తెలంగాణపశుపోషణపాలవెల్లువ

పాడి పంటల పెంపకానికి – కొత్త తరం రైతు రావాలి

0

ప్రస్తుతం 8.2 బిలియన్లలుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహార ఉత్పత్తి చేయడం, అందరికీ సమపోషకాలతో కూడిన   ఆహారం అందుబాటులో ఉంచడం కొరకు సరికొత్త వ్యవసాయ పాడి పంట అభివృద్ధికి యువ శ్రామిక శక్తి ఎంతో అవసరం తద్వారానే సుస్థిరమైన ఆహార వ్యవస్థలను నెలకొల్ప గలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా సగం మంది జనాభా వయస్సు 30 లేదా అంతకంటే తక్కువ మరియు 2030 చివరి నాటికి 57% పైన యువజన జనాభా చేరుకుంటుందని  అంచనా. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద యువత జనాభాలో ఒకటి, దాదాపు 600 మిలియన్ల మంది 25 ఏళ్లలోపు ఉన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం చాలా కీలకమైన రంగం. వ్యవసాయంలో యువతీ యువకులను నిమగ్నం చేయడం ద్వారా ప్రపంచ ఆహార భద్రతను పరిష్కరించడానికి మరియు దేశానికి పోషకాహార భద్రత, స్థిరమైన ఆహార ఉత్పత్తి మరియు సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడానికి ఎంతో కీలకమైనది. యువతీ యువకులు తాజా దృక్కోణాలు, వినూత్న ఆలోచనలు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలనే ఆసక్తిని కలిగి ఉంటారు, ఇది వ్యవసాయ రంగం అభివృద్ధి మరియు ఆధునికీకరణకు దోహదపడుతుంది.

సుస్థిర వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లు

వ్యవసాయం పైన యువత అనాసక్తి, తగ్గుతున్న వ్యవసాయ భూమి, వ్యవసాయ కూలీల కొరత, వివిధ కారణాలవల్ల తగ్గిన ప్రస్తుత రైతు ఉత్పాదకత సామర్థ్యం, తగ్గిన సారావంతమైన నేలలు, మరియు మరోవైపు పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ మరియు  పెరుగుతున్న టైర్- 2 & టైర్ -3 నగరాలు, కలుషితమవుతున్న నేల, నీరు మరియు గాలి, పంట మార్పిడి లేకపోవడం, వాతావరణ మార్పులు,  అకాల వర్షాలు,  వరదలు,  కరువు కాటకాలు, కలుపు సమస్య, బాహ్య పరిస్థితుల నుంచి ఒత్తిడి లోను అయ్యే వ్యవసాయ సాగు, మోతాదుకు మించి  గడ్డి మందులు మరియు పురుగు మందుల  వినియోగం, అకాల చీడపీడల ఉధృతి వలన  పంట నష్టం జరగడం, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, ఆర్థిక మందగమనం,  పంట సరళిలో మార్పులు,  మార్కెట్లో వాణిజ్య  పంటలకు ఉన్న డిమాండ్,  వివిధ ఆహార పంటలు, పండ్లు కూరగాయలు, పాడి ఉత్పత్తులు, ఆక్వా ప్రొడక్ట్స్ పంట కోత అనంతరం  నిల్వ, రవాణా,  మరియు మార్కెటింగ్ సవాళ్లు, రైతు కుటుంబాలు  పంట కాలవ్యవధుల ఆధారంగా  కొన్ని పంటలను మాత్రమే పండించడం, జీవన విధానంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ  రంగంలో వచ్చే లాభనష్టాలను  ఇతర  రంగాలతో పోల్చుకోవడం,  చిన్న కుటుంబాలు, తగ్గుతున్న రైతు కుటుంబ కూలీలు, రైతు కుటుంబ సభ్యులు పట్టణాలకు వలస వెళ్లడం, పెరుగుతున్న వ్యవసాయ ఉత్పాదకాల దిగుమతులు, పంట వ్యర్ధాల నిర్వహణ, ప్రభుత్వంపైన భారం పడుతున్న ఇన్పుట్ సబ్సిడీలు,  కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులు, గడ్డి మందులు, ఆహార గొలుసులో క్రిమిసంహారక మందుల అవశేషాలు, పాడి పశువులను పెంపొందించడంలో ఆసక్తి కనబరచకపోవడం, ఎగుమతి సబ్సిడీలు, ఆహార దిగుమతులు, ఆర్థిక మందగమనం, మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో ఒకే రకమైన పంట చేతికి వచ్చినప్పుడు ధరల ఆటుపోట్లకు లోనవ్వడం, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంట కోత సరైన నిల్వ చేసే గోడౌన్లు  లేకపోవడం, ఆహార కల్తీ మరియు కలుషిత ఆహార ప్రమాదాలు, ఉత్పత్తికి సరిపడా  ప్రాసెసింగ్ చేసే ఆహార పరిశ్రమలు  అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల అందరికీ అన్ని వేళల్లో కొనుగోలు శక్తి కనుగుణంగా అందుబాటులో తగిన పరిమాణంలో పోషకాహారం అందించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది.

