69 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల నుండి వచ్చే ఐదు సంవత్సరాల (2030-2031) నాటికి 35.0 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా ఆత్మనిర్భర్త పప్పు ధాన్యాల మిషన్ పనిచేయబోతుంది.  దీనిలో భాగంగా  రైతులకు వివిధ రకాల నాణ్యమైన పప్పు ధాన్యాలు విత్తన కిట్స్ అందుబాటులోకి తెచ్చి 88 లక్షల పప్పుధాన్య విత్తన కిట్స్ ఉచితంగా రైతులకు అందించడానికి ఈ మిషన్ పని చేయబోతుంది.

పంటకోత తర్వాత నష్టాలను తగ్గించడానికి సుమారు 1,000 ప్రాసెసింగ్ పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పరచడానికి ప్రణాళిక తయారుచేస్తుంది. అంతేకాకుండా రాబోయే నాలుగు సంవత్సరాలలో రైతుల నుండి 100% కందులు,  మినుములు,  ఎర్ర పప్పు  కొనుగోలు చేయబోతుంది. ఆహార భద్రత,  పోషణ,  ఆరోగ్యం,  వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి ఉండడం, తక్కువ నీటితో ఎక్కువ ప్రోటీన్లను ఉత్పత్తి చేసే  సామర్థ్యం, జీవవైవిద్యం ఆవిష్కరించే  లక్షణాలు ఉండటం వలన  ముఖ్యంగా  నేల ఆరోగ్యం,  పశుసంపద ఆరోగ్యం – మానవ ఆరోగ్యం వన్ హెల్త్ – విధానం  దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా  పప్పు ధాన్యాల సాగు  పెంచవలసిన  అవసరం  ఎంతో ఉంది.

తెలంగాణలో పప్పు ధాన్యాల సాగు :

2023-24 సంవత్సరంలో తెలంగాణలో సుమారు 8.27 లక్షల ఎకరాలలో వివిధ రకాల పప్పు ధాన్యాలను  సాగు చేయడం జరిగినది తద్వారా సుమారు 3.40 లక్షల టన్నుల వివిధ  పప్పు ధాన్యాల ఉత్పత్తి చేయడం జరిగినది.  సంవత్సరానికి తెలంగాణ మొత్తం జనాభా కు కావలసిన పప్పుధాన్యాలు సుమారు 13.0 లక్షల టన్నులు. మన రాష్ట్ర పప్పు ధాన్యాల ఉత్పత్తి వాటా మన వినియోగంలో కేవలం 26.2 శాతమే.  మన రాష్ట్రం కూడా వివిధ  వివిధ ప్రాంతాల నుండి పప్పులను దిగుమతి చేసుకుంటుంది. గ్రామీణ జనాభా కు కావలసిన ముఖ్యమైన పోషకాలు  ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు  మరియు విటమిన్లు   అందించడంలో పప్పుధాన్యాలు ఎంతో దోహదపడతాయి. రాష్ట్రంలో  వివిధ అపరాల తలసరి  లభ్యత  సంవత్సరానికి సుమారు 7.06 కిలోలు.  తెలంగాణ రాష్ట్ర  ప్రస్తుత తలసరి  అవసరం సంవత్సరానికి సుమారు 18.3 కిలోలు.  మరోవైపు భారత  వైద్య పరిశోధనా మండలి  సూచించిన  తలసరి  పప్పు వినియోగం  సంవత్సరానికి సుమారు 29.2 కిలోలు. పై విషయాన్ని మనం పరిశీలించినట్లయితే  పెరుగుతున్న జనాభాకు  అనుగుణంగా  మన రాష్ట్రంలో  పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ (25%) జిల్లా  అపరాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది తరువాత స్థానంలో  ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్ (16.1%),  మెదక్ (15.3%),  వరంగల్ (12%),  నల్లగొండ(8%),  రంగారెడ్డి (6%)  జిల్లాలు ఉన్నాయి. తాండూర్ కందిపప్పు కు GI  ట్యాగ్ ఉండడం వలన  జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో  మంచి గుర్తింపు  మరియు  అధిక ధరకు కందిపప్పు అమ్మడానికి అవకాశం ఉంది తద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చు. అపరాలు సాగు చేసే ప్రాంతాలలో  భారీ మరియు  చిన్న మధ్య తరహా పప్పు మిల్లులను  ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకత లో మన దేశం  ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నది. సులభంగా  లభ్యమయ్యే  పప్పులతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, భోజనాలు  మరియు స్నాక్స్ కు  భవిష్యత్తులో మంచి డిమాండ్ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో  పప్పులతో తయారు చేసిన ప్రోటీన్లు  ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంది.

