మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాయకోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10-11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయలలో ఎక్కువగా ఉంటే అటాక్సిన్లు వృద్ధి చెందటానికి ఆస్కారమున్నది. తేమ అతి తక్కువ వుంటే మిరప రంగు కోల్పోటమే కాకుండా ప్యాకింగులో మిరపకాయలు విరగటం కూడ జరుగుతుంది.
మిరపలో తేమ శాతం నిఖరముగా ఉంచుట కష్టము. మిరపకు తేమను పీల్చుకునే గుణం మరియు వదిలి వేసే గుణం కలిగివున్నందున కాయలు నిలువచేసే ప్రదేశాన్ని బట్టి తేమ శాతం మారుతూ ఉంటుంది. తేమలో హెచ్చు తగ్గులు శీతల గిడ్డంగులలో తక్కువగాను, బయట నిల్వ చేసినప్పుడు ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి రంగు మరియు నాణ్యత నిలుపుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీస్కోవాలి
మిరపకాయలను ఎండబెట్టడానికి తీస్కోవాల్సిన జాగ్రత్తలు కోసం…..
1.సరైన సమయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు పొడిగా ఉన్నప్పుడు కాయలు కోయాలి. మొక్కల మీద కాయలు పూర్తిగా పక్వానికి వచ్చి రంగు వచ్చాకే కాయలు కోయాలి. ఎక్కువగా మొక్క మీద పండనిస్తే కాయలు ముడతలు పడటమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గటం జరిగి నాణ్యత కోల్పోతుంది.
2.వర్షాధారపు పంటకు 3-4 కోతలు, నీటి వసతి వున్న తోటలలో 6-8 కోతలు కోయాలి. కాయలు కోసిన తరువాత ఒక రోజు రాశిగా పోసి తర్వాత ఎండబెట్టాలి. దీని వల్ల దోరకాయలు కూడ సమానంగా పండుతాయి.
- కళ్ళాలలో ఆరబెట్టిన కాయలు రాత్రులందు మంచు బారిన పడకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పాలి.
- ఎండిన కాయలు వెంటనే గ్రేడింగ్ చేయాలి. తాలు కాయలు, విరిగిన కాయలు, రాలిన తొడిమలు, ఎండిన ఆకులు, తెల్లకాయలు, చీడపీడలు ఆశించిన కాయలను వేరు చేయాలి. గ్రేడింగ్ సరిగా చేయకపోతే ఈ తాలు కాయల నుండి అప్లాటాక్సిన్లు మంచి కాయలకు సోకే ప్రమాదమున్నది. ఎట్టి పరిస్థితులలోను తాలు కాయలను గ్రేడింగ్ చేసిన నాణ్యమైన కాయలలో కలుపరాదు.
- ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి నిల్వచేసుకోవాలి.
- కాయ రంగు, నాణ్యత కోల్పోకుండా టిక్కీలను శీతల గిడ్డంగులలో నిల్వచేయవచ్చు. తేమ శాతం అధికంగా ఉన్న కాయలను ప్యాక్ చేస్తే అఫ్లాటాక్సిన్లు కలిగించే బూజులు వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల టిక్కీలలో తొక్కే ముందు నిర్దేశించిన తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి.
- శీతల గిడ్డంగులలో తేమ శాతాన్ని నియంత్రించే యంత్రాలను వాడాలి.
- టిక్కీలలో నింపే ముందు మిరప కాయలపై నీటిని చిలకరించరాదు.
- రైతువారీ పద్ధతిలో నిల్వచేసేటప్పుడు టిక్కీలు లేదా గోనె సంచులను తేమ తగలకుండా వుంచాలి. అందుకు నేల మీద చాపలు లేదా వరిపొట్టు లేదా కర్రచెక్కలు పరచాలి. గోడల నుండి 50-60 సెం.మీ దూరంగా బస్తాలు పరచాలి.
- మిరప ఎండబెట్టే కళ్ళాల వద్ద కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు రాకుండా చూచుకోవాలి. వాటి మల మూత్ర విసర్జన వల్ల కూడా నాణ్యత దెబ్బతింటుంది.
- గ్రేడు చేసిన కాయలను ధూళి, చెత్త, చెదారం, చనిపోయిన కీటకాలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.
- మిరపకాయలు ఆరబెట్టడానికి ఆధునిక డ్రయ్యర్లను వినియోగించుకోవాలి. దీని వలన కాయలు అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, దుమ్ము, ధూళి లేకుండా రంగు నాణ్యత కోల్పోకుండా తక్కువ సమయంలో శాస్త్రీయంగా ఆరబెట్టవచ్చును.