ఆహార వృధా ద్వారా కలిగే నష్టాలు

మరోవైపు ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల ఆహార ఉత్పత్తులలో కేవలం 60 శాతం మాత్రమే మనం తింటున్నాము. సుమారు 23% పంట కోసిన నుండి రిటైల్ మార్కెట్ కు వచ్చే దారిలో వృధా అయిపోతుంది. మరో 7% రిటైల్స్ షాపులలో, ఇంకా 10 % మన ఇంటిలో, హోటల్స్, మరియు ఇతర క్యాటరింగ్ వంటి ఆహార సేవలలో వృధా అవుతుంది. మరో చేదు నిజం ఏమిటంటే గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 690 నుండి 780 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటించారు. ఆహార ఉత్పత్తులు వృధా కావడం ద్వారా వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేయడానికి వాడిన ముఖ్యంగా భూసారం, విత్తనాలు, వ్యవసాయానికి వాడిన నీళ్లు, కరెంటు, విలువైన రైతుల సమయం, ఎరువులు,  పెస్టిసైడ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందించిన వివిధ రకాల సబ్సిడీలు, వ్యవసాయ యాంత్రీకరణ  కొరకు వాడిన విలువైన ఇంధన వనరులు, కూలీల ఖర్చు పంట కోతనంతరం చేసిన వివిధ ఖర్చులు మొదలైనవి సుమారు 38 శాతం శక్తి వినియోగం వృధాగా పోతున్నాయి. దీనికి తోడు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి పెంచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వెచ్చించిన కోట్లాది రూపాయల పరిశోధన మరియు విస్తరణ ఖర్చులు వృధా అయ్యే అవకాశం ఉంటది. కావున పంట కోతానంతరం నష్టాలను తగ్గిస్తూ, పొలం నుండి వంటశాల వరకు  వ్యవసాయ  విలువ గొలుసును  పటిష్ట పరుస్తూ ఆహార ఉత్పత్తుల వృధాను తక్షణమే తగ్గించడానికి వివిధ రకాల ఆవిష్కరణలు  చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ ఒప్పందాల ద్వారా మెరుగుపరచడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు  ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వారి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ) కోరడమైనది.

వ్యవసాయంలో యువతకు అవకాశాలు

వ్యవసాయ పాడిపంటల ఉత్పత్తిలో మిగతా ఉత్పత్తి కారకాలతో పాటు రైతు శ్రామిక శక్తి కూడా అత్యంత విలువైన వనరు. వివిధ రకాల వ్యవసాయ పనులు చేయడానికి, పశువులు, మేకలు మరియు గొర్లు కాయడానికి, చేపల మరియు రొయ్యల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహణకు గణనీయమైన శ్రామిక శక్తి అవసరం.  కావున యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించడం, నేటి యువత ఆలోచన విధానాలకు శాస్త్రీయతను రంగరించి వ్యవసాయ యాంత్రికరణ, నవీన వ్యవసాయ పద్ధతులతో తక్కువ భూమి నుండి ఎక్కువ, తక్కువ నీటితో ఎక్కువ సాగు, తక్కువ శ్రామిక శక్తితో మిక్కిలి పనులు చేసే డిజిటల్ వ్యవసాయం, వ్యవసాయంలో రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విత్తనం నుండి పంట కోత వరకు సులభమైన, సౌకర్యవంతమైన పద్ధతులను  అభివృద్ధి పరుస్తూ వ్యవసాయం ఒక లాభసాటి వ్యాపారంగా మారుస్తేనే యువత వ్యవసాయం వైపు చూసే అవకాశం ఉంది.

  • వ్యవసాయ పాడిపంటలలో కెరీర్ మార్గాల వైవిధ్యాన్ని మరియు ఆ రంగంలో వృద్ధి మరియు ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవగాహన ప్రచారాలు మరియు కెరీర్ ఎక్స్‌పోలను నిర్వహించడం ద్వారా యువతను వ్యవసాయం వైపు మళ్ళించవచ్చు.
  • యువత ప్రయోజనాలను తీర్చే ఆధునిక సాంకేతికతలు, పద్ధతులు మరియు వ్యవసాయ వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను చేర్చడానికి వ్యవసాయ విద్య మరియు శిక్షణ కార్యక్రమాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థల ఒప్పందంతో పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.
  • సహజ వనరుల నిర్వహణ, యువత అభిరుచికి తగిన విధంగా వ్యవసాయ పాడి పంటల పెంపకాన్ని అంకుర పరిశ్రమగా మార్చడం, దాని నిర్వహణకు ఆర్థిక చేయూత, పంటలకు గిట్టుబాటు ధరలు, ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయడం. ఈ కామర్స్ కంపెనీలతో నేరుగా సంబంధాలు నెలకొల్పే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పండించిన ప్రతి గింజను మార్కెట్ చేసే విధంగా తోడ్పాటును
  • వ్యవసాయంలో వినూత్న సాంకేతికతలు మరియు డిజిటల్ సాధనాల స్వీకరణను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మరియు సమర్థవంతంగా మార్చడం.

ఎ.పోశాద్రి, పి. సత్యమూర్తి నాయక్, జి. రాజేందర్, ఎం. శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

 

Leave Your Comments

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

Previous article

ఆకర్షణీయమైన ఆంతురియం పూల సాగులో మెళకువలు

Next article

You may also like