వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి.
- కలుపు రాకుండా నివారించడం.
- పైరులో ఆశించిన కలుపును నివారించడం.
అవకాశం ఉన్నంత వరకు పొలంలో కలుపు రాకుండా నివారించుకోవటం మంచిది.
కలుపు రాకుండా నివారించుకోవటానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు :
- నేల సమతలంగా లేని ప్రాంతాలలో కలుపు సమస్య ఎక్కువ కాబట్టి పైరు విత్తేముందే నేలను చదును చేయాలి.
- వేసవిలో లోతు దుక్కులు దున్నటం వలన పొలంలో ఉన్న తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు నివారించవచ్చు. తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలను వీలున్నన్ని ఎక్కువ సార్లు గొర్రు, గుంటకలు వంటి పరికరాలతో దున్నటం వలన నేల పైపొరలలోని కలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించి, పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి.
- రైతులు సాగుచేసే భూములను ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు. అంతే శ్రద్ధతో పొలంగట్లు, పొలాలకు వెళ్ళే డొంకలు, రోడ్ల ప్రక్క ప్రదేశాలలో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం తయారీ చాలా వరకు తగ్గిపోతుంది.
- గ్రామాలలో చెరువు గట్లు, కాలువ గట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో కలుపు మొక్కలు పెరగనీయకుండా చేసినప్పుడు పంట పొలాలలో కలుపు సమస్య తగ్గుతుంది.
- పశువుల ఎరువు పొలానికి వేసినప్పుడు పశువుల ఎరువులో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోవటానికి, తొలకరి వర్షాలకు అవసరం మేరకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు విత్తనాలు పైరు వేయకముందే మొలచి నశించేలా చేయాలి.
- కలుపు విత్తనాలు కలవకుండా పంట విత్తనాలు మాత్రమే విత్తేందుకు వాడాలి.
- పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నప్పుడు కలుపు ఉదృతిని పైరు అడ్డుకుంటుంది.
- పంట విత్తనాలు చల్లటం కంటే, యంత్ర పరికరాలు ఉపయోగించి సిఫారసు చేసిన ఎడంతో, సిఫారసు మేరకు విత్తన మోతాదు పాటించి, సరైన పద్ధతిలో విత్తినప్పుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
- పైరు వేయటానికి కొంత సమయం ఉన్నపుడు పొలంలో పచ్చి రొట్ట పైర్లు సాగుచేసి కలుపు ఉధృతి తగ్గించుకోవటానికి అవకాశం ఉంది.
- పంటకోసిన తరువాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కలను వెంటనే నాశనం చేయాలి. అలా చేయనప్పుడు, వాటి ద్వారా విత్తనం ఉత్పత్తి జరిగి తరువాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది.
- నేరుగా విత్తిన వరి :-
సరియైన పదును ఉన్నప్పుడు దుక్కిలో నేరుగా విత్తుట : ఈ విధానంలో రైతులు తొలకరి వర్షాలు పడిన వెంటనే లేదా కాలువలో నీరు వచ్చిన వెంటనే పొలం దుక్కి దున్ని విత్తనాలను నేలలో తగినంత పదును చేరినప్పుడు విత్తి, వర్షాధారంగా లేక ఆరుతడి పంటగా సాగుచేస్తూ కాలువల ద్వార నీరు అందుబాటులోకి వచ్చిన అనంతరం మాగాణి వరిగా సాగుచేస్తారు. ఈ పద్ధతిలో రసాయనాలతో కలుపు నిర్మూలన మూడు దశలలో చేయాలి.
విత్తుటకు ముందు : పొలంలో తుంగ, గరిక, దర్భగడ్డి, బొంత ఊద వంటి మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు, తొలకరి వర్షాలు పడి, కలుపు ఏపుగా పెరుగుచున్నప్పుడు 1.0 లీ. నీటికి 5 మీ.లీ. పారాక్వాట్ 24% రసాయనాన్ని లేదా గ్లూపోసినేట్ 13.5% ద్రావకం 4 మి.లీ. లీటరు నీటికి కలిపి, ఎక్కడ కలుపు ఉంటే అక్కడ పిచికారీ చేయాలి. ఈ మందు స్ప్రే చేసిన 10-15 రోజుల తర్వాత పొలం దున్ని వరి విత్తుకోవచ్చు.
విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల లోపు :- వరి విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల లోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.0 లీ. పెండిమిథాలిన్ 30%(స్టాంప్, పెండిస్టార్) 700 మి.లీ. పెండిమిథాలిన్ 38.7% ద్రావకం లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50% (రీఫిట్, ఎరేజ్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి.

విత్తిన 15-20 రోజుల మధ్య :- ఏ కారణం చేతనైన విత్తిన వెంటనే కలుపు మందులు (స్ప్రే చేయకపోతే పొలంలో ఊద వంటి గడ్డి జాతి మొక్కలు ఉంటే ఎకరాకు 400మి.లీ. సైహాలోఫాప్ బ్యుటైల్ 10%(క్లించర్, రాస్అప్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి. గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% (నామినీ గోల్డ్, తారక్) 200 లీ. నీటిలో కలిపి విత్తిన 15-25 రోజుల మధ్య పిచికారీ చేయాలి.

