ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆర్థికాభివృద్ధిలో గడిచిన 5 సంవత్సరాలుగా ఉద్యాన పంటలు యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరుగుతూ ఉండడం, రాష్ట్ర జిడిపిలో 7.4% సంపాదించడం వంటివి ఉద్యానపంటల సాగు యొక్క విశిష్టతను తెలుపుతున్నాయి. మన రాష్ట్రంలోని ఉద్యాన పంటలు సుమారు 27.74 లక్షల హెక్టార్లలో (NHB-2021-22) సాగు చేయబడుతూ, ఏడాదికి 341.63 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడిని సాధిస్తున్నాయి. పండ్లతోటలు, కూరగాయలు మరియు పూలతోటలు మన రాష్ట్రంలోని ప్రధానమైన ఉద్యానపంటలు. ఇవి రాష్ట్ర ఉద్యాన పంటల విస్తీర్ణంలో సుమారు 55% ఆక్రమిస్తున్నాయి.
మేలైన విత్తనం, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు చేపడుతున్నప్పటికీ, ఉద్యానపంటల దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణాలు పంటలను ఆశించే పురుగులు, తెగుళ్ళు కాగా, ఇటీవలి కాలంలో చీడపీడలతో పాటు నులిపురుగులు కూడా ప్రధాన సమస్యగా మారినవి. పంటలలో “దాక్కొన్న శత్రువు” (హిర్డెన్ ఎనిమి)గా వ్యవహరించే ఈ నులిపురుగులు, “నెమటోడా” వర్గానికి చెందిన, పొడవుగా గుండ్రంగా ఉండే, విభజనలేని, కాళ్ళులేని అతి సూక్ష్మమైన పురుగులు, ఈ పురుగులు 0.3 నుండి 10 మి.మీ. పరిమాణం కలిగి కంటికి కనిపించని సూక్ష్మజీవులు, ఉద్యాన పంటలలో, ఈ మధ్యకాలంలో ప్రధానమైన సమస్యగా పరిణమించిన నులిపురుగుల వలన ప్రత్యక్షంగా పంటలను నష్టపరచడమే కాకుండా, పరోక్షంగా వివిధ రకాల శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ళ వ్యాప్తికి కారకాలుగా కూడా దోహదపడుతుంటాయి.

పాలిహౌస్లలో పంటలను సాగుచేసే పద్ధతిలో ఈ నులిపురుగుల ఉధృతి అధికంగా ఉన్నట్లు గమనించడమైనది. కొన్ని సందర్భాలలో నులి పురుగుల వల్ల పాలిహౌస్లలో ఏర్పడేనష్టం అత్యధికంగా 60 శాతం వరకూ ఉన్నట్లు గుర్తించారు. పాలిహౌస్లలో ఉండే వాతావరణ పరిస్థితులు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, సంవత్సరం పొడవునా పంట అందుబాటులో ఉండడం, ఎక్కువ మోతాదులో ఎరువులు/పోషకాలను అందించడం వలన పాలిహౌస్ లేదా నెమటోడ్లలో ఈ నులిపురుగుల వృద్ధి/ పెరుగుదల 10-30 రెట్లు అధికంగా ఉన్నట్లు గమనించడమైనది.
నులిపురుగులు ఆశించే మొక్క భాగాన్ని బట్టి నులిపురుగులను రెండు రకాలుగా విభజిస్తారు
- వేరువ్యవస్థను ఆశించే నులిపురుగులు :
నులిపురుగులలో చాలా వరకు వేరు వ్యవస్థనే ప్రధానంగా ఆశించి, రసం పీల్చి తద్వారా పంటలను నష్టపరుస్తాయి. ఉదా: మెలాయిడోగైన్ నిమటోడులు, లీజన్ నిమటోడులు, బర్రోయింగ్ నిమటోడులు. మెలాయిడోగైన్ నిమటోడులు వివిధ రకాల పంటలను ఆశించి బుడిపెలు లేదా వేరుకాయలను ఏర్పరుస్తాయి. లీజన్ లేదా బర్రోయింగ్ నిమటోడులు వ్రేళ్ళ మీద నల్లటి మచ్చలు / చారలను కలుగజేస్తాయి.
- మొక్క పైభాగాన్ని ఆశించే నులిపురుగులు: మరికొన్ని రకాల నులిపురుగులు మొక్కపై భాగాలను ఆశించి రసం పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో ప్రధానమైనది లిల్లీ పూలను మరియు వరిని ఆశించే అఫ్లంకాయిడస్ జాతికి చెందిన నులిపురుగులు.
వివిధ ఉద్యానపంటలలో నులిపురుగులు ఆశించిన మొక్కల లక్షణాలు….
నులిపురుగులు ఆశించినప్పుడు మొక్కల పైభాగంలోనూ, వేరు వ్యవస్థలోనూ ఈ క్రింది లక్షణాలు కనబడతాయి.

