పసుపు సాగు చేసే రైతులు సాధారణంగా చేతికొచ్చే దశలో మేలైన విత్తన దుంపలను ఎంపిక చేసుకుంటారు. ఈ విత్తన దుంపలను, తదుపరి సంవత్సరం, ప్రధాన పొలంలో విత్తుతారు. పసుపులో నారు పెంచి నాటడం సాంప్రదాయకంగా లేనప్పటికీ, సాంప్రదాయ పద్ధతుల కంటే ప్రో-ట్రే నర్సరీ పద్ధతిలో పసుపు దుంపలను పెంచడం వలన నాణ్యమైన, ఆరోగ్యకరమైన మరియు తెగులు సోకని నారుని ఉత్పత్తి చేసి, పంటను ముందుగానే నాటుకోవచ్చు. ఈ పద్ధతిలో పసుపు విత్తన దుంపలను సుమారు 57 గ్రాముల బరువు ఉండేలా చిన్న ముక్కలుగా వేరు చేసి 30 రోజుల వరకు ట్రేలలో పెంచి, ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. ఈ క్రొత్త పద్దతి పై రైతులకు అవగాహన లేదు.
ప్రయోజనాలు :
- విత్తన దుంపలను కీటక, శిలీంద్ర నాశినులుతో శుద్ధి చేయడం వలన మొక్కలని ఆశించే చీడ పీడల బారి నుండి కాపాడి పటిష్టమైన మరియు ఆరోగ్యకరమైన మొక్కలు పొందవచ్చు.
- ప్రో-ట్రేలలో పెంచిన మొక్కలు సాధారణంగా 28-35 రోజుల్లో నాటడానికి సిద్దంగా ఉంటాయి. ఇది ముందుగానే దుంపల అభివృద్ధికి మరియు పొలంలో తక్కువ మొత్తం పంట కాలానికి దారితీస్తుంది.
- ప్రో-ట్రేలు నాటిన విత్తన దుంపలకు ప్రతి మొక్కకు ఒకే రకమైన మొక్కల పెరుగుదల ఉండటం వల్ల ప్రధాన పొలంలో మంచిగా నిలదొక్కు కుంటాయి.
- ప్రో-ట్రేలలో పెంచిన నారు వేర్ల వ్యవస్థ బాగా వృద్ధి చెంది మొక్కలను సులభంగా పీకి నారు నాటే సమయంలో వేర్ల నష్టం తగ్గించుకోవచ్చు. దీని వలన మొక్క పొలంలో త్వరగా నిలదొక్కు కుంటుంది.
- ప్రో ట్రేలలో పసుపు దుంపలు పెంచడం వల్ల క్షేత్ర నర్సరీలతో పోలిస్తే తక్కువ నీరు మరియు ఎరువులు అవసరం
- ప్రతికూల క్షేత్ర పరిస్థితులను అధిగమించడానికి నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచవచ్చు.
- విత్తన దుంపలను నేరుగా నాటడంతో పోలిస్తే ఒక కణుపు దుంప నాటడం వల్ల విత్తన దుంపల పరిమాణం మరియు సంఖ్య తగ్గించుకొని సాగు ఖర్చు ఆదా చేయవచ్చు.
- నూతన రకాల సాగు ప్రతి విత్తన దుంపని విడి భాగాలుగా చేయడం వల్ల ఖరీదైన నూతన పసుపు రకాలను సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు.
ప్రో-ట్రేలలో పసుపు మొక్కలను పెంచడానికి దశలు…..
- దుంపల ఎంపిక మరియు తయారీ: నాణ్యమైన విత్తన దుంపల కోసం తెగులు సోకని ఆరోగ్యకరమైన తల్లి దుంపలను ఎంచుకోవాలి. నాటడానికి ఒక నెల ముందు, దుంపలను 5-7 గ్రాముల బరువుతో ఉండేట్లు కత్తిరించుకోవాలి. ప్రతి కత్తిరింపు ముక్కలో ఒక కణుపు ఉండే విధంగా కత్తిరించుకోవాలి. దీనిని “ఒక కణుపు మొగ్గ దుంపలు” అని కూడా అంటారు. ఇలా కత్తిరించిన పసుపు దుంపలను లీటరు నీటికి 3గ్రా. చొప్పున రిడోమిల్ యం. జడ్ (మెటాలాక్సిల్ 4% + మాంకోజెబ్ 64% WP ) శిలీంధ్ర నాశిని మరియు పురుగుమందు 1.6 మి. లీటర్లు మోనోక్రోటోఫాస్ ద్రావణం తయారు చేసుకొని 45 ని. ముంచుకొని విత్తన శుద్ధి చేయడం తర్వాతి దశలో వచ్చే పురుగులు, తెగుళ్ళు నియంత్రించవచ్చు.
