యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి గారు మాట్లాడుతూ. యాసంగి సీజన్ కోసం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.45 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపి, 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.65 లక్షల మెట్రిక్ టన్నులు ఎమ్ఓపి, 0.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పి ఎరువులను రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని అన్నారు. గౌరవ మంత్రి వర్యుల ఆదేశాలతో రాష్ట్రానికి కేటాయించిన 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాల్సిందిగా కోరడం జరిగిందని, దానికి తగ్గట్లుగా నిరంతరము సంబంధిత అధికారులతో సంప్రదిస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఎరువులను ముందుగానే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ.. గత సీజన్ లో కేంద్ర ప్రభుత్వాన్ని సీజన్ ప్రారంభం కాకముందే అడిగినా ఎరువులు కేటాయించిన ప్రకారం సరఫరా చేయలేదని గుర్తుచేశారు. ఈ సీజన్ లో అయినా కేంద్రం కేటాయించిన ఎరువులను 60 నుంచి 70 శాతం మేర అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ లలో సరఫరా చేసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేటాయించిన ఎరువులలో 70 శాతం వరకు ముందస్తుగా తెప్పించుకున్నట్టయితే, తరువాత నిరంతరం వచ్చే ఎరువులతో కలిపి రైతులకు అవసరమున్నంత మేరకు, ఏదైతే గత యాసంగి, అంతకుముందు వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయగలిగామో అలానే ఈ యాసంగిలో కూడా చేయవచ్చని అధికారులకు సూచించారు.
కేంద్రం ప్రభుత్వము అక్టోబర్ మరియు నవంబర్ నెలలకు రాష్ట్ర ప్రభుత్వము కోరినట్లుగా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా కేటాయించిందని, అయితే గత నెలలో ఇంకా 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా, ఓడరేవుల నుండి రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉందని, ఈ నెలలో ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు, దీంతో 1.88 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ నుండి ఇప్పటివరకు సరఫరా అయినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 58 వేట టన్నుల డిఎపి, 2.09 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ బఫర్ నిల్వలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైల్వే శాఖ వారు వరంగల్ రేక్ పాయింట్ ను మూసివేసి goods handlings ను చింతలపల్లి పాయింట్ కు మార్చాలని నిర్ణయించడం జరిగిందని, ఇలా ఒక్కసారిగా వరంగల్ రేక్ పాయింట్ ను మూసివేయడం వలన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, కావున 4 నుండి 5 నెలల పాటు అది పూర్తి స్థాయిలో వాడకంలో వచ్చేదాకా వరంగల్ రేక్ పాయింట్ ను కొనసాగించాలని రైల్వే మంత్రి గారిని లేఖ ద్వారా అభ్యర్థించారు.
మరోవైపు నవంబర్ నెల యూరియా సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి 2.00 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ఎరువుల శాఖ కేటాయించగా, అందులో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి యూరియా (CIL–1.02 LMT, IPL–0.27 LMT) కాగా, మిగతా 0.71 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయ వనరుల నుండి కేటాయించబడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి CIL, IPL కంపెనీల నుండి రాష్ట్రానికి రావాల్సిన దిగుమతి యూరియాలో 0.37 లోటు ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో యూరియా వినియోగం ప్రధానంగా డిసెంబర్ మూడో వారం నుండి ఉంటుందని, ఆ సమయంలో మక్కజొన్న, వరి పంటలతో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఈ సమయాలలో ఎరువుల కొరత రాకుండా ఉండటానికి కేంద్రం వెంటనే 0.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియా కేటాయించడంతో పాటు, CIL ద్వారా త్వరితగతిన రవాణా చేయాలని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిగారిని కోరినట్లు తెలిపారు.
Leave Your Comments


























