TS Agri Minister Niranjan Reddy: గురువారం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటిసాగును పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్ లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గారు హాజరయ్యారు.
సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. అందువలన సేంద్రీయ ఎరువులతో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం మీద రైతాంగం దృష్టి సారించాలి అని పేర్కొన్నారు. దేశంలోని 5,6 రాష్ట్రాలలోనే అన్ని రకాల పంటలు పండుతాయి. ఆయా రాష్ట్రాలలో పంటల సాగు పద్దతులు, రైతులు, శాస్త్రవేత్తల, అధికారుల అనుభవాలను తీసుకుని మా రాష్ట్రానికి అవసరం వచ్చేలా ఉపయోగించుకోవాలన్నది మా తాపత్రయం అని మంత్రి అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వినూత్న విధానాలతో వ్యవసాయాన్ని బలోపేతం చేశాం.. మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం అని అన్నారు. ఏపీలోనూ వ్యవసాయానికి ఇక్కడి పరిస్థితుల మేరకు సాయం అందుతున్నది. పంటల దిగుబడి పెరగాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి .. అంతిమంగా రైతుకు ఆదాయం రావాలి అన్నది లక్ష్యం అని పేర్కొన్నారు.
కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లో మొదటి నుండి అరటిపంటలు ఉన్నాయి. తెలంగాణలో ఇటీవల అరటిసాగు ఏటేటా పెరుగుతున్నదని రైతులు విత్తనాలు వేసుకోవడానికి ముందే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లలో పరీక్షలు చేయడం అభినందనీయం అని మంత్రి అన్నారు. ఇది రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Palle Nidra: వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి – మంత్రి నిరంజన్ రెడ్డి.!