పప్పుధాన్యాల ప్రాసెసింగ్ :

అపరాల ప్రాసెసింగ్ లో ప్రధానమైనది  పప్పు మిల్లింగ్,  దీనిలో భాగంగా  వివిధ రకాల  అపరాల ను  చెత్తాచెదారం లేకుండా  ఫ్రీ క్లీనింగ్ అనే  యంత్రం ద్వారా  శుభ్రపరిచి  గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు.  తరువాత పప్పు మిల్లింగ్ లో  మొదటి  దశ  ఫ్రీ ట్రీట్మెంట్,  తరువాత  పొట్టు తీయడం  మరియు పప్పుగా విడగొట్టడం.  విడిపోయిన పప్పును  పాలిష్ చేసి  ప్యాకింగ్ చేయడం.  ముఖ్యంగా పప్పుధాన్యాల లో తేమశాతం 14-16%  కంటే ఎక్కువగా ఉండరాదు.  అపరాల ను పప్పుగా మార్చిన తర్వాత కూడా  పప్పు లో తేమ శాతం 14 కంటే ఎక్కువగా ఉండరాదు.  ఒక శనగపప్పు లో మాత్రమే 16%  ఎక్కువ తేమ ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతుల్లో  వివిధ అపరాల ను  ఫ్రీ ట్రీట్మెంట్ లో భాగంగా  తడి లేదా పొడి పద్ధతి ద్వారా  స్టోన్  చెక్కి (ఇసురౌతు) తో  పప్పు తయారు చేస్తారు.  తడి పద్ధతిలో  పప్పు ధాన్యాన్ని  నిర్దిష్ట కాలం పాటు  నీటిలో నానపెట్టడం,  మరియు మిల్లింగ్ కు ముందు  ఎండబెట్టడం వలన   ధాన్యం యొక్క పొట్టు  వదులుగా మారి  మిల్లింగ్ సమయంలో  సులభంగా ఊడిపోతుంది.  పొడి పద్ధతిలో  పప్పు మిల్లింగ్ కు ముందు  పప్పు ధాన్యాన్ని మెల్లగా దంచి  కొద్దిగా ఆయిల్  మరియు నీటితో  ఫ్రీ ట్రీట్మెంట్ చేసి  కొద్దికాలం పాటు  కండిషనింగ్ చేస్తే  కూడా  ధాన్యం పైన ఉన్న  పొట్టు ను సులభంగా తీయవచ్చు.  ఇటువంటి  శాస్త్రీయ ప్రామాణికం ని  తీసుకొని  వివిధ  సామర్థ్యం కలిగిన అల్ట్రా మోడల్  పప్పు  మిల్లు యంత్రాలు  మనకు  మార్కెట్లో  దొరుకుతాయి.  సుమారు నాలుగు నుండి ఐదు లక్షల మధ్య విలువచేసే మిల్లు ద్వారా  వారానికి  ఒక టన్ను  పప్పు ఉత్పత్తి చేయవచ్చు. శనగపప్పు తయారు చేసిన తరువాత దాని నుండి మనము శెనగపిండి  తయారుచేసి  మార్కెట్ చేసినట్లయితే  మరింత ఆదాయం లభిస్తుంది.

పప్పుధాన్యాల పరిశ్రమ యొక్క వ్యాపార (SWOT) విశ్లేషణ….

