Minister Niranjan Reddy: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాజ్ కోట్ లోని శక్తిమాన్ ఇండస్ట్రీని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలోని బృందం సందర్శించింది. ఈ బృందంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు, అగ్రోస్ జీఎం రాజమౌళి గారు ఉన్నారు.
Also Read:Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోని 11 రాష్ట్రాల నుండి వచ్చి వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూలీలుగా పనిచేస్తున్నారు. యూపీ, బీహార్, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాల నుండి కూలీల రాక ఎక్కువగా ఉన్నది. వ్యవసాయంలో వీలయినంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు.
మన దేశంలో చిన్న కమతాలకు అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద కమతాలకు అనుగుణంగా తయారు చేసుకున్న యంత్రాలు మన రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో దాదాపు 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రైతాంగాన్ని వేగంగా పంటల వైవిద్యీకరణతో పాటు యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయ పరికరాలు తయారుచేస్తున్న శక్తిమాన్ ఇండస్ట్రీని తెలంగాణ బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా పర్యటనలో భాగంగా ఆదర్శ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోండల్ ను బృందం సందర్శించింది. గోండల్ లో నిర్వహిస్తున్న వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ను బృందం సందర్శించింది. తెలంగాణలో వేరుశెనగ విస్తృతంగా సాగు చేస్తున్న నేపథ్యంలో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్న శక్తిమాన్ కంపెనీ తెలంగాణలో యూనిట్ నెలకొల్పాలని ఆహ్వానం పలికారు.
ప్రభుత్వపరంగా భూమి కేటాయింపు, అన్ని రకాల అనుమతులు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మంత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పర్యటన బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు, అగ్రోస్ జీఎం రాజమౌళి గారు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రముఖ జ్యోతిర్లిగం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసారు.
Also Read: Terminalia Chebula Health Benefits: కరక్కాయతో ఎన్నో ఉపయోగాలు.!