మిరపకాయ ఎండబెట్టే పద్ధతులు :-
ప్రస్తుతం పాటిస్తున్న బయటకల్లాల్లో ఆరుదల విధానము వల్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. నేల, గాలి, తేమ ద్వారా వచ్చే శిలీంద్రాలు, తద్వారా వచ్చే బూజు పదార్థాలు, అఫ్లాటాక్సిన్స్ నాణ్యతకు అవరోధంగా ఉన్నాయి. అంతే కాకుండ సూర్యరశ్మి ద్వారా వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల రంగు బాగా క్షీణిస్తున్నది. కాయలను నేలపై గాని, పేడ అలికిన కళ్ళాల మీద గాని అరబెట్టరాదు. దీని వల్ల నేలలోని అఫ్లాటాక్సిన్లు కలుగజేసే శిలీంద్రాలు ఆరుతున్న మిరపను సోకే ప్రమాదమున్నది. కావున కాయలు పాలిథీన్ పట్టాల మీద గాని శుభ్రపరచిన కాంక్రీటు కళ్ళాల మీద గాని ఆరబెట్టాలి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు కొన్ని మెళకువలు మరియు మేలైన ఆరుదల విధానాలు తప్పక పాటించాలి ఆరుదల చేయడానికి రెండు విధానాలున్నాయి.
- రైతువారీ పద్ధతి
- కృత్రిమంగా వేడి గాలిని ఉపయోగించే మేలైన పద్ధతులు.
- రైతువారీ పద్ధతి- కల్లాల్లో ఆరబెట్టుట:
ఈ విధానంలో ఆరుదలకు 15 నుండి 20 రోజులు పడుతుంది. పశువులు తిరగని కంచె ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకొని వీలైనంత పల్చగా కాయలను పోయాలి. సిమెంటు ఫ్లోర్ లేదా టార్పాలిన్ పట్టాలపై ఆరబెట్టాలి. 90 లేదా 120 జి.ఎస్.ఎమ్ మందంగల షీట్లను వాడవచ్చు. కాయలను ఎప్పటికప్పుడు తిరగకలపాలి.తేమ శాతము సుమారు 10-11 వరకు ఉండేలా ఆరబెట్టాలి. ఎక్కువగా ఎండితే రంగు కోల్పోవడము మరియు విరిగి పోవడము జరుగుతుంది. బాగా ఆరకపోతే అఫ్లాటాక్సిన్ ఆశించడానికి అవకాశముంది. తాలుకాయలు, తెగుళ్ళు, కీటకాలు ఆశించిన కాయలను వేరు చేయాలి. మిరప కోత తర్వాత సరైన ఆరుదల విధానాలు పాటించకపోవటం వల్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. ఒక్కోసారి ముఖ్యంగా ఎగుమతులకు పనికి రాకుండా పోతుంది. మిరప ఆరుదల విధానంలో రైతులు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి.
పట్టాలపై ఆరుదల వల్ల నేల ద్వారా వచ్చే శిలీంధ్రాలు, మలినాలు రాకపోయినా, ఎక్కువరోజులు పట్టే ఈ విధానము వల్ల సూర్యరశ్మిలో ఉన్న అతినీలిలోహిత కిరణాల వల్ల కాయల్లో రంగు క్షీణిస్తుంది. పైగా ఎక్కువ తాలు కాయ వస్తుంది. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే మేలైన కృత్రిమంగా వేడి గాలితో బారన్ లో ఆరుదల లేదా బారన్ లేని చోట పాలిహౌస్ సోలార్ డ్రయర్ని ఉపయోగించాలి. ఈ పద్దతులను పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటరు, బాపట్ల వారు రూపొందించారు.