విత్తిన నెల రోజుల తర్వాత :- పొలంలో వెడల్పాకు కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. 2, 4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబడును. కనుక పై పాటుగా నత్రజని ఎరువును వేసుకోవాలి లేదా ఎకరాకు 50గ్రా. ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15% (సన్ రైస్) లేదా 8.0 గ్రా. మెర్సల్ఫ్యూరాన్ మిథైల్ + క్లోరిమ్యురాన్ ఇథైల్ 20% (ఆల్ మిక్స్) 200లీ. నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి.
- దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తుకొనుట :
వరి విత్తిన 3-5 రోజుల లోపు :- పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 80గ్రా. పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10% (సాథి) ముందుగా అరలీటరు నీటిలో కలుపుకొని, ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో సమానంగా చల్లాలి. ఈ మందు చల్లిన 2-3 రోజుల వరకు పొలంలోని నీరు బయటకు పోనిచ్చుట కాని లేదా బయట నీరు పొలంలోకి పెట్టుటకాని చేయరాదు.
వరి విత్తిన 15-20 రోజుల మధ్య ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే కలుపు మందులు స్ప్రే చేయకపోతే, పొలంలో ఊద మొదలగు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 మి.లీ. సైహాలోఫాప్ బ్యుటైల్ 10% (క్లించర్, రాప్ప్) 200 లీ. నీటిలో కలిపి (స్ప్రే చేయాలి లేదా గడ్డిజాతి మరియు వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పోరిబాక్ సోడియం 10% (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి విత్తిన 15-20 రోజుల మధ్య పిచికారీ చేయాలి.
విత్తిన నెల రోజుల తరువాత :-
విత్తిన నెల రోజుల తర్వాత పొలంలో వెడల్పాకు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400గ్రా. 2, 4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్స్ ్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబడును. కనుక పై పాటుగా నత్రజని ఎరువును వేసుకోవచ్చును లేదా ఎకరాకు 50గ్రా. ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15% (సన్ రైస్) పొడి మందును లేదా 8.0 గ్రా. మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ +క్లోరిమ్యురాన్ ఇథైల్ 20% (ఆల్ మిక్స్) 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

3.మాగాణి వరి :
నారుమడి : నారుమడిలో ఊద నిర్మూలనకు ఒక ఎకరం నారుమడికి (పెటిలాక్లోర్ 50% ద్రావకం 400 మి.లీ. (రీఫిట్, ఎరేజ్) 200 లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేక 3 రోజులలో పిచికారీ చేయాలి లేదా విత్తిన 14-15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు ఎకరం నారుమడికి 400 మి.లీ. సైహాలోఫాప్ బ్యుటైల్ 10% (క్లించర్, రాస్అప్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవలెను. ఊద మరియు వెడల్పాకు కలుపు మొక్కలు నారుమడిలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు 100 మి.లీ. బిన్ప్ఫైరిబాక్ సోడియం 10% ద్రావకం (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నాటిన వరి పొలంలో :

ఊద మొదలగు ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు 1.0 నుండి 1.5 లీ. బ్యుటాక్లోర్ 50% (మాచెటి, హిల్టాక్లోర్) లేదా 80 గ్రా. పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10% పొడి మందు (సాధి) లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50% (రీఫిట్, ఎరేజ్) లో ఏదో ఒకదానిని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుండి 5 రోజులలో పలుచగా నీరు ఉన్నప్పుడు చల్లాలి.
గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఎకరాకు 4.0 కిలోలు బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ (0.6%) + ప్రెటిలాక్లోర్ (6.0%) (లోండాక్స్ పవర్) గుళికలు లేదా 4.0 కిలోలు బ్యుటాక్లోర్ 5% గుళికలు మరియు 4.0 కిలోలు 2,4-డి. ఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుండి 5 రోజులలో పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి.
నాటిన 15-25 రోజుల సమయంలో గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి.
నాటిన 25-30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. 2,4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) లేదా 400 మి.లీ. 2,4-డి ఎమైన్ సాల్ట్ 58% ద్రావకం (వీడ్మార్ సూపర్, వీడార్ 58) లేదా 50గ్రా. ఇథాక్సిసల్ఫూరాన్ 15% (సన్రైస్) లేదా 8.0 గ్రా. మెట్సల్ఫ్యూరాన్ మిథైల్+ క్లోరిమ్యురాన్ ఇథైల్ 20% (ఆల్మిక్స్) 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా వెడల్పాటి కలుపు మొక్కలను నివారించవచ్చును.
శ్రీ. ఎన్. నాగేంద్ర బాబు, శాస్త్రవేత్త ,డా. కె. ఫణి కుమార్, ప్రధాన శాస్త్రవేత్త , ఏరువాక కేంద్రం, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ, విశ్వవిద్యాలయం,ఏరువాక కేంద్రం, ఏలూరు, ఏలూరు జిల్లా. ఫోన్ : 94941 33633


