మన రాష్ట్రంలో అరటి, జామ, చీని నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటలలో, కూరగాయలు, పూలమొక్కలు, నర్సరీలలో మరియు పాలీహౌస్లలో ఈ నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది.
- అరటిలో నులిపురుగుల లక్షణాలు:

అరటిని మెలాయిడోగైన్, లీజన్ మరియు ఐర్రోయింగ్ నిమటోడులు ప్రధానంగా ఆశిస్తాయి. ఇవి వ్రేళ్ళపై ‘బుడిపెలు లేదా వేరుకాయలు మరియు నల్లని చారలను కలిగిస్తాయి. ఇవి ఆశించడంవల్ల వ్రేళ్ళు, దుంప బలహీనపడి మొక్క నీటిని, పోషకాలను సరిగా తీసుకోలేదు. ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపి ఆకులు ఎండిపోతాయి వ్రేళ్ళు కుళ్ళిపోవడం వలన మొక్కలు పడిపోతాయి.
- జామ:-

జామలో మెలాయిడోగైన్ జాతికి చెందిన నులి పురుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఇవి ఆశించినపుడు ఆకులు పసుపు బారడం, వడలిపోవడం, కొమ్మలు ఎండి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్రేళ్ళపై బుడిపెలు లేదా వేరుకాయలు ఏర్పడడం, వ్రేళ్ళు కుళ్ళిపోవడం జరుగుతుంది.
3.బొప్పాయి:- మనదేశంలో నులిపురుగుల వలన బొప్పాయిలో దిగుబడులు 15-25 శాతం వరకూ తగ్గుతున్నాయని అంచనా, బొప్పాయిని కూడా మెలాయిడోగైన్ జాతికి చెందిన నులిపురుగులు వ్రేళ్ళను ఆశించి బుడిపెలు లేదా వేరుకాయలను ఏర్పరుస్తాయి. రసం పీల్చడం ద్వారా తోటలను నష్టపరుస్తాయి.
- దానిమ్మ:-

మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపురంగులోకి మారడం మరియు వాడిపోవడం. వేర్లపై ముత్యాల్లాంటి గడ్డలు కనిపిస్తాయి, దీని వల్ల నీరు మరియు పోషకాలు శోషణ తగ్గిపోతుంది. తీవ్రమైన పరిస్థితుల్లో, మొక్కలు ఎండిపోవడం, పండ్ల పరిమాణం మరియు నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు పోషక లోపం లేదా ఎండబారిన పరిస్థితుల లక్షణాల్లా కనిపిస్తాయి.
5. కూరగాయలు:- నియంత్రిత వాతావరణ పరిస్థితులలో పెంచబడుతున్న వంకాయ, కాప్సికం, టమాట వంటి మొక్కలలో, పందిరిజాతి కూరగాయలలో మరియు దుంపజాతి పంటలైన కంద, చామలలో కూడా ఈ నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది. వ్రేళ్ళ నుండి రసం పీల్చి, వేరుకాయలను ఏర్పరచడం ద్వారా మొక్క ఎదుగుదల లేక దిగుబడులు తగ్గిపోతాయి.
6. పూలమొక్కలు :- పాలీహౌస్లలో పెంచబడుతున్న కార్నేషన్, జెర్బెరా వంటి మొక్కలలో ఈ నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది. పూలమొక్కలలో వేరుకాయలు ఏర్పరిచే నులిపురుగులు ప్రధానమైనవి. లిల్లీ మొక్కలను అప్లం కాయిడస్ జాతికి చెందిన నులిపురుగులు ఆశిస్తాయి. ఇవి పువ్వులను ఆశించి రసం పీల్చడం వలన పూలమీద, కాడ దగ్గర, గోధుమరంగులో చారలు ఏర్పడతాయి. పువ్వు అంచులు మాడినట్లయి, నల్లగామారతాయి. నులిపురుగులు ఆశించడం వలన పూలు నాణ్యత కోల్పోయి మార్కెట్లో సరైన ధర పలకవ
7. ఔషధ మరియు సుగంధద్రవ్య పంటలు:-ఔషధ మొక్కలయిన బావంచాలు, తమలపాకులోను, ప్రధాన సుగంధద్రవ్య పంట అయిన పసుపులోను సులిపురుగుల సమస్యను గమనించడమైనది. ఈ పంటలలో నులిపురుగులు ఆశించడంవలన ఆకులు పసుపురంగులోకి మారి, మొక్కలు గిడసబారి తద్వారా ఎండిపోయి, దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
నులిపురుగుల నివారణకు పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు :-
సాంప్రదాయ పద్ధతులు :-
- వేసవిలో, మే-జూన్ మాసాలలో రెండుసార్లు లోతు దుక్కిలను చేయడం వలన వేరుకాయలను కలిగించే నులిపురుగులను నియంత్రించవచ్చు.
- ఆరోగ్యవంతమైన, నులిపురుగులు ఆశించని మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. అరటిలో టిష్యూ కల్చరు మొక్కలను ఎంచుకోవడం మేలైన పద్ధతి.
- విత్తనశుద్ధి :- కూరగాయల పంటలలో ఒక కేజీ విత్తనానికి 15 నుంచి 20 గ్రా॥ల చొప్పున సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ తో గాని, ట్రైకోడెర్మా విరిడితో గాని విత్తనశుద్ధి చేసుకోవాలి.
- సోయిల్ సోలరైజేషన్:- వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు 100 గాజ్ పరిమాణం కలిగిన పారదర్శక ప్లాస్టిక్ ను మట్టిమీద పరచి 3-6 వారాలపాటు ఉంచాలి. ఇలా చేయడం వలన మట్టిలోని నులిపురుగులు, శిలీంధ్రాలు, బాక్టీరియా మరియు కలుపుమొక్కలు నశిస్తాయి.
- అలసంద, ఆముదం వంటి నులిపురుగు ఆకర్షక మొక్కలను ప్రధానపంట మొక్కల చుట్టూ వేసి, మొలకెత్తిన 45 రోజుల తరువాత తీసివేయాలి. గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి మొక్కలతో పంటమార్పిడి చేసుకోవాలి.
- బంతి, ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు, ఆస్పరాగస్ వంటి మొక్కలు నులిపురుగులను వికర్షిస్తాయి.
- పంట కాలం పూర్తయిన తరువాత నులిపురుగులు ఆశించిన వేర్లను తీసివేసి తగుల బెట్టాలి. తోటల్లో కలుపులేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
- బాగా చివికిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదపు పిండి, వేపగింజల పొట్టు, ప్రెస్మడ్ వంటివి వేసుకోవడం వలన నులిపురుగులను నియంత్రించు కో కోవచ్చు.
జీవ నియంత్రణ పద్ధతులు:
–
వివిధ రకాల శిలీంధ్రాలు మరియు బాక్టీరియాలు నులిపురుగుల నివారణకు సమర్ధవంతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రధానమైనవి పెసిలోమైసిస్ లిలాసినస్, వెర్టీ సెల్లియం క్లాడోస్పోరియం, ట్రైకోడెర్మా హార్జియానమ్, ట్రైకోడెర్మా విరిడి మరియు సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. వీటిని జీవశిలీంధ్రనాశినులు అంటారు. ఇవి మార్కెట్లో పొడిరూపంలో దొరకుతాయి. వీటిని వేపపిండిలో కాని పశువుల ఎరువులో కాని వర్మీ కంపోస్టులో కాని వృద్ధి చేసుకుని నులిపురుగుల నియంత్రణకు ఉపయోగించుకోవచ్చు. జీవ రసాయనాలను వివిధ పద్ధతులలో నర్సరీలలోనూ, ప్రధానపొలంలోనూ వాడుకోవచ్చు.

రసాయనిక పద్ధతులు :- మొక్కలు నాటే 15 రోజుల ముందు, కిలో మట్టికి 100 మి.లీ. చొప్పున 0.5% ఫార్మలిన్ ద్రావణాన్ని మట్టిలో పోసి పాలిథీన్ షీట్తో కప్పాలి, నర్సరీలలో సులిపురుగుల నియంత్రణకు 5 కేజీల కార్బోప్యూరాన్ 3 జి గుళికల మందును ఒక టన్ను మట్టిలో కలపాలి. ప్రధాన పొలంలో నిమటోడుల నియంత్రణకు కార్బోప్యూరాన్ 3జి గుళికల మందును మొక్కకు 50 గ్రా॥ల చొప్పున వేసుకోవాలి. అరటిలో 3-4 నెలల వయస్సు ఉన్న మొక్కలకు 25 గ్రా॥ కార్బోప్యూరాన్ 3జి గుళికలు, 5 నెలలు పైబడిన అరటిమొక్కలకు 40 గ్రా॥ కార్బోప్యూరాన్ 3జి గుళికల మందును మొక్క మొదలు వద్ద 10 సెం.మీ. లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరుపెట్టాలి. అలాగే ఫ్లుయాజైన్డోలిజిన్ – 1 మి.లీ/లీ, ఫ్లుయోపైరామ్ 34.48% ఎస్. సి – 1 మి.లీ/లీ, సైక్లోబ్యూట్రిఫ్లూరామ్ 38.4% ఎస్. సి – 1 మి.లీ/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
డా. సిచ్. యస్. కిషోర్ కుమార్, డా. టి.హేమాద్రి, డా.యమ్. ఠాగూర్ నాయక్, డా. పి. దీప్తి, ఉద్యాన పరిశోధనా స్థానము, మహానంది, నంద్యాల జిల్లా, డా. వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం,ఫోన్ : 98855 22496.


