బలాలు :-

  • అపరాలు పండించే జిల్లాలలో సారవంతమైన నేలలు ఉండడం
  • గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబాలు అపరాలు పండించే జిల్లాల్లో అధికంగా ఉండటం
  • తాండూర్ కందిపప్పు కు GI ట్యాగ్ ఉండడం వలన  జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో  మంచి గుర్తింపు  మరియు  అధిక ధరకు అమ్మడానికి అవకాశం ఉంది
  • వేగవంతమైన పట్టణీకరణ మరియు పెరుగుతున్న టైర్- II & టైర్ -3 నగరాలు
  • గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న మరియు మధ్య తరహా  ధాల్ మిల్లింగ్ యూనిట్ల  ఏర్పాటుకు  పెరుగుతున్న అనుకూల వాతావరణం,  ఆహారశుద్ధి పాలసీలు
  • వివిధ ప్రాంతాల ప్రజల రుచికి తగిన టువంటి ఆహార పదార్థాలు,  ఇతర స్నాక్స్ , తిను బండారాలు మొదలైనవి తయారు చేసే ఆధునిక ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉండడం
  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతీ యువకులు అధికంగా ఉండడం

బలహీనతలు :-

  • వర్షాధార పరిస్థితులు
  • మెరుగైన పప్పు మిల్లుల నిర్వహణ పద్ధతులను అవలంబించలేదు
  • ఎక్కువ మొత్తంలో అపరాలు సాగు చేసే ప్రాంతాలలో పప్పు మిల్లులు అందుబాటులో లేకపోవడం
  • మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో పంట చేతికి వచ్చినప్పుడు  ధరల ఆటుపోట్లకు లోనవ్వడం
  • కొన్ని సందర్భాల్లో మార్కెట్ పప్పు ధర లో ఆటుపోట్లు

అవకాశాలు:-

  • జీవ సంబంధ కారకాలు (విల్ట్, వంధ్యత్వం మొజాయిక్ వ్యాధి, ఫైటోఫ్తోరా, మరియు పాడ్ బోర్)  మరియు వాతావరణ (తేమ, అధిక లేదా చల్లని ఉష్ణోగ్రత) మార్పులను తట్టుకొనే  వంగడాలను తయారుచేయడం
  • తక్కువ కాలవ్యవధి కలిగిన వంగడాల అభివృద్ధి
  • గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి మరియు  విత్తనం నుండి   తయారు చేసిన ఆహార పదార్థాలు  వినియోగదారుడి  వంటశాల కు చేరే వరకు  విలువ గొలుసు (value chain) ను అభివృద్ధి పరచడం
  • భవిష్యత్తులో పప్పుధాన్యాల కు మరింత గిరాకీ ఉండే అవకాశం
  • తలసరి ఆదాయం పెరగడంతో వినియోగదారుడు నాణ్యమైన ఆహారం కోసం  వెతకటం
  • ఆర్గానిక్ పద్ధతిలో పండించిన అపరాలకు మరింత విలువ ఉండడం
  • తగినంత పప్పు అందుబాటులో ఉంటే రిటైల్ ధరల ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ ఉంటుంది

అపాయాలు:-

  • వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా సరైన సమయంలో తగినంత వర్షపాతం లేకపోవడం మరియు  అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవడం
  • తక్కువ ఉత్పాదకత
  • చిన్న మరియు మధ్య తరహా యూనిట్లలో తక్కువ ధల్ రికవరీ
  • బహుళజాతి కంపెనీలు మరియు రిటైల్ సంస్థల నుండి తీవ్ర పోటీ ఉండడం

ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల  మరియు తెగుళ్ళ నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, పంట నిల్వ ,  ప్రాసెసింగ్  మరియు మార్కెటింగ్ నిర్వహణ ద్వారా  విత్తనం నుండి  పప్పు వరకు  తగిన చర్యలు చేపట్టడం ద్వారా ద్వారా అపరాల సాగు విస్తరణం  మరియు ఉత్పాదకత  పెరిగే అవకాశం ఉంటుంది.

ఎ.పోశాద్రి, జి. రాజేందర్, టీ.వీ.ఎన్. పద్మావతి,వ్యవసాయ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగం,ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,హైదరాబాద్, ఫోన్ : 94928 28965

 

Leave Your Comments

వ్యవసాయ భూములలో సౌర ఫలకాలు (అగ్రివోల్టాయిక్స్ / సౌర వ్యవసాయం): ఆధునిక వ్యవసాయానికి నాంది

Previous article

You may also like