- కృత్రిమంగా వేడి గాలిని ఉపయోగించి అరుదల చేయుట బారన్లో ఆరబెట్టు విధానం :-
పండు మిరపకాయలను కోసిన తరువాత పురుగు మరియు తెగులు, సోకిన కాయలను వేరుచేసి నీడలో సుమారు 12 గంటలు లేదా ఒక రాత్రి గుట్టగా వేయాలి. మరుసటి రోజు పండు మిరపను బుట్టలలో నింపుకొని బారన్ లోని టైర్లపై ముందుగా అమర్చిన ట్రేలలో సుమారు 2 1/2 నుండి 3 అంగుళాల మందముతో సమానముగా పోసుకోవాలి. ట్రే సైజు సుమారు 3 1/2 అడుగుల పోడవు. 2 1/2 అడుగుల వెడల్పు నుండి 3 అంగుళాల లోతు ఉండాలి. ఈ ట్రేలను 3 నంబరు జింకు వైరు మెష్ తో 12 మి.మీ మందంగల ఐరన్ ఫ్లాట్తో చేసిన ఫ్రేముకు వెల్డింగ్ చేసి తయారు చేసుకొనవచ్చును. ట్రేలను టైర్ల పైన అమర్చడానికి 6 అంగుళాల పొడవు గల ఫ్లాట్ ముక్కలను హ్యాండిల్స్ ట్రేల చివర నాలుగు వైపులా వెల్డింగ్చేసుకోవాలి. 12×20 అడుగుల సైజు గల బారన్లో 100 నుండి 110 ట్రేలలో 10 నుండి 11 క్వింటాళ్ళ పండుమిరపను పోసుకోవచ్చును, ట్రేలను బారన్ లోని అరలపైన అమర్చినప్పుడు వేడిగాలి పైకి పోవుటకు వీలుగా ఉండాలి. బారన్ పొయ్యిలో కర్ర లేదా వ్యవసాయ వ్యర్థపదార్ధాలు ఉపయోగించి మండించవచ్చును. 75 నుండి 80 తేమ శాతము గల పండు మిరపను 10 శాతము వరకు ఆరబెట్టుటకు పట్టు సమయము సన్నరకాలయితే 40 గంటలు, హైబ్రిడ్ మిరప, వండర్ హాట్, ఇండామ్-5 లాంటి రకాలయితే 50 గంటలు పడుతుంది.
కాయలను ఆరబెట్టునపుడు బారన్ లో వేడి ఉష్ణోగ్రత 50°ల సెంటీగ్రేడు నుండి 55° ల సెంటీగ్రేడు వరకు ఉండాలి. బారన్ లో ఆరబెట్టునప్పుడు ముఖ్యంగా వెంటిలేటర్లను కాయ ఆరుదల, రక్తమును బట్టి పట్టికల్లో తెలిపిన విధముగా మూయుట, తెరచుట చేయాలి. ఈ పద్ధతిలో పెట్టుబడి అనగా ఒక్క ట్రేల తయారీకే అవసరమవుతుంది. సుమారు రూ. 25,000/- వరకు పెట్టుబడి ఉంటుంది. ఒక్కసారి తయారు చేసిన ఈ ట్రేలను 10 నుండి 15 సం.ల వరకు వాడుకోవచ్చు. ఒక కిలో ఎండుమిరప తయారవటానికి రూ. 2.00 నుండి రూ. 2.50 వరకు ఖర్చవుతుంది. అదే రైతువారీ పద్ధతిలో అయితే రూ. 0.50 నుండి 0.75 వరకు ఖర్చు అవుతుంది. బారన్ లో ఆరుదల చేసిన మిరపకాయల్లో తాలుకాయ చాలా తక్కువ ఉండి రంగు బాగా నిలబడి దుమ్ము, ధూళి లేకుండా రైతువారీ పద్ధతిలో కంటే మంచి నాణ్యత ఉంటుంది.
పాలీ హౌస్ సోలార్ డ్రయర్:- రెండు టన్నుల పండు మిరపకాయలు ఆరబెట్టడానికి కావలసిన ఆర్చ్ మోడల్ పాలీహౌస్ సోలార్ డ్రయర్ సైజు 40 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల ఎత్తు వుండాలి. పైన 200 మైక్రాన్ మందంగల యు.వి. స్టెబిల పాలిథీన్ షీటును కవర్ గా వాడవచ్చు. డ్రయర్ లో వైర్ మెష్ జల్లెళ్ళు రెండు అరలలో అమర్చబడి ఉంటాయి. డ్రయర్ చుట్టూ క్రిందా పైనా కవర్ షీట్కి కిటికీలు, వాటిపై వెల్ అతికించిన కవర్లు వుంటాయి. వీటిని మూయుట, తెరుచుట ద్వారా డ్రయర్ లోపలి ఉష్ణోగ్రత మరియు తేమ శాతాన్ని కంట్రోల్ చేయవచ్చు.