- నారు పెంచుటకు ఉపయోగించే మాధ్యమం తయారీ: కొబ్బరి పీచుతో తయారు చేసిన కోకో పీట్ తేమను నిలుపుకొనే సామర్థ్యం కలిగి దుంప మొలకెత్తుట వాడుతారు.ఒక వేళ వర్మికంపోస్ట్ వాడినట్లయితే దానికి సమపాళ్ళలో కోకో పీట్ కలిపి ట్రేలను నింపవచ్చు. నారు దశలో వచ్చే మొదలు కుళ్ళు నివారణకు కోకో పీట్, వర్మికంపోస్ట్ తో పాటు ట్రైకోడెర్మా విరిడి పొడి మందు (2:1:1) నిష్పత్తిలో కలిపి మిశ్రమం వాడుతున్నట్లయితే నాణ్యమైన మొక్కలని పెంచవచ్చు.
- ప్రో-ట్రేలను నింపడం: పసుపు కోసం సాధారణంగా 48-50 సెల్ (గుంత) గల ట్రేలు ఉపయోగిస్తారు. ప్రతి గుంతకు అడుగు భాగాన రంధ్రాలు ఉండి తేమ శాతాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. ట్రే వాడే ప్రతిసారి శుభ్రమైన నీటితో కడిగి శిలీంధ్ర నాశిని శుద్ధి చేసుకోవాలి. ప్రో-ట్రే యొక్క ప్రతి సెల్ను సిద్ధం చేసిన నర్సరీ మాధ్యమంతో నింపాలి. ఒక్క దుంప 0.5 సెం.మీ. లోతులో వేసి తయారు చేసిన మాధ్యమంతో కప్పాలి. ఈ విధంగా తయారు చేసిన ట్రేలను ఒక దానిపై ఒకటి సుమారు 5-6 ట్రే లు అమర్చి పాలిథీన్ కవరుతో కప్పాలి. దీని వల్ల తేమ శాతం సమృద్ధిగా ఉండి వేసిన దుంప 3-6 రోజుల్లో మొలకెత్తడం ప్రారంభం అవుతుంది. మొలకెత్తడం మొదలైన వెంటనే ట్రేలను వేరు చేసి క్రమం తప్పకుండా నీటితో తడుపుతూ ఉండాలి. నారు పోషణ కొరకు 19:19:19 మిశ్రమాన్ని 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 15 రోజులకు పిచికారి చేసుకోవాలి.
- నర్సరీ నిర్వహణ: ప్రో-ట్రీలను షేడ్ నెట్ హౌస్ కింద ఉంచండము వల్ల దుంప మొలకెత్తడానికి మరియు ప్రారంభ పెరుగుదలకు నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది.
- నీటిపారుదల: సన్నని నీటిని చల్లే రోజ్ క్యాన్ లేదా తగిన స్ప్రింక్లర్లు/ తుంపర్ల ను ఉపయోగించి అవసరాన్ని బట్టి నీరు అందించాలి.
- మొక్కలను గట్టి పరచడం: ప్రధాన పొలంలో నాటడానికి ముందు, మొక్కలను 3-4 రోజులు క్రమంగా నీటిపారుదల కొద్దిగా ఆపివేయడం మరియు నీడను తగ్గించడం వంటివి చేయడం వల్ల మొక్కలు క్షేత్ర వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడుతుంది.
- ప్రధాన పొలంలో నాటడం: పసుపు మొక్కలు సాధారణంగా 3-4 ఆకులు వచ్చినప్పుడు, 28-30 రోజుల్లో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ముందుగా సిద్ధం చేసిన ఎత్తు మడులలో నాటుకోవాలి. ఈ పద్ధతిలో 1.2 మీ. వెడల్పు మరియు 30 సెం.మీ ఎత్తు ఉన్న ఎత్తైన మడిని తయారు చేసుకోవాలి. మడుల మధ్య అంతరం 30 సెం.మీ ఉంచి నాటుకోవాలి.
ఈ దశలను అనుసరించడం ద్వారా, రైతులు అధిక నాణ్యత గల పసుపు దిగుబడి సాధించడానికి ప్రో-ట్రే నర్సరీ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు, ఇది మెరుగైన పంట నిలదొక్కుకొని, తక్కువ పెట్టుబడి ఖర్చులు, అధిక దిగుబడులకు దారితీస్తుంది.
డా. వి.మురళి, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం, ఆదిలాబాద్ సయ్యద్ ఇర్ఫాన్ అలీ (Ph.D స్కాలర్) ఫోన్ : 6304749921


