ఆరబెట్టు విధానం :- కోత అనంతరం పురుగు / తెగులు సోకిన కాయలను వేరుచేసి 12 గంటలు నీడలో గుట్టగా చేసిన తరువాత సోలార్ డ్రయర్ లో గల అరలలో సుమారు 2 1/2 అంగుళాలు ( 6 సెం.మీ) మందంలో సమానంగా పోయాలి. 75 నుండి 10 శాతం తేమ వరకు ఆరబెట్టుటకు 6 నుండి 7 రోజులు సూర్యరశ్మి ఉన్న రోజులు కావాలి. అదే కల్లాల్లో అయితే 15 నుండి 20 రోజులు కావాలి. ఈ డ్రయర్ లోపలి ఉష్ణోగ్రత ఆరు బయట కంటే 10 నుండి 20 డిగ్రీలు అధికముగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఆకాల వర్షాల నుండి పంటను పూర్తిగా రక్షించవచ్చు. డ్రయర్ లోపల నేలపై కూడ 200 మైక్రాన్ మందముగల నల్ల పాలిథీన్ షీట్ పరిస్తే వేడి బాగా నిలబడి తొందరగా ఆరుదల అగును. డ్రయర్ పైన పాలిథీన్ కవర్ వాలు ఉత్తర-దక్షిణాలు ఉండేలా పెట్టుకుంటే ఎక్కువ సూర్యశక్తి ఆరుదలకు ఉపయోగపడుతుంది. ఈ సోలార్ డ్రయర్ విధానంలో తక్కువ ఖర్చుతో, హీటర్ లాంటివి అవసరం లేకుండా ప్రకృతిలో లభ్యమయ్యే సూర్యరశ్మిని ఉపయోగించు కోవచ్చు. ఉష్ణోగ్రత వల్ల కలిగే గాలిలో సాంద్రత వ్యత్యాసము వల్ల క్రింది కిటికీల ద్వారా బయట గాలి డ్రయర్ లోకి ప్రవేశించి వేడై పై కాయల ద్వారా వెళ్ళుట వల్ల ఆరుదల జరుగుతుంది. ఈ విధానములో, డ్రయర్ నిర్మాణాలకు దూరంగా నిర్మించి గరిష్ట సూర్యరశ్మి గ్రహించే విధంగా అమర్చాలి. డ్రయర్ ఖరీదు సుమారు రూ.90,000. సీజన్ లేనప్పుడు డ్రయర్ బాగాలు విడదీసి తక్కువ ప్రదేశములో షెడ్డులోగాని, గదిలో గాని భద్రపరుచు కొంటే, ప్లాస్టిక్ షీటు జీవితకాలము ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రయర్ ను పైపు, బోల్టుల ఫ్రేముగా చేయుటవల్ల, ఒక చోట నుండి మరొక చోటుకు సునాయాసంగా తీసుకొనిపోవచ్చు. ఈ డ్రయర్ పైన ఫాలిథీన్ కవర్ బదులు షేడ్ నెట్ని ఉపయోగించి నర్సరీని పెంచుట కూడా ఉపయోగించుకోవచ్చు.
సోలార్ డ్రయర్ను ఉపయోగించుట వలన మిరప కాయలలో రంగు బాగా నిలబడడమే గాక, దుమ్ము, ధూళితో కలుషితం కాకుండా అకాల వర్షాల నుండి రక్షణ పొందవచ్చు. శాస్త్రీయంగా ఆరబెట్టిన, అఫ్లాటాక్సిన్ల విష ప్రభావం లేని నాణ్యమైన మిరపకు మార్కెట్టులో గిరాకి ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువ పలుకుతుంది మరియు ఎగుమతులకు అవకాశాలు మెండుగా ఉంటాయి. మిరప ఎగుమతులు పెరిగితే నికరాదాయం గణనీయంగా పెరితే అవకాశాలున్నాయి.
మిరపలో తేమ శాతం నిఖరముగా ఉంచుట కష్టము. మిరపకు తేమను పీల్చుకునే గుణం మరియు వదిలి వేసే గుణం కలిగివున్నందున కాయలు నిల్వ చేసే ప్రదేశాన్ని బట్టి తేమ శాతం మారుతూ ఉంటుంది. తేమలో హెచ్చు తగ్గులు శీతల గిడ్డంగులలో తక్కువగాను, బయట నిల్వ చేసినప్పుడు ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి రంగు మరియు నాణ్యత నిలుపుకోవాలంటే శీతల గిడ్డంగులలో నిల్వచేయటం ఉత్తమం. అవకాశం వున్నచోట శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తే కాయ రంగు, నాణ్యత తగ్గకుండా చేసుకోవచ్చు. శీతల గిడ్డంగులలో తేమ శాతాన్ని నియంత్రించే యంత్రాలను వాడాలి.
డా. యం. గంగాదేవి, సీనియర్ శాస్త్రవేత్త,(అగ్రానమి), డా. యం. యుగంధర్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, డా. షేక్. ఎన్. మీరా, డైరెక్టర్, ATARI, జోన్-X, కె. వి. కె, గుంటూరు, హైదరాబాద్, ఫోన్ : 94900 35